...
...
Next Story

Peddi Release Date: పెద్ది రిలీజ్ మళ్లీ వాయిదా.. జూన్‌లో వస్తుందని చెప్పినా డేట్ వెల్లడించని మేకర్స్

Peddi Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన ఈ మూవీ.. ఇప్పుడు జూన్ నెలకు షిఫ్ట్ అయింది.

Published on: Apr 15, 2026, 19:00:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Peddi Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా చుట్టూ గత కొన్నాళ్లుగా వాయిదా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లను కొట్టిపారేస్తూ ఈ నెల ప్రారంభంలోనే చరణ్ క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, వాయిదా పడే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ బుధవారం (ఏప్రిల్ 15) చిత్ర యూనిట్ అధికారికంగా సినిమాను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

క్వాలిటీ కోసం వెనక్కి తగ్గిన చిత్ర బృందం

Peddi Release Date: పెద్ది రిలీజ్ మళ్లీ వాయిదా.. జూన్‌లో వస్తుందని చెప్పినా డేట్ వెల్లడించని మేకర్స్
Peddi Release Date: పెద్ది రిలీజ్ మళ్లీ వాయిదా.. జూన్‌లో వస్తుందని చెప్పినా డేట్ వెల్లడించని మేకర్స్

పెద్ది సినిమా వాయిదాపై చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. టెక్నికల్ అంశాల్లో రాజీ పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు.

"సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం ఒక పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మేము ఎడిట్ చూశాం. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ఇంతటి అద్భుతమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అత్యుత్తమంగా అందించాలని మా తాపత్రయం. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మా టెక్నీషియన్లకు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం" అని ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతానికి సినిమాను జూన్‌లో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని టీమ్ తెలిపింది.

చరణ్ హామీ ఇచ్చినా తప్పని వాయిదా

ఈ నెలలో తన సోదరి నిహారిక కొణిదెల నిర్మించిన 'రాకాస' చిత్ర ప్రమోషన్లలో చరణ్ పాల్గొన్నారు. ఆ సమయంలో 'పెద్ది' వాయిదా పడుతోందనే వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు.

"నేడు టాకీ పార్ట్ పూర్తయింది. వాయిదా పడుతుందని ఎవరైనా అనుకుంటే అది తప్పు. షూటింగ్ అంతా అయిపోయింది. కేవలం ఒక పాట మాత్రమే మిగిలి ఉంది. పెద్ది వాయిదా పడలేదని అందరికీ చెప్పండి" అని చరణ్ ఆ వీడియోలో చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ముందుగా ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అప్పుడు ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఇప్పుడు రెండోసారి వాయిదా పడి జూన్‌కు చేరింది. ఏదేమైనా, మెగా అభిమానులు తమ హీరోను వెండితెరపై చూడటానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'పెద్ది' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

మొదట ఏప్రిల్ 30, 2026న విడుదల కావాల్సిన 'పెద్ది' సినిమా ఇప్పుడు జూన్ నెలకు వాయిదా పడింది. కచ్చితమైన తేదీని చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనుంది.

2. పెద్ది సినిమా వాయిదా పడటానికి కారణం ఏమిటి?

పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పక్కాగా ఉండాలని, ప్రేక్షకులకు అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతిని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు.

3. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు?

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆమెకు ఇది తెలుగులో రెండో సినిమా.

4. సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉందా?

టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe