Shah Rukh Khan Dhurandhar: ధురంధర్ మూవీపై షారుఖ్ ఖాన్ రివ్యూ.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ట్వీట్
Shah Rukh Khan Dhurandhar: ధురంధర్ సినిమాలపై మొత్తానికి బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ స్పందించారు. అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన ఆయన.. ఈ రెండు సినిమాలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు.
Shah Rukh Khan Dhurandhar: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' లో నిర్వహించిన #AskSRK సెషన్లో రణ్వీర్ సింగ్ బ్లాక్బస్టర్ యాక్షన్ మూవీ 'ధురంధర్' పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు భాగాల స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ను చూశానని, టీమ్ వర్క్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

#AskSRK సెషన్లో ధురంధర్ రివ్యూ ఇచ్చేసిన కింగ్ ఖాన్
గణేష్ చతుర్థి సందర్భంగా ఫ్యాన్స్కు శుభాకాంక్షలు చెప్పడానికి X వేదికగా వచ్చిన షారుఖ్ ఖాన్.. వెంటనే దానిని సరదా #AskSRK సెషన్గా మార్చేశారు. ఈ క్రమంలో ఒక అభిమాని "సర్, మీరు రణ్వీర్ సింగ్ 'ధురంధర్' సినిమా చూశారా?" అని ప్రశ్నించారు.
దానికి షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో స్పందిస్తూ.. "రెండు పార్ట్లు చాలా బాగా నచ్చాయి.. టీమ్ మొత్తం అద్భుతమైన పనితీరు కనబరిచింది" అని రిప్లై ఇచ్చారు. కింగ్ ఖాన్ ఇచ్చిన ఈ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
స్పై థ్రిల్లర్ ధురంధర్ విశేషాలు
డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' ఫ్రాంచైజీలో రణ్వీర్ సింగ్ 'హంజా అలీ మజారీ' అనే అండర్ కవర్ ఇండియన్ ఏజెంట్గా నటించారు. కరాచీలోని క్రైమ్ నెట్వర్క్ను ఛేదించే ఇంటెన్స్ మిషన్లో హంజా పాత్ర కనిపించింది. అక్షయ్ ఖన్నా 'రెహ్మాన్ డెకాయత్' అనే నెగెటివ్ రోల్లో జీవించారు.
డిసెంబర్ 2025లో ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి వచ్చి అంచనాలను మించి హిట్ కాగా, మార్చి 2026లో వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' సీక్వెల్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. 1999 ఐసీ-814 విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై పేలుళ్ల వంటి యథార్థ సంఘటనల ఆధారంగా ఈ స్పై థ్రిల్లర్ను రూపొందించారు. సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు.
రూ.3,000 కోట్ల రికార్డ్ కలెక్షన్లు.. ఇండియాలోనే నంబర్ 1 ఫ్రాంచైజ్
బాక్స్ ఆఫీస్ దగ్గర ధురంధర్ ఫ్రాంచైజ్ సృష్టించిన సునామీ మామూలుది కాదు. ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,307 కోట్లకు పైగా గ్రాస్ సాధిస్తే, సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' ఏకంగా రూ.1,813 కోట్ల వసూళ్లతో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది.
ఈ రెండు సినిమాలు కలిపి గ్లోబల్గా రూ.3,000 కోట్ల మార్క్ను దాటేశాయి. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఫ్రాంచైజ్గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు 'బాహుబలి' ఫ్రాంచైజ్ (రూ.2,438 కోట్లు), 'పుష్ప' ఫ్రాంచైజ్ (రూ.2,092 కోట్లు) పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డులను ధురంధర్ తిరగరాసింది. ఇండియాలో కేవలం హిందీ నెట్ వసూళ్లే రూ.1,149.02 కోట్లు దాటి రికార్డు క్రియేట్ చేసింది. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది.
బిగ్ స్క్రీన్ పై షారుఖ్ 'కింగ్'.. ప్రొడక్షన్ అప్డేట్స్ ఇవే
ఇక షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కింగ్' మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్ డెబ్యూ చేయబోతున్నారు.
ఈ సినిమాలో దీపికా పదుకోన్, రాణీ ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. షారుఖ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సమయంలో తనకు కొన్ని గాయాలయ్యాయని ఆయన వెల్లడించారు. "షూటింగ్ సమయంలో దెబ్బలు తగలడం వల్ల కొన్నిసార్లు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది, ప్రస్తుతం గాయాలన్నీ నయమయ్యాయి.. వర్క్ దాదాపు పూర్తయింది" అని షారుఖ్ స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


