Ram Charan: డైపర్లు మార్చడం మాత్రం నా వల్ల కాదు.. అది చేయాల్సి వస్తే మెల్లగా జారుకుంటాను.. ఉపాసనే బాస్: రామ్ చరణ్
Ram Charan: మెగా పవర్స్టార్ రామ్ చరణ్ తన తాజా మూవీ 'పెద్ది' (Peddi) ప్రమోషన్లలో భాగంగా 'టైమ్స్ నౌ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముగ్గురు పిల్లల తండ్రిగా తన బాధ్యతలు, భార్య ఉపాసనతో ఉన్న బాండింగ్, 'పెద్ది' సినిమా కోసం పడ్డ కష్టం గురించి మాట్లాడారు.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన మోస్ట్ అవేటెడ్ మాస్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ విడుదల కోసం సిద్ధమవుతూ, ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన కేవలం సినిమా విశేషాలే కాకుండా, తన పర్సనల్ లైఫ్, తండ్రిగా తన ప్రయాణం గురించి చాలా సరదాగా, ఓపెన్గా మాట్లాడారు.

పిల్లల పెంపకంలో ఆ ఒక్కటి తప్ప.. అన్నీ చేస్తా!
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒక కుమార్తె (క్లిన్ కారా), అలాగే ఇటీవలే (జనవరి 2026లో) జన్మించిన కవలలు (ఒక బాబు, ఒక పాప) ఉన్న సంగతి తెలిసిందే. ముగ్గురు పిల్లల తండ్రిగా తన బాధ్యతల గురించి చరణ్ మాట్లాడారు.
"నేను మంచి తండ్రినా లేక సాధారణ తండ్రినా అనేది నాకు తెలియదు. కానీ పిల్లల పెంపకంలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాను. వాళ్లకు అన్నం తినిపించడం, నిద్రపుచ్చడం అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. క్లిన్ కారా దాదాపు ప్రతి రాత్రి నాతోనే పడుకుంటుంది. ఒక తండ్రి చేసే పనులన్నీ నేను చేస్తాను.. కానీ ఒక్క డైపర్ మార్చే విషయంలో మాత్రం, ఆ టైమ్ రాగానే రూమ్ లోంచి మెల్లగా జారుకుంటాను (నవ్వుతూ)" అని చెప్పారు.
ఇంట్లో ఉపాసనే 'బాస్'
తన భార్య ఉపాసన కొణిదెల గురించి మాట్లాడుతూ చరణ్ ఒక సరదా కామెంట్ చేశారు. "ఇంట్లో ఉపాసనే బాస్.. పెళ్లయ్యాక ప్రతి మగాడికి ఇది నేర్పిస్తారు (నవ్వుతూ). మా లైఫ్ చాలా స్పాంటేనియస్గా సాగిపోతుంది. ఒక నటుడి జీవితం ఎప్పుడు ఎక్కడ ఉంటామో, ఎంత లేట్గా వర్క్ చేస్తామో తెలియదు. కాబట్టి ఒకే ఇంట్లో తల్లిదండ్రులతో లేదా భార్యతో లైఫ్ను ప్లాన్ చేసుకుని జీవించడం కష్టం. దీని వెనుక ఎంతో అడ్జస్ట్మెంట్ ఉంటుంది" అని తెలిపారు.
స్కూల్ మేట్స్ నుండి ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల వరకు..
రామ్ చరణ్, ఉపాసనల పర్సనల్ లైఫ్ టైమ్లైన్ ఒకసారి చూస్తే.. ఈ ఇద్దరూ స్కూల్ డేస్ లోనే ఫ్రెండ్స్. తర్వాత చాలా కాలం గ్యాప్ వచ్చినా.. మళ్లీ హైదరాబాద్ లో కలిశారు. జూన్ 2012లో పెళ్లి చేసుకున్నారు. 2023లో వీళ్లకు క్లిన్ కారా జన్మించింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో కవలలు జన్మించారు.
'పెద్ది' కోసం చరణ్ పడ్డ కష్టం
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో జూన్ 4, 2026 న విడుదల కాబోతున్న ‘పెద్ది’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. విజయనగరానికి చెందిన ఒక వ్యక్తి క్రికెట్, సాంప్రదాయ కుస్తీ, స్ప్రింటింగ్ వంటి విభిన్న క్రీడల్లో పోటీ పడి ‘క్రాస్ఓవర్ అథ్లెట్’గా ఎలా ఎదిగాడనే కథాంశంతో ఈ మాస్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది.
ఈ పవర్ఫుల్ పాత్ర కోసం చరణ్ కఠినమైన శిక్షణ తీసుకున్నారు. అంతేకాదు, షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు, కంటికి గాయాలైనా లెక్కచేయకుండా కష్టపడ్డారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకూమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్రశ్న: రామ్ చరణ్ కవల పిల్లల పేర్లు ఏమిటి?
జవాబు: రామ్ చరణ్, ఉపాసనల కవల పిల్లల పేర్లు శివ రామ్ కొణిదెల, అన్వీరా దేవి కొణిదెల.
ప్రశ్న: 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు?
జవాబు: ఈ సినిమాలో చరణ్ విజయనగరానికి చెందిన ఒక 'క్రాస్ఓవర్ అథ్లెట్' (Crossover Athlete) గా కనిపిస్తారు. ఆయన క్రికెట్, సాంప్రదాయ కుస్తీ, స్ప్రింటింగ్ వంటి క్రీడలలో పాల్గొనే విభిన్నమైన మాస్ పాత్రను పోషించారు.
ప్రశ్న: 'పెద్ది' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?
జవాబు: ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


