ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్లో ఘోరం: హిందూ వ్యాపారి దారుణ హత్య
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు మైమెన్సింగ్లో ఒక వృద్ధ హిందూ వ్యాపారిని దుండగులు దారుణంగా నరికి చంపారు. షాపులోనే హత్య చేసి నగదు ఎత్తుకెళ్లిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
బంగ్లాదేశ్లో ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో అక్కడ మైనారిటీలపై దాడులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. మైమెన్సింగ్ జిల్లాలో సోమవారం రాత్రి ఒక హిందూ వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. దేశంలో కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు పోలింగ్ జరగడానికి సరిగ్గా మూడు రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

షాపులోనే ప్రాణాలు తీసిన దుండగులు
మృతుడిని 62 ఏళ్ల సుసేన్ చంద్ర సర్కార్గా గుర్తించారు. ఆయన మైమెన్సింగ్ జిల్లా త్రిశాల్ ప్రాంతంలోని సౌత్కంద గ్రామంలో నివసిస్తున్నారు. సుసేన్ చాలా కాలంగా 'భాయ్ భాయ్ ఎంటర్ప్రైజ్' పేరుతో బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బోగర్ బజార్ కూడలిలో ఉన్న తన దుకాణంలో ఆయన ఉండగా, దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు.
సుసేన్ను దారుణంగా నరికి చంపిన నిందితులు, ఎవరికీ అనుమానం రాకుండా షాపు షట్టర్లు దించేసి అక్కడి నుంచి పారిపోయారు. రాత్రి ఎంతకీ ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ షాపు వద్దకు వెళ్లారు. అక్కడ షట్టర్ తెరిచి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న సుసేన్ కనిపించారు. వెంటనే ఆయన్ని మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
లక్షలాది రూపాయల నగదు అపహరణ
తన తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదని సుసేన్ కుమారుడు సుజన్ సర్కార్ వెల్లడించారు. "మేము చాలా కాలంగా బియ్యం వ్యాపారం చేస్తున్నాం. మాకు ఎవరితోనూ గొడవలు లేవు. నా తండ్రిని అత్యంత క్రూరంగా చంపిన దుండగులు, షాపులో ఉన్న లక్షలాది రూపాయల నగదును ఎత్తుకెళ్లారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని త్రిశాల్ పోలీస్ స్టేషన్ చీఫ్ ముహమ్మద్ ఫిరోజ్ హొస్సేన్ తెలిపారు.
పెరుగుతున్న మైనారిటీలపై దాడులు
బంగ్లాదేశ్లో గత కొంతకాలంగా హిందువులపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే మైమెన్సింగ్లో కొన్ని రోజుల క్రితం దీపు చంద్ర దాస్ అనే వస్త్ర పరిశ్రమ కార్మికుడిపై ఒక గుంపు దాడి చేసింది. దైవదూషణ పేరుతో అతడిని కొట్టి, సజీవ దహనం చేసిన ఘటన మరువక ముందే, వరుస హత్యోదంతాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ వ్యాపారి హత్య జరగడం స్థానిక మైనారిటీ వర్గాల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం అక్కడి శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

E-Paper












