అమితాబ్ బచ్చన్కు కూడా ఆ పరిస్థితి తప్పలేదు.. ఆ సినిమాలతో చాలా నష్టపోయాం: తన భర్త ఆర్థిక కష్టాలపై రకుల్ ప్రీత్ సింగ్
తన భర్త ఆర్థిక నష్టాలు, కష్టాలపై నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. రెండు, మూడు సినిమాలతో తీవ్రంగా నష్టపోయామని, అయితే తమ ప్రొడక్షన్ హౌస్ మూసేస్తున్నామన్న వార్తలను మాత్రం ఆమె ఖండించింది.
టాలీవుడ్తోపాటు బాలీవుడ్లోనూ తనకంటూ పేరు సంపాదించుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త ఆర్థిక ఇబ్బందులపై స్పందించింది. గతేడాది వచ్చిన 'బడే మియాన్ చోటే మియాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై నటి, జాకీ భార్య అయిన రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. తమ నిర్మాణ సంస్థను మూసివేయలేదని, పరిస్థితిని మీడియాలో అతిగా చేసి చూపించారని ఆమె స్పష్టం చేసింది.

రకుల్ ప్రీత్ ఏమన్నదంటే?
'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ రకుల్ ప్రీత్ సింగ్ తమ కుటుంబం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను వివరించింది. పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మూతపడలేదని క్లారిటీ ఇచ్చింది.
"మనం ఈ రోజు క్లిక్-బైట్ (ఇంటర్నెట్లో క్లిక్స్ కోసం ఆకర్షించే లింక్స్) సంస్కృతిలో ఉన్నాం. జనాలకు ఆకర్షించే వార్తలు కావాలి. అందుకే లేనిపోనివి రాస్తుంటారు. కానీ నాకు వాస్తవం ఏంటో తెలుసు. బయట వచ్చే పుకార్ల వల్ల నేను ప్రభావితం కాను. పరిశ్రమలో ఉన్నప్పుడు బయట వినిపించే ఈ పుకార్లను పట్టించుకోకుండా ముందుకు సాగాలి" అని రకుల్ చెప్పింది.
అమితాబ్ బచ్చన్కే తప్పలేదు..
కుటుంబానికి ఇది నిజంగా సవాలుతో కూడుకున్న సమయమని రకుల్ అంగీకరించింది. "వార్తల్లో వచ్చినవన్నీ నిజం కాదు. ఏ కంపెనీ మూతపడలేదు. నాకు అసలు విషయం తెలుసు కాబట్టి నేను ఆ వార్తలను పట్టించుకోలేదు. అవును రెండు మూడు సినిమాలు ఆడలేదు. దానివల్ల భారీ ఆర్థిక నష్టం వచ్చింది. అది వాస్తవమే. కానీ ప్రతి నిర్మాతకు ఇది జరుగుతుంది. ఒకానొక సమయంలో అమితాబ్ బచ్చన్ కు కూడా ఇది జరిగింది. ఇదొక దశ మాత్రమే" అని రకుల్ తెలిపింది.
జాకీ భగ్నానీ ఆర్థిక కష్టాలు
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన 'బడే మియాన్ చోటే మియాన్' 2024లో అతిపెద్ద హిట్గా నిలుస్తుందని భావించారు. కానీ అది ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్గా మిగిలింది. ఈ దెబ్బతో జాకీకి చెందిన పూజా ఎంటర్టైన్మెంట్ ఆర్థిక సంక్షోభంలో పడిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
సినిమా విడుదలైన తర్వాత తమ పేమెంట్స్ క్లియర్ చేయలేదని పలువురు సిబ్బంది ఆరోపించారు. పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల నడుమ సుమారు రూ. 250 కోట్ల అప్పు తీర్చడానికి ముంబైలోని తమ 7 అంతస్తుల ఆఫీసును అమ్మేశారనే వార్తలు కూడా వచ్చాయి.
గతేడాది సినిమా షూటింగ్ సమయంలో అబుదాబి అధికారుల నుండి తీసుకున్న సబ్సిడీ నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ వషు భగ్నానీ, జాకీ భగ్నానీలు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

E-Paper












