అగ్రరాజ్యం అమెరికాలో చదువుకుని, అక్కడే స్థిరపడాలనే కలలు కనే భారతీయ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రస్తుత పరిస్థితులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలు వేలాది మంది భారతీయుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ తండ్రి పడుతున్న ఆవేదన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
రూ. 2 కోట్ల అప్పు.. పెరిగిన భారం..

విశాఖపట్నానికి చెందిన ఆదిత్య అనే పారిశ్రామికవేత్త తన స్నేహితుడి కుటుంబం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. తన ఆర్థిక స్తోమతకు మించి, కేవలం పిల్లల భవిష్యత్తు కోసమే ఆ తండ్రి ఇద్దరు కుమారులను అమెరికా పంపారని, కానీ, నేడు ఆ నిర్ణయం ఆ కుటుంబాన్ని తీరని కష్టాల్లోకి నెట్టిందని ఆదిత్య చెప్పుకొచ్చారు.
పిల్లలు మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసే సమయానికి ఆ తండ్రిపై ఉన్న అప్పు రూ. 1.5 కోట్లు. సాధారణంగా చదువు పూర్తయ్యాక హెచ్-1బీ వీసాపై ఉద్యోగం సంపాదించి అప్పు తీర్చవచ్చని ఎవరైనా భావిస్తారు. కానీ, ఇటీవలి కాలంలో ట్రంప్ సర్కార్ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఆ ఇద్దరు యువకులకు ఉద్యోగాలు దొరకడం గగనమైపోయింది.
"మొదట్లో వారి పార్ట్-టైమ్ సంపాదనకు తోడుగా తండ్రి నెలకు లక్ష రూపాయలు పంపేవారు. అయితే ట్రంప్ నిర్ణయాల తర్వాత పరిస్థితి మారింది. పిల్లలను పార్ట్-టైమ్ ఉద్యోగాలు వదిలేయమని చెప్పి, తన అప్పును రూ. 2 కోట్లకు పెంచుకుంటూనే నెలకు రూ. 2 లక్షలు పంపడం మొదలుపెట్టారు," అని ఆదిత్య తన పోస్ట్లో పేర్కొన్నారు.
ఫ్లాట్ అమ్మేందుకు సిద్ధం..
భారత్లో తన వ్యాపారం అంతగా సాగకపోయినా, అప్పుల వడ్డీలు పెరుగుతున్నా ఆ తండ్రి వెనకాడలేదు. తన పిల్లలు అమెరికాలో నిలదొక్కుకోవాలని, తనకున్న ఏకైక ఫ్లాట్ను కూడా అమ్మేందుకు సిద్ధపడ్డారు.
{{/usCountry}}భారత్లో తన వ్యాపారం అంతగా సాగకపోయినా, అప్పుల వడ్డీలు పెరుగుతున్నా ఆ తండ్రి వెనకాడలేదు. తన పిల్లలు అమెరికాలో నిలదొక్కుకోవాలని, తనకున్న ఏకైక ఫ్లాట్ను కూడా అమ్మేందుకు సిద్ధపడ్డారు.
{{/usCountry}}ఇది కేవలం ఒక కుటుంబం కథ మాత్రమే కాదు, అమెరికా వెళ్లే వారిలో చాలా మంది ఎదుర్కొంటున్న చేదు నిజం.
"ఇదొక భయానక పరిస్థితి. ప్రతి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలాంటి ఇబ్బందుల్లోనే చిక్కుకుంటున్నారు" అని ఆదిత్య ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న ఊరట.. కానీ ఆందోళన అలాగే!
అదృష్టవశాత్తూ, పెద్ద కుమారుడు ఇటీవలే హెచ్-1బీ లాటరీలో ఎంపికై, ఒక ఫుల్-టైమ్ ఉద్యోగాన్ని సంపాదించాడు. జీతం తక్కువైనా, కనీసం తండ్రిపై ఆధారపడకుండా తన ఖర్చులు తను చూసుకోగలుగుతున్నాడు.
అయితే, స్తోమత లేకపోయినా అప్పులు చేసి పిల్లలను అమెరికా పంపే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఆదిత్య కోరారు. "బయట ఉండి తీర్పులు చెప్పడం సులభమే కానీ, అటు ఉద్యోగాలు లేని మార్కెట్, ఇటు పెరుగుతున్న అప్పుల మధ్య నలిగిపోతున్న ఆ యువకుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారిపై జాలి చూపాలి. తల్లితండ్రులు కూడా పిల్లలను పై చదువులకు పంపించేటప్పుడు ఆలోచించాలి," అని ఆయన విజ్ఞప్తి చేశారు.