వరూధిని ఏకాదశి: అక్షయ పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం.. పూజా విధి, విశిష్టత పూర్తి వివరాలు ఇవే!
చైత్ర మాసం కృష్ణ పక్ష ఏకాదశిని 'వరూధిని ఏకాదశి'గా జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 13, సోమవారం నాడు ఈ పవిత్ర పర్వదినం వచ్చింది. ఈ రోజున భగవంతుడైన శ్రీమహావిష్ణువును ఆయన 'వామన' అవతారంలో కొలవడం విశేషం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పది వేల ఏళ్ల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
వరూధిని అంటే రక్షణ కవచం అని అర్థం. ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులను విష్ణుమూర్తి అన్ని ఆపదల నుండి రక్షిస్తాడని నమ్మకం. పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఈ ఏకాదశి ప్రాముఖ్యతను పాండవులకు వివరించారు. ఈ రోజున భక్తితో పూజించే వారికి మోక్షం లభించడమే కాకుండా, అకాల మరణ భయం తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.

పూజా విధానం: ఇలా చేస్తే అక్షయ పుణ్యం మీ సొంతం
వరూధిని ఏకాదశి రోజున సరైన పద్ధతిలో పూజ చేయడం వల్ల ఆశించిన ఫలితాలు దక్కుతాయి.
వేకువజామున స్నానం: సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి.
సంకల్పం: పూజా గదిని శుభ్రం చేసి, ఒక పీటపై పసుపు వస్త్రాన్ని పరచి విష్ణుమూర్తి పటాన్ని ప్రతిష్టించాలి. భగవంతుని ముందు దీపం వెలిగించి వ్రత సంకల్పం చేయాలి.
అభిషేకం: దక్షిణావర్తి శంఖంతో స్వామివారికి అభిషేకం చేయడం శుభప్రదం. కుంకుమపువ్వు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.
నైవేద్యం: ఈ ఏకాదశి రోజున స్వామివారికి పసుపు రంగులో వుండే నైవేద్యంగా సమర్పించడం చాలా ప్రత్యేకం. నైవేద్యంలో తప్పనిసరిగా తులసి దళం ఉంచాలి.
పారాయణం: విష్ణు సహస్రనామ పారాయణం, ఏకాదశి వ్రత కథ చదవడం లేదా వినడం చేయాలి.
శక్తివంతమైన మంత్రాల జపం
పూజ సమయంలో ఈ క్రింది మంత్రాలను జపించడం వల్ల మనోకామ్యాలు నెరవేరుతాయి:
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం శ్రీ విష్ణవే చ విద్మహే వాసుదేవాయ ధీమహి.. తన్నో విష్ణుః ప్రచోదయాత్
లక్ష్మీ మంత్రం: ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః
ఏకాదశి రోజున చేయాల్సిన దానాలు
ఈ పవిత్ర రోజున దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నువ్వులు, ధాన్యం, భోజనం, పాదరక్షలు, గొడుగు, నీటి పాత్రలు (కుండలు), మరియు పసుపును పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
ముఖ్యంగా గమనించాల్సిన నియమాలు
దశమి నుండే నియమం: ఏకాదశి నియమాలు దశమి రాత్రి నుండే ప్రారంభమవుతాయి.
నియమ నిష్టలు: ఇతరులను దూషించడం, అబద్ధాలు ఆడటం చేయరాదు. మనసును ప్రశాంతంగా, ఆధ్యాత్మిక చింతనతో ఉంచుకోవాలి.
జాగరణ: ఏకాదశి నాటి రాత్రి భజన కీర్తనలతో జాగరణ చేయడం వల్ల కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని శాస్త్రవచనం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


