Crime Thriller: ఇదో డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్.. ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ తెలుగు మూవీ మిస్ కావద్దు.. ఊహకందని క్లైమాక్స్
Crime Thriller: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సడెన్గా వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రేపు ఉదయం 10 గంటలకు’. హెబ్బా పటేల్, చైతన్య రావులాంటి వాళ్లు నటించిన ఈ సినిమా ఎలా ఉంది? అసలు ఎందుకు చూడాలో ఈ రివ్యూలో తెలుసుకోండి.
Crime Thriller: ఓటీటీలో ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలని అనుకుంటున్నారా? అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి శుక్రవారం (మార్చి 27) వచ్చిన ‘రేపు ఉదయం 10 గంటలకు’ అస్సలు మిస్ కావద్దు. టైటిల్ కు తగినట్లే.. మూవీ కూడా కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే, కన్ఫ్యూజన్ డైరెక్షన్, కన్ఫ్యూజన్ కామెడీతో ఆకట్టుకుంటోంది.

అసలేంటీ ‘రేపు ఉదయం 10 గంటలకు’ మూవీ?
మార్చి 14న సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చి అంతే సైలెంట్ గా వెళ్లిపోయిన మూవీ ఈ ‘రేపు ఉదయం 10 గంటలకు’. చెందు ముద్దు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, చైతన్య రావు, అభినవ్ గోమఠంలాంటి వాళ్లు నటించారు.
ఇప్పటికే ఓ పిట్ట కథ, అన్నపూర్ణ ఫొటో స్టూడియోలాంటి డిఫరెంట్ సినిమాలు అందించిన డైరెక్టర్ చెందు.. ఈ ‘రేపు ఉదయం 10 గంటలకు’తో అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. కేవలం రెండు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా స్టోరీ, అసలు ఎందుకు చూడాలో ఇక్కడ చూడండి.
‘రేపు ఉదయం 10 గంటలకు’ స్టోరీ ఇదీ..
‘రేపు ఉదయం 10 గంటలకు’.. సినిమా టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది కదూ. మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటుంది. ఓ శవాన్ని హైదరాబాద్ నుంచి కాకినాడకు తీసుకెళ్లే ఓ అంబులెన్స్ డ్రైవర్.. లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకునే ఓ జంట.. అనుకోకుండా డ్రగ్స్ కేసులో ఇరుక్కునే ఇద్దరు యువకులు.. ఓ వేశ్య దగ్గరికి వెళ్లి ఇరుక్కుపోయే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. వీళ్లందరినీ కలుపుతూ సాగిపోయే స్టోరీ ఇది.
సినిమా మొదట్లోనే ఓ వ్యక్తి మరణించినట్లుగా చూపిస్తారు. ఆ శవాన్ని కాకినాడకు తీసుకెళ్లడానికి ఓ అంబులెన్స్ డ్రైవర్ (అభినవ్ గోమఠం) బయలుదేరుతాడు. ఈ క్రమంలో అతడు లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకునే జంటకు లిఫ్ట్ ఇస్తాడు. మరోవైపు కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ కేసులో ఇరుక్కునే ఇద్దరు యువకుల స్టోరీ కూడా నడుస్తూ ఉంటుంది. అటు పెళ్లికి ముందే సెక్స్ కోరిక తీర్చుకోవడానికి వేశ్య (హెబ్బా పటేల్) దగ్గరికి వెళ్తాడు మరో యువకుడు (చైతన్య రావు). వీళ్లందరి మధ్య ఉన్న కామన్ లింక్ ఏంటి? రేపు ఉదయం 10 గంటలకు ఏం జరగబోతోంది అన్నదే మిగిలిన స్టోరీ.
‘రేపు ఉదయం 10 గంటలకు’ ఎందుకు చూడాలంటే..
ఇదో రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాదు. టైటిల్ కు తగినట్లే ఓ రివర్స్ స్క్రీన్ ప్లేతో ప్రతి సీన్ కూ ఆసక్తి రేపుతూ సాగుతుంది. సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్లకుండా ప్రేక్షకులను నవ్విస్తూనే కథ సాగే తీరు కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ప్రతి మూమెంట్ థ్రిల్ పంచుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సెకండాఫ్ లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను ప్రేక్షకులకు కలిగిస్తుంది.
అయితే సెకండాఫ్ లో కాస్త పట్టు తప్పినట్లుగా అనిపించినా.. ఊహకందని క్లైమ్యాక్స్ మాత్రం సినిమాను ఓ మంచి థ్రిల్ తో ముగిస్తుంది. అంతేకాదు అంతర్లీనంగా ఇచ్చిన సందేశం కూడా ఎమోషనల్ గా బాగుంది.
ఎవరెలా చేశారంటే?
వేశ్య పాత్రలో హెబ్బా పటేల్, అంబులెన్స్ డ్రైవర్ గా అభినవ్ గోమఠం తమ నటనతో అదరగొట్టారు. ముఖ్యంగా కామెడీ టచ్ జోడించి అభినవ్ చెప్పే ఫిలాసఫీ కూడా బాగుంది. అయితే టాలెంటెడ్ నటుడు చైతన్య రావును మాత్రం డైరెక్టర్ సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది.
ఓవరాల్ గా ‘రేపు ఉదయం 10 గంటలకు’ మూవీ ఈ వీకెండ్ ఓ మంచి థ్రిల్ వాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్లలోకి చడీచప్పుడు కాకుండా వచ్చి వెళ్లినా.. డిజిటల్ ప్లాట్ఫామ్ పై మంచి రెస్పాన్స్ సంపాదించగలిగే సినిమా ఇది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


