సౌందర్య పేరు వినగానే కంటతడి పెట్టిన రమ్యకృష్ణ.. జగపతి బాబు షోలో హార్ట్ టచింగ్ మూమెంట్
రమ్యకృష్ణ కంటతడి పెట్టింది. దివంగత నటి సౌందర్య పేరు వినగానే ఆమె ఏడ్చేసింది. జీ5లో వచ్చే జగపతి బాబు షో జయమ్ము నిశ్చయమ్ము రాలో గెస్ట్ గా వచ్చిన ఆమె.. సౌందర్యతో కలిసి తాను నటించిన నరసింహ మూవీ సీన్ చూడగానే కంటతడి పెట్టింది.
నటి రమ్యకృష్ణ ఇటీవల జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ5 (Zee5) టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’కు వచ్చింది. ఆ షోలో తమ స్నేహితురాలు, దివంగత నటి సౌందర్య (Soundarya) గురించి మాట్లాడేటప్పుడు రమ్యకృష్ణ భావోద్వేగానికి లోనై కంట తడి పెట్టింది. అమ్మోరు, నరసింహ వంటి చిత్రాల షూటింగ్ సమయంలోని జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకుంది.

సౌందర్యను తలచుకుని ఏడ్చేసిన రమ్యకృష్ణ
జగపతి బాబు తన జయమ్ము నిశ్చయమ్ము రా షోలో రమ్యకృష్ణతో మాట్లాడుతూ.. "మన ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న ఒక స్నేహితురాలి గురించి మాట్లాడాలనుకుంటున్నాను" అని చెప్పాడు. మొదట్లో ఉత్సాహంగా కనిపించిన రమ్యకృష్ణ.. తర్వాత సౌందర్య కనిపించగానే షాక్ తిన్నట్లుగా అనిపించింది. 1999లో వచ్చిన హిట్ మూవీ నరసింహలో తనతోపాటు నటించిన సౌందర్య క్లిప్ను చూసిన వెంటనే ఆమె కళ్లలో నీళ్లు తిరగడం మొదలైంది. ఆ వెంటనే ఆమె కళ్లలో నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి.
ఆమె పరిస్థితిని గమనించిన జగపతి బాబు.. "మేము ఆ క్లిప్ను ప్లే చేశాం, ఎందుకంటే ఇది మనం గుర్తుంచుకోవాల్సిన క్షణం. సౌందర్య పేరు లాగే ఆమె హృదయం కూడా చాలా సౌందర్యంగా ఉండేది" అని అన్నాడు. కొద్దిసేపటి తర్వాత.. జగపతి బాబు, సౌందర్యతో తన జ్ఞాపకాలను పంచుకోమని రమ్యకృష్ణను అడిగాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె ఇలా చెప్పింది.
"నేను సౌందర్యను మొదటిసారి అమ్మోరు (1995) షూటింగ్ సమయంలో చూశాను. నరసింహ సహా నేను ఆమెతో చాలా సినిమాల్లో పనిచేశాను. అమాయకురాలైన, సహజమైన, అందమైన చిన్నారి పెరిగి పెద్దదై తనను తాను తీర్చిదిద్దుకోవడం చూశాను. ఆమె తనకు వచ్చిన కీర్తికి ఏమాత్రం లొంగిపోలేదు. ఆమె ఒక అద్భుతమైన మనిషి, మంచి స్నేహితురాలు" అని రమ్యకృష్ణ పేర్కొంది. సౌందర్యతో తన స్నేహాన్ని వివరిస్తూ.. తమ పాత ఫొటోలను చూస్తూ రమ్యకృష్ణ చాలా భావోద్వేగానికి గురయింది.
సౌందర్య గురించి..
సౌందర్య 90వ దశకంలో ప్రముఖ నటిగా పేరుగాంచింది. నాగార్జున, చిరంజీవి నుండి కమల్ హాసన్, రజనీకాంత్ వరకు అందరితోనూ ఆమె నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ కూడా ఆమెతో కలిసి కొన్ని హిట్ చిత్రాలలో నటించారు. నాగార్జున, రమ్యకృష్ణ నటించిన 1994 నాటి చిత్రం 'హలో బ్రదర్' తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 'అమ్మోరు' చిత్రంలో ఆమె పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. ఆమె తన కెరీర్లో కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించింది.
2003 ఏప్రిల్ 27న ఆమె వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జి.ఎస్. రఘును పెళ్లి చేసుకుంది. వారి మొదటి వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజుల ముందు అంటే 2004 ఏప్రిల్ 17న, సౌందర్య తన సోదరుడు అమర్నాథ్తో కలిసి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి బెంగళూరు నుంచి కరీంనగర్ కు వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది.

E-Paper












