సోషల్ మీడియా నిషేధం విధించినా మారని సీన్: ఆస్ట్రేలియాలో షాకింగ్ రిపోర్ట్
16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించినా ఆస్ట్రేలియాలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ప్రారంభంలో వాడకం తగ్గినా, ప్రస్తుతం మళ్లీ పాత స్థాయికి చేరుకుందని కస్టోడియో (Qustodio) తాజా డేటా వెల్లడించింది. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లను పిల్లలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వినియోగిస్తున్నారు.
16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన చట్టం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. నిషేధం అమల్లోకి వచ్చిన కొత్తలో వాడకం తగ్గినా, ప్రస్తుతం మళ్లీ పాత స్థాయికే చేరుకుందని పేరంటల్ కంట్రోల్ సాఫ్ట్వేర్ సంస్థ 'కస్టోడియా' తెలిపింది.
సోషల్ మీడియా నిషేధం విధించినా మారని సీన్: ఆస్ట్రేలియాలో షాకింగ్ రిపోర్ట్
ఆంక్షలను అధిగమిస్తున్న సాంకేతికత
సైబర్ బుల్లీయింగ్, హానికరమైన అల్గారిథమ్ల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఆస్ట్రేలియా డిసెంబర్లో ఈ చట్టాన్ని తెచ్చింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు సైతం ఇదే తరహా నిబంధనలను పరిశీలిస్తున్నాయి. అయితే, తొలి నెలల్లో వినియోగం క్రమంగా తగ్గినప్పటికీ, ఇప్పుడు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి యాప్లను పిల్లలు తిరిగి విస్తృతంగా వాడుతున్నారు.
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ఫారమ్ టిక్టాక్ను 13 నుంచి 15 ఏళ్ల వయస్సున్న వారిలో 25.9 శాతం మంది ఇప్పటికీ వినియోగిస్తున్నారు. నిషేధానికి ముందున్న శాతంతో పోలిస్తే ఇది కేవలం ఒక్క శాతం మాత్రమే తక్కువ. ఇక 10 నుంచి 12 ఏళ్ల వయస్సున్న పిల్లల వినియోగం అయితే నిషేధానికి ముందున్న స్థాయికి కేవలం 0.06 శాతం సమీపంలోకి వచ్చేసింది.
వీపీఎన్, నకిలీ వయస్సుతో ట్రిక్స్
"పిల్లలు వీపీఎన్ (VPN) వాడుతూ తమ లొకేషన్ను మార్చడం లేదా వయస్సును తప్పుగా నమోదు చేయడం ద్వారా ఈ యాప్లలోకి ప్రవేశిస్తూ ఉండవచ్చు. నిబంధనలు క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేయకపోవడమే దీనికి ప్రధాన కారణం" అని కస్టోడియో నిపుణురాలు యాస్మిన్ లండన్ స్పష్టం చేశారు.
ఈ ఆంక్షలు వర్తించని 'వాట్సాప్' వైపు పిల్లల దృష్టి మరింత మళ్లిందని నివేదిక పేర్కొంది. నెలకు కనీసం ఒకసారైనా ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం ప్లాట్ఫారమ్లను వాడిన పిల్లల డేటాను విశ్లేషించి కస్టోడియో ఈ గణాంకాలను రూపొందించింది. జూన్లో వెలువడిన పరిశోధనా పత్రం కూడా టీనేజర్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
గ్లోబల్ రెవెన్యూలో జరిమానాకు న్యూజిలాండ్ సిద్ధం
ఈ సవాళ్ల నడుమ ఇతర దేశాలు మరింత కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే మెటా వంటి సంస్థలకు వాటి గ్లోబల్ రెవెన్యూలో 10 శాతం వరకు జరిమానా విధించేలా చట్టం తెస్తామని న్యూజిలాండ్ ప్రభుత్వం వెల్లడించింది.
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More