అయోధ్య రామాలయ విరాళాల వివాదం: ఎనిమిది మంది నిందితుల ఇళ్లలో పోలీసుల సోదాలు
అయోధ్య రామాలయ విరాళాల సేకరణలో జరిగిన అక్రమాల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితుల ఇళ్లలో పోలీసులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మరోవైపు, ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు.
అయోధ్య రామాలయ విరాళాల సేకరణలో జరిగినట్లుగా చెప్తున్న అక్రమాల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. ఆదివారం ఉదయం నిందితుల నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎనిమిది మంది నిందితుల ఇళ్లలో ఆరు పోలీసు బృందాలు ఉదయం 7 గంటల నుంచే విస్తృత సోదాలు చేపట్టాయి.

విచారణలో భాగంగా నిందితుల కుటుంబ సభ్యులను వారి ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద కార్యకలాపాలపై అధికారులు ప్రశ్నించారు. అలాగే, నిందితుల కదలికలు, వారి వద్దకు వచ్చే వెళ్లే వ్యక్తుల వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు పొరుగువారితో కూడా మాట్లాడారు. ఈ కుట్రలో మరికొంత మంది ప్రమేయం ఉందా అనే కోణంలో ఆధారాలను సేకరిస్తున్నారు.
కీలక నేతల రాజీనామాలు.. అసలు వివాదం ఎప్పుడు మొదలైందంటే?
ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేసినట్లు శనివారం ట్రస్ట్ ధృవీకరించింది.
ఈ భారీ కుంభకోణం జూన్ 7వ తేదీన మొదటిసారి వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన విరాళాల నుంచి సుమారు ₹5 కోట్ల నుంచి ₹7.5 కోట్ల వరకు నిధులు దారిమళ్లాయని సమాజ్ వాదీ పార్టీ (SP) నాయకుడు తేజ్ నారాయణ్ 'పవన్' పాండే ఆరోపించారు. దీనిపై స్పందించిన ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు జూన్ 13న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూన్ 15 నుంచి 20 వరకు అయోధ్యలో ప్రాథమిక విచారణ జరిపి, నగదు, విలువైన వస్తువుల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఆ తర్వాతే భారతీయ న్యాయ సంహిత (BNS), అవినీతి నిరోధక చట్టం కింద ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
నిందితుల వివరాలు ఇవే:
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో చంపత్ రాయ్కు అత్యంత ఆప్తుడైన రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిన్నుతో పాటు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రమాశంకర్ మిశ్రా, మనీష్ యాదవ్, కరుణేష్ పాండే ఉన్నారు. వీరిలో అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రాలు బంధువులే కాకుండా, రాజీనామా చేసిన ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా బంధువులు కావడం గమనార్హం.
భక్తులకు ట్రస్ట్ భరోసా
ఈ ఘటనలపై రామాలయ ట్రస్ట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దర్యాప్తు పారదర్శకంగా సాగేలా చూస్తామని భక్తులకు భరోసా ఇచ్చింది.
"గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి, గురిచేశాయి. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదు. భక్తులు ఎలాంటి పుకార్లను, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. ఇలాంటి ప్రయత్నాలు సనాతన ధర్మాన్ని కానీ, ఆలయాన్ని కానీ, కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని కానీ ఏమాత్రం కదిలించలేవు" అని ట్రస్ట్ తన ప్రకటనలో పేర్కొంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


