అపోలో హాస్పిటల్స్ హెల్తీ ప్రాఫిట్స్: లాభాల్లో 35% వృద్ధి.. ₹9,600 టార్గెట్‌

అపోలో హాస్పిటల్స్ క్యూ3 ఫలితాల్లో 35% నికర లాభాన్ని నమోదు చేయడంతో షేరు ధర 5% పెరిగి 7,580కి చేరింది. ఆదాయం కూడా 17% పెరగడంతో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్‌పై ‘బై’ రేటింగ్‌ ఇస్తూ భారీ టార్గెట్లను ప్రకటించాయి.

Published on: Feb 11, 2026 11:19 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టాక్ మార్కెట్లో హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ కాసుల వర్షం కురిపిస్తోంది. మంగళవారం సాయంత్రం ప్రకటించిన క్యూ3 ఫలితాల్లో కంపెనీ అదరహో అనిపించింది. కేవలం లాభాల్లోనే కాదు, నిర్వహణ పరంగా కూడా అద్భుతమైన వృద్ధిని కనబరచడంతో బుధవారం మార్కెట్ ప్రారంభం నుంచే షేరు ధరలో బుల్ రన్ కనిపిస్తోంది.

అపోలో హాస్పిటల్స్ హెల్తీ ప్రాఫిట్స్ (Pixabay)
అపోలో హాస్పిటల్స్ హెల్తీ ప్రాఫిట్స్ (Pixabay)

కీలక గణాంకాలు ఇవే:

  • నికర లాభం: గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 35% పెరిగి 502 కోట్లకు చేరింది.
  • ఆదాయం: 17% వృద్ధితో 6,477 కోట్లుగా నమోదైంది.
  • ఎబిటా (EBITDA): 27% వృద్ధితో 965 కోట్లకు చేరుకుంది.
  • డివిడెండ్: ఒక్కో షేరుకు 10 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

ఆసుపత్రుల విభాగంలో దూకుడు

కంపెనీ ప్రధాన ఆదాయ వనరైన హెల్త్‌కేర్ సర్వీసెస్ (ఆసుపత్రులు) ఆదాయం 14% పెరిగి 3,183 కోట్లకు చేరింది. రోగుల చేరిక పెరగడం, సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు (రోబోటిక్ సర్జరీలు వంటివి) నిర్వహించడం వల్ల మార్జిన్లు 24.8 శాతానికి మెరుగుపడ్డాయని అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి వివరించారు. ముఖ్యంగా చెన్నై వంటి నగరాల్లో స్ట్రోక్ కేర్ నెట్‌వర్క్‌ను విస్తరించడం కంపెనీకి కలిసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

నిపుణులు ఏమంటున్నారు? కొనవచ్చా?

  • సిటీ (Citi) బ్రోకరేజ్: ఈ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ అపోలో షేరుకు ‘బై’ (Buy) రేటింగ్ ఇస్తూ, టార్గెట్ ధరను 9,600గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ షేరు దాని చారిత్రక సగటు కంటే తక్కువ వాల్యుయేషన్‌లో దొరుకుతోందని, ఇది ఇన్వెస్టర్లకు మంచి అవకాశమని సిటీ విశ్లేషించింది.
  • SMC గ్లోబల్ సెక్యూరిటీస్: సీనియర్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ అభిప్రాయం ప్రకారం.. అపోలో ఒక ‘లాంగ్ టర్మ్ కాంపౌండర్’. అంటే దీర్ఘకాలంలో స్థిరమైన లాభాలను ఇచ్చే షేరు. డిజిటల్ హెల్త్ (అపోలో 24/7), ఫార్మసీ విభాగాల్లో వృద్ధి రాబోయే రోజుల్లో కంపెనీకి మరింత బలాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.
  • టెక్నికల్ అనాలిసిస్: లక్ష్మిశ్రీ రీసెర్చ్ హెడ్ అన్షుల్ జైన్ ప్రకారం.. ఈ షేరు ఇప్పుడు 7,365 కీలక స్థాయిని దాటింది. ఇది పాజిటివ్ సంకేతం. స్వల్ప కాలంలో ఈ షేరు 8,000 నుంచి 8,100 వరకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ధర 7,400 స్థాయికి తగ్గితే, అది కొనుగోలు చేయడానికి సరైన సమయమని ఆయన సూచించారు.

వ్యాపార విస్తరణ, పెరుగుతున్న హెల్త్‌కేర్ డిమాండ్, మెరుగైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో అపోలో హాస్పిటల్స్ షేరు దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అయితే మార్కెట్ రిస్కులను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More