Pawan Kalyan health update : పవన్కు సర్జరీ.. ముంబయి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు
Pawan Kalyan health update : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. పవన్ కళ్యాణ్ కుడి భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. రెండు భుజాల రోటేటర్ కఫ్ తీవ్రంగా దెబ్బతినడంతో, వైద్యులు ఆయన కుడి భుజానికి సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలోని ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి చేరుకుని, పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని జనసేన పార్టీ అధికారికంగా ఎక్స్ వేదికగా వెల్లడించింది. కుడి భుజానికి కట్టుతో ఉన్న పవన్ కళ్యాణ్ పక్కన సీఎం చంద్రబాబు కూర్చుని ఉన్న ఒక ఫోటోను కూడా పార్టీ షేర్ చేసింది.
పవన్ కళ్యాణ్కు రెండు భుజాల రోటేటర్ కఫ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ, ఏపీ ఎన్నికలు, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తన అధికారిక బాధ్యతల నిమిత్తం ఆయన ఈ శస్త్రచికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు.
ఆపరేషన్ తర్వాత రికవరీ సులభంగా ఉండటం కోసం వైద్యులు ప్రస్తుతానికి కేవలం కుడి భుజానికి మాత్రమే సర్జరీ చేశారు. ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత శస్త్రచికిత్స చేయనున్నారు. నిజానికి ఈ గాయం 2016 నాటిదని, ఆ తర్వాత కాలంలో నిరంతర ప్రజా పర్యటనలు, రాజకీయ ర్యాలీలు, ఎన్నికల ప్రచారాల వల్ల ఇది మరింత తీవ్రంగా మారినట్లు పార్టీ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు జరిగిన ముక్కు సర్జరీకి ముందు చేసిన వైద్య పరీక్షల్లో భుజం గాయం తీవ్రత బయటపడింది.
ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్కు ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే సర్జరీ చేస్తున్న సమయంలో వైద్యులకు కుడి భుజంలో తీవ్రమైన రోటేటర్ కఫ్ గాయంతో పాటు అదనంగా అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల సర్జరీ ఊహించిన దానికంటే కాస్త సంక్లిష్టంగా మారింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ అనంతరం పవన్ను రికవరీ రూమ్కు తరలించారు.
పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాలు
పవన్ కళ్యాణ్ చివరిగా 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రామ్ తాళ్లూరి నిర్మాణంలో వస్తున్న 'PSPK32' (వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు) చిత్రంతో పాటు, సుజీత్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'OG 2' షూటింగ్ల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి పవర్ స్టార్ విశ్రాంతి తీసుకోవాలి. రెండు నెలల తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ పూర్తయ్యాక ఆయన మళ్లీ సినిమాల్లో, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


