Rahul Sipligunj Case: చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. వైజాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.. ఏమైందంటే?
Rahul Sipligunj Case: టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై వైజాగ్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ యువతిని బెదిరించినట్లుగా రాహుల్ తోపాటు మరో 11 మందిపై ఈ కేసు నమోదు కావడంగ గమనార్హం.
Rahul Sipligunj Case: 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఊహించని లీగల్ చిక్కుల్లో పడ్డారు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు మరో 11 మందిపై ఒక యువతి తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి వివాదంలో బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో పోలీస్ వర్గాల్లో ఈ అంశం సంచలనంగా మారింది.

అసలేం జరిగింది? వైజాగ్ యువతి సంచలన ఆరోపణలు
ఈ హై ప్రొఫైల్ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బాధితురాలు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో అనేక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిదిగా పరిచయమైన కర్పూరపు రాహుల్ రెడ్డి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఆరోపించింది.
ఆ తర్వాత తన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు సదరు యువతి పేర్కొంది. తన పరువుకు, వ్యక్తిగత జీవితానికి తీవ్ర నష్టం కలిగించారంటూ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
రాహుల్ సిప్లిగంజ్ పాత్రపై సస్పెన్స్..
ఈ వ్యవహారంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నేరుగా జోక్యం చేసుకున్నట్లు బాధితురాలు తన ఫిర్యాదులో స్పష్టం చేసింది. రాహుల్ రెడ్డి తరఫున మాట్లాడేందుకు రాహుల్ సిప్లిగంజ్ తన వద్దకు వచ్చారని, తనకు అనుకూలంగా బలవంతంగా వీడియో స్టేట్మెంట్ ఇప్పించారని ఆరోపించింది.
ఈ మేరకు పోలీసులు బీఎన్ఎస్ (BNS) సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని విశాఖ ఎంవీపీ పోలీసులు ఈ ఫైల్ను తదుపరి విచారణ కోసం ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
వివాదానికి ఒకరోజు ముందే బోనాల హడావుడి
ఒకవైపు విశాఖలో సీరియస్ కేసు నమోదు కాగా మరోవైపు ఈ వివాదం వెలుగులోకి రావడానికి ఒక్క రోజు ముందే రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. పోతురాజు డ్యాన్స్ చేస్తూ ఉన్న ఒక వైబ్రెంట్ వీడియోను రాహుల్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు.
"పోతురాజు డ్యాన్స్ చేస్తుంటే ఇల్లంతా అమ్మవారి శక్తి ఆవహించినట్లు ఉంటుంది" అంటూ గ్రాండ్ క్యాప్షన్ జత చేశారు. అంతలోనే ఈ కేసు వార్త బయటకు రావడంతో ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు తీవ్ర షాక్కు గురయ్యారు. ఈ ఆరోపణలపై రాహుల్ సిప్లిగంజ్ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
యూట్యూబ్ సింగర్ నుంచి ఆస్కార్ స్టేజ్ వరకు..
హైదరాబాద్కు చెందిన రాహుల్ సిప్లిగంజ్ యూట్యూబ్లో ప్రైవేట్ జానపద పాటలు, గల్లీ సాంగ్స్తో తన కెరీర్ ప్రారంభించారు. తెలంగాణ యాసతో ఆయన పాడిన పాటలు కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి కంటెస్టెంట్గా వెళ్ళి టైటిల్ విజేతగా నిలిచి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎమ్.ఎమ్. కీరవాణి స్వరపరిచిన 'నాటు నాటు' పాటను కాల భైరవతో కలిసి పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ పాట ఆస్కార్ అవార్డు సాధించడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు రూ.1 కోటి రివార్డును కూడా ప్రకటించింది.
కెరీర్ లైమ్లైట్ లో ఉండగానే ఊహించని షాక్
ఇటీవల కాలంలో కూడా రాహుల్ సిప్లిగంజ్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు', మహేష్ బాబు 'గుంటూరు కారం' చిత్రాల్లోనూ చార్ట్బస్టర్ సాంగ్స్ పాడి అలరించారు. గత ఏడాది హరిణ్య రెడ్డిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
అత్యున్నత స్థాయి విజయాన్ని చూసిన రాహుల్ సిప్లిగంజ్, ఉన్నట్లుండి ఇలాంటి సీరియస్ లీగల్ చిక్కుల్లో పడటం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు పూర్తి అయితే తప్ప ఈ వివాదంలో అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


