OTT Show: ఓటీటీలోకి సరికొత్త కామెడీ కుకింగ్ షో- హోస్ట్‌గా ఫిట్‌నెస్ ఐకాన్ శిల్పా శెట్టి- తల్లులతో ఆరుగురు సెలబ్రిటీలు!

Shilpa Shetty Cooking Show Maa Hai Na OTT Streaming: బాలీవుడ్ బ్యూటీ, ఫిట్‌నెస్ ఐకాన్ శిల్పా శెట్టి హోస్ట్‌గా చేస్తున్న సరికొత్త కామెడీ కుకుంగ్ షో 'మా హై నా'. ఆరుగురు సెలబ్రిటీలు తమ తల్లులతో కలిసి ఈ ఓటీటీ షోలో పాల్గొనున్నారు. మొత్తం 10 ఎపిసోడ్స్‌గా రానున్న మా హై నా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.

Published on: May 10, 2026, 20:12:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shilpa Shetty Cooking Show Maa Hai Na OTT Release: ప్రముఖ నటి, ఫిట్‌నెస్ ఐకాన్ శిల్పా శెట్టి కుంద్రా బుల్లితెరపై మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఆమె కేవలం వంటల చిట్కాలు చెప్పడమే కాకుండా, తల్లీపిల్లల మధ్య ఉండే అనుబంధాన్ని, ఆప్యాయతను వెండితెరపై ఆవిష్కరించనున్నారు.

ఓటీటీలోకి సరికొత్త కామెడీ కుకింగ్ షో- హోస్ట్‌గా ఫిట్‌నెస్ ఐకాన్ శిల్పా శెట్టి- తల్లులతో ఆరుగురు సెలబ్రిటీలు! (PTI)
ఓటీటీలోకి సరికొత్త కామెడీ కుకింగ్ షో- హోస్ట్‌గా ఫిట్‌నెస్ ఐకాన్ శిల్పా శెట్టి- తల్లులతో ఆరుగురు సెలబ్రిటీలు! (PTI)

వంటగదిలో జనరేషన్ గ్యాప్!

మాతృ దినోత్సవం సందర్భంగా జీ5 (ZEE5) ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'మా హై నా' అనే సరికొత్త హిందీ కామెడీ కుకింగ్ షోను అధికారికంగా ప్రకటించింది. మొత్తం 10 ఎపిసోడ్లుగా సాగే ఈ నాన్-ఫిక్షన్ సిరీస్ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వస్తోంది. నేటితరం (Gen Z) జీవనశైలికి, తల్లుల సంప్రదాయ ఆలోచనలకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని వంటగది వేదికగా ఇందులో చూపించనున్నారు.

లిటిల్ ఫ్రోడో ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ఈ ఓటీటీ షోలో ఆరుగురు సెలబ్రిటీలు తమ తల్లులతో కలిసి వంటల సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో వారి మధ్య జరిగే మనస్పర్థలు, భావోద్వేగాలు, సరదా సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా కంటతడి కూడా పెట్టిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు.

ఎవరెవరు పాల్గొంటున్నారంటే?

ఈ ఓటీటీ షోలో బుల్లితెర నటీనటులతో పాటు సోషల్ మీడియా స్టార్స్ కూడా మెరవనున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి:

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా భార్య సునీతా అహూజా తన కుమార్తె టీనా అహూజాతో కలిసి పాల్గొంటున్నారు.

'కసౌతీ జిందగీ కీ' ఫేమ్ ఊర్వశి ధోలాకియా తన కుమారుడు క్షితిజ్ ధోలాకియాతో సందడి చేయనున్నారు.

బిగ్ బాస్ 19 కంటెస్టెంట్ తాన్య మిట్టల్, ఆమె తల్లి సునీతా మిట్టల్.

కంటెంట్ క్రియేటర్ గుల్లు, ఆమె తల్లి మునేష్ తన్వర్.

ఫుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్ షాహిదా అన్సారీ తన మేనల్లుడు అఫ్గాన్ అన్సారీతో.

సోషల్ మీడియా సెలబ్రిటీ భాగ్యశ్రీ శర్మ తన తల్లి రింజు శర్మతో కలిసి పోటీ పడనున్నారు.

అమ్మ ఉన్నంత వరకు భయం లేదు!

ఈ షో గురించి జీ5 ఓటీటీ హిందీ బిజినెస్ హెడ్ కావేరీ దాస్ మాట్లాడుతూ.. "అమ్మంటే ఓ భరోసా, ఓ శక్తి. నేటితరం పిల్లల వేగాన్ని, తల్లుల ఓర్పును ఒకే వేదికపైకి తీసుకురావడమే మా ఉద్దేశం. జీవితం ఎంత వేగంగా మారినా, ఏ కష్టం వచ్చినా 'మా హై నా' (అమ్మ ఉందిగా) అనే ధైర్యం అందరికీ కలగాలని ఈ షో రూపకల్పన చేశాం" అని పేర్కొన్నారు.

ప్రొడ్యూసర్లు నీతి, ప్రీతి మాట్లాడుతూ.. వంటగదిలో జరిగే సంభాషణలు ఎంతో నిఖార్సుగా ఉంటాయని, ఆ వాతావరణమే ఈ షోకు ప్రధాన ఆకర్షణ అని తెలిపారు. శిల్పా శెట్టి వంటి అనుభవం ఉన్న హోస్ట్ ఈ షోకు మరింత నిండుదనాన్ని తీసుకొస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

జీ5 ఓటీటీలో

త్వరలోనే ఈ క్రేజీ కుకింగ్ షో మా హై నా జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. వంటలతో పాటు వినోదాన్ని ఆస్వాదించే తెలుగు ప్రేక్షకులకు కూడా ఇలాంటి షోలు హిందీలో ఉన్నప్పటికీ కొత్త అనుభూతిని ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More