ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి అందిన సమన్లు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కేసు విషయంలో కాదని, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద దాఖలైన కేసుకు సంబంధించినవని అనిల్ అంబానీ తరపున జారీ అయిన ప్రకటన స్పష్టం చేసింది. మీడియాలో వచ్చిన పీఎంఎల్ఏ సంబంధిత కథనాలను ఈ ప్రకటన కొట్టిపారేసింది.
ఈడీ జారీ చేసిన ఈ విచారణ, దాదాపు 15 ఏళ్ల నాటి పాత అంశానికి సంబంధించినదిగా తెలుస్తోంది. 2010లో జరిగిన ఒక దేశీయ కాంట్రాక్ట్, ముఖ్యంగా జైపూర్–రీంగస్ హైవే ప్రాజెక్ట్కు సంబంధించిన వ్యవహారం ఇది. ఈ కాంట్రాక్ట్లో ఎటువంటి విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు లేవని స్టేట్మెంట్ నొక్కి చెప్పింది.
‘ఈడీ గతంలో జారీ చేసిన ప్రకటన ప్రకారం ఇది సరిగ్గా 15 సంవత్సరాల క్రితం, అంటే 2010 నాటి అంశం. ఈ కేసు జైపూర్-రీంగస్ హైవే ప్రాజెక్ట్కు సంబంధించిన ఒక రోడ్ కాంట్రాక్టర్కు సంబంధించింది. హైవే నిర్మాణం ఎప్పుడో పూర్తయి, 2021 నుండి గత నాలుగేళ్లుగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధీనంలో ఉంది. ఈ కాంట్రాక్ట్ పూర్తిగా దేశీయ కాంట్రాక్ట్. ఈ ఒప్పందంలో ఎలాంటి విదేశీ మారకద్రవ్య ప్రమేయం లేదు..’ అని ప్రకటన స్పష్టం చేసింది.
విచారణకు పూర్తి సహకారం
అనిల్ అంబానీ ఈడీ విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ప్రకటన తెలిపింది. వర్చువల్గా హాజరయ్యేందుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేశారని తెలిపింది.
ప్రస్తుతం అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డులో సభ్యుడిగా లేరని, గతంలో ఆయన కేవలం నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మాత్రమే పనిచేశారని తెలిపింది. కంపెనీ రోజువారీ కార్యకలాపాలను, నిర్వహణను ఆయన ఎప్పుడూ పర్యవేక్షించలేదని ఆ ప్రకటన స్పష్టం చేసింది.