Srikalahasti Rahu Ketu Pooja : సామాన్యులకు వరం - శ్రీకాళహస్తిలో రూ.100కే రాహు, కేతు పూజ..! కొత్త మార్పులివే
Srikalahasti Rahu Ketu Pooja : శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహు, కేతు పూజల్లో కీలక మార్పులు వచ్చాయి. సామాన్య భక్తుల కోసం రూ.100 పూజను ప్రవేశపెట్టగా…. వెండి ధరల పెరుగుదలతో కొన్ని పాత టికెట్ ధరలను సవరించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లే భక్తులకు ధర్మకర్తల మండలి శుభవార్త చెప్పింది. రాహు-కేతు సర్పదోష నివారణ పూజల్లో కీలక మార్పులు చేసింది. భక్తుల సౌకర్యార్థం పూజా విధానాలతో పాటు రుసుముల్లో పలు మార్పులు చేసేందుకు ధర్మకర్తల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గురువారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి నేతృత్వంలో జరిగిన ట్రస్టు బోర్డు సమావేశం జరిగింది. మొత్తం 21 అంశాలపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రూ.100 కే పూజ..!
ఎంతో ఖరీదైన రాహు-కేతు పూజలను సామాన్య భక్తులకు తక్కువ ధరలోకే అందుబాటులోకి తీసుకురావాలని ఆలయ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. తొలి ప్రాధాన్యంగా శ్రీకాళహస్తీ నియోజకవర్గ పరిధిలోని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా రూ.100 కే రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించనున్నారు.
"పేద ప్రజలకు, సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ రూ.100 పూజను అందుబాటులోకి తెస్తున్నాం" అని ట్రస్టు బోర్డు చైర్మన్ కొట్టే సాయి వెల్లడించారు.
ప్రతి బుధవారం దాదాపు 2 వేల మందిని ఈ పూజలకు అనుమతిస్తారు. అయితే, ఈ తక్కువ ధర పూజలో వెండి సర్పాలకు బదులుగా ఇతర పూజా సామాగ్రితోనే శాస్త్రోక్తంగా పూజలు పూర్తి చేస్తారు. నియోజకవర్గ పరిధిలోని తెల్ల రేషన్ కార్డు దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎమ్మెల్యో బొజ్జల సుధీర్ రెడ్డి వివరించారు.
- బహిరంగ మార్కెట్లో వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పూజా టికెట్ల ధరల్లో మార్పులు అనివార్యమయ్యాయని బోర్డు స్పష్టం చేసింది.
- ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులో ఉన్న రూ.500 రాహు-కేతు పూజలను పూర్తిగా రద్దు చేశారు.
- గతంలో ఉన్న రూ.5,000 పూజా రుసుమును ఇప్పుడు రూ.6,000 కు పెంచారు.
- మధ్యతరగతి భక్తులు ఎక్కువగా చేసుకునే రూ.750, రూ.1500, రూ.2500 టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
- వీటితో పాటు దక్షిణామూర్తి అభిషేకం టికెట్ ధరను ఒకరికి రూ.500 గా నిర్ణయించారు.
కేవలం పూజా రుసుములే కాకుండా, ఆలయ మౌలిక సదుపాయాల పైన కూడా బోర్డు దృష్టి సారించింది. భక్తులందరూ చూసేలా వాహన మండపాన్ని ఆధునికీకరించాలని నిర్ణయించారు. పానగల్ నుంచి రామసేతు వంతెన వరకు పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈవో, ట్రస్టు బోర్డు సభ్యుల కోసం కొత్త క్వార్టర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
ఏర్పేడు మండలం కందాడ గ్రామంలోని శివాలయం, కన్నలిలోని వీరభద్రస్వామి ఆలయాలను శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధ ఆలయాలుగా మార్చాలని తీర్మానించారు. దీనివల్ల ఆయా చిన్న ఆలయాల నిర్వహణ మెరుగుపడి, పర్యాటక కళ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. రాహు కేతు పూజ ఎప్పుడు చేయాలి?
ఈ పూజను ఏ రోజైనా చేయవచ్చు, కానీ రాహుకాలం సమయంలో చేస్తే విశేష ఫలితం ఉంటుందని నమ్ముతారు.
2. ఇంట్లో రాహు కేతు పూజ చేసుకోవచ్చా?
సాధారణంగా ఈ పూజను క్షేత్రాల్లో (ఉదాహరణకు శ్రీకాళహస్తి) లేదా శివాలయాల్లో చేయడం ఉత్తమం. ఇంట్లో చేయాలనుకుంటే విద్వాంసుల సమక్షంలో సక్రమమైన హోమ విధానంతో నిర్వహించాలి.
3. ఒక్కసారి పూజ చేస్తే దోషం పూర్తిగా పోతుందా?
జాతకంలోని దోష తీవ్రతను బట్టి ఒకటి లేదా మూడు సార్లు ఈ పూజ చేయాలని పండితులు సూచిస్తారు. ఏటా ఒకసారి ఈ పూజ చేసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయని అంటారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

