మాజీ భార్య ధనశ్రీ వర్మకు చహల్ పంచ్.. శిఖర్ ధావన్ ఫొటోకు కాపీ రైట్ తీసుకుంటానంటూ..
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన మాజీ భార్య, డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మపై ఓ సెటైర్ వేశాడు. మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఫొటోపై కామెంట్ చేస్తూ పరోక్షంగా ఆమెకు చహల్ ఇచ్చిన పంచ్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల డీల్ గురించి పుకార్లపై పరోక్షంగా స్పందించాడు. రూ.4 కోట్ల భరణం పుకార్లను లక్ష్యంగా చేసుకుని తన మాజీ భార్యపై చహల్ వ్యంగ్యంగా పంచ్ వేశాడు. ఈసారి అతని సన్నిహిత మిత్రుడు శిఖర్ ధావన్ కూడా ఆ సరదా సంభాషణలో జత కలిశాడు. అసలు ఏం జరిగిందో చూడండి.

ధనశ్రీ వర్మపై చహల్ సెటైర్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన దీపావళి, భాయ్ దూజ్ వేడుకల ఫొటోలను పంచుకుంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. తన కుటుంబంతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ.. "కుటుంబంతో కలిసి జరుపుకున్న అందమైన భాయ్ దూజ్. ప్రేమ, చిరునవ్వులు, జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి" అని క్యాప్షన్ ఇచ్చాడు.
అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆ పోస్ట్పై చహల్ చేసిన చమత్కారమైన వ్యాఖ్య. చహల్ కామెంట్ చేస్తూ.. "మీ పోజ్పై నేను కాపీరైట్ ఫైల్ చేస్తున్నాను బ్రదర్.. కేవలం రూ.4 కోట్లు మాత్రమే" అని రాశాడు. ఆ కామెంట్తో పాటు ఓ పగలబడి నవ్వే ఎమోజీని కూడా పోస్ట్ చేశాడు.
దీనికి ధావన్ కూడా బదులిచ్చాడు. కామెంట్ సెక్షన్లో స్పందిస్తూ.. "చహల్ డీల్ కన్ఫమ్ అయింది" అని అన్నాడు. విడాకుల ప్రక్రియ సమయంలో సెటిల్మెంట్ రూ.4 కోట్ల వరకు ఉందని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే దీనిని అటు యుజ్వేంద్ర కానీ, ఇటు ధనశ్రీ కానీ ధృవీకరించలేదు.
కొన్నాళ్ల కిందట కూడా..
చహల్ తన మాజీ భార్యను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించడం ఇది కొత్తేమీ కాదు. కొన్ని రోజుల కిందట అతని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి వైరల్ అయింది. అందులో ఢిల్లీ హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. "ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న భార్యలు తమ భర్తలను భరణం డిమాండ్ చేయలేరు" అని పేర్కొన్న పోస్ట్ను షేర్ చేశాడు.
దాని కింద "అమ్మ మీద ఒట్టు.. ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గవద్దు" అని చహల్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ను కొద్దిసేపటికే తొలగించినప్పటికీ.. ఇది కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది. ఇది ధనశ్రీని ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యనా లేదా కేవలం తీర్పును సమర్థించడమా అనే దానిపై ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది.
ధనశ్రీ, చహల్ పెళ్లి
ధనశ్రీ 2020 డిసెంబర్లో గురుగ్రామ్లో చహల్ను వివాహం చేసుకుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో.. ధనశ్రీని చహల్ డ్యాన్స్ క్లాసుల కోసం అడగడంతో వీరిద్దరూ కలిశారు. వారి పిటిషన్ ప్రకారం వారు 2022 జూన్లో విడిపోయారు. ఈ సంవత్సరం మార్చిలో వారు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో ఉమ్మడి పిటిషన్ను దాఖలు చేశారు. ఆ తర్వాత వారికి విడాకులు మంజూరయ్యాయి.
ఛహల్ అధికారికంగా ధనశ్రీ నుండి విడిపోయిన తర్వాత అతను ఆర్జే మహ్వష్తో కలిసి దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను ఆస్వాదిస్తూ కనిపించాడు. ఇది వారిద్దరి మధ్య రొమాన్స్ ఊహాగానాలకు దారితీసింది. అయితే మహ్వష్.. తాము కేవలం స్నేహితులం మాత్రమే అని ఎప్పుడూ చెబుతోంది. ఇటీవల ధనశ్రీ 'రైజ్ అండ్ ఫాల్' అనే రియాలిటీ షో మొదటి సీజన్లో పాల్గొన్నప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


