...
...
Next Story

6 నెలల పాటు సహజ మరణమే అనుకున్నారు.. కానీ భర్తే చంపేశాడు

బెంగళూరు డాక్టర్ హత్య కేసులో తొలుత ఆమెది సహజ మరణం అనుకున్నారు. కానీ పోస్టుమార్టం రిపోర్టు వెలుగుచూశాక అది హత్యేనని తేలింది.

Published on: Oct 17, 2025 03:34 PM IST
Advertisement

బెంగళూరు నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆరు నెలల పాటు 'సహజ మరణం'గా భావించిన ఈ కేసులో, ఫోరెన్సిక్ నివేదికలు కృత్తికకు 'ప్రొపోఫాల్' అనే మత్తు మందు ఇచ్చినట్లు నిర్ధారించాయి. దీంతో ఆమె భర్త, సర్జన్ అయిన డాక్టర్ మహేంద్ర రెడ్డిని అక్టోబర్ 14న పోలీసులు అరెస్టు చేశారు. భర్త తన వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి, చికిత్స పేరుతో ఆమెకు ప్రాణాంతకమైన అనస్థీషియా డోస్ ఇచ్చి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

కూతురు కోసం ఇల్లు

భర్తతో డాక్టర్ కృతికా రెడ్డి
భర్తతో డాక్టర్ కృతికా రెడ్డి

బెంగళూరులోని అయ్యప్ప లేఅవుట్‌లో ఉన్న ఆ ఇంటి ముందు ప్రస్తుతం 'డాక్టర్ కృత్తిక ఎం. రెడ్డి జ్ఞాపకార్థం' అనే నేమ్‌ప్లేట్ కనిపిస్తుంది. కూతురిని పోగొట్టుకున్న ఆ తండ్రి కల ఎంతలా ఛిద్రమైందో ఈ ఘటన గుర్తు చేస్తోంది.

"నా కూతురు తన భర్త, పిల్లలతో సంతోషంగా జీవించడాన్ని చూడాలనే ఆశతోనే ఆ ఇంటిని కట్టాను" అని కృత్తిక తండ్రి కె. ముని రెడ్డి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ఆ ఇంటిని ఆయన ఇటీవల ఇస్కాన్‌కు విరాళంగా ఇచ్చారు.

ఆరు నెలల తర్వాత

28 ఏళ్ల చర్మ వ్యాధి నిపుణురాలు (Dermatologist) డాక్టర్ కృత్తిక రెడ్డికి, సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డితో 2024 మేలో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాది తిరక్కుండానే, ఏప్రిల్‌లో ఆమె అనుమానాస్పద పరిస్థితులలో మరణించింది. భర్త మహేంద్ర రెడ్డి ఇంట్లోనే గ్యాస్ట్రైటిస్‌కు (Gastritis) చికిత్స చేస్తున్నట్లు చెప్పి, సిరల ద్వారా మందులు ఇచ్చాడని ఆరోపణలు వచ్చాయి. ఆరు నెలల తర్వాత, కుటుంబ సభ్యులు భయపడిన ఆ భయంకరమైన నిజమే వెలుగుచూసింది.

కృత్తికకు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలకు మాత్రమే ఉపయోగించే శక్తివంతమైన మత్తుమందు 'ప్రొపోఫాల్' మోతాదుకు మించి ఇచ్చినట్లు ఫోరెన్సిక్ పరీక్షలు ధృవీకరించాయి.

'క్లినికల్ ప్రెసిషన్'తో హత్య

"మహేంద్ర తన భార్య హత్యను చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఆమెకు ఉన్న ఆరోగ్య సమస్యలు (medical vulnerabilities) అతనికి బాగా తెలుసు. ఆ విషయాలను వాడుకుని తన వృత్తిపరమైన పరిజ్ఞానంతో హత్యకు పాల్పడ్డాడు" అని వైట్‌ఫీల్డ్ డీసీపీ ఎం. పరశురామ్ వివరించారు.

అసలేం జరిగింది?

ఏప్రిల్ 21న, కడుపునొప్పిగా ఉందని చెప్పి, ఇంట్లోనే ఇంజెక్షన్ ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 23న ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పిగా ఉందని ఆమె ఫిర్యాదు చేసింది. ఆ రాత్రే మళ్ళీ ఇంటికి వచ్చి మరో మోతాదు మందు ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం, కృత్తిక స్పందించకుండా కనిపించింది.

సీపీఆర్ చేయలేదు:

డాక్టర్ అయినప్పటికీ, మహేంద్ర ఆమెకు సీపీఆర్ (CPR) ఇవ్వలేదు. ఆ తర్వాత సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

పోస్ట్‌మార్టం, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలలో ఆమె అవయవాలలో మత్తు పదార్థాల అవశేషాలు ఉండటంతో, మొదట సహజ మరణంగా భావించిన కేసు హత్య కేసుగా మారింది.

విశ్వసించి పెళ్లి చేస్తే.. అదే జ్ఞానంతో ప్రాణం తీశాడు

"మా అమ్మాయి తన వివాహం గౌరవం, ప్రేమ మీద ఆధారపడి ఉందని విశ్వసించింది. కానీ ఇతరులను నయం చేయాల్సిన అదే వైద్య జ్ఞానం, ఆమె జీవితాన్ని ముగించడానికి ఉపయోగించాడు" అని ముని రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వివాహానికి ముందు తన కుటుంబ సభ్యులు కృత్తికకు ఉన్న దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్, మెటబాలిక్ సమస్యలను దాచారనే విషయం తెలుసుకుని మహేంద్ర కోపంతో ఉన్నాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోపమే చివరకు ప్రాణాంతకంగా మారిందని వారి ప్రాథమిక అంచనా.

కృత్తిక మరణం తర్వాత కూడా, మహేంద్ర ఏమీ తెలియనట్లుగా, అది ఒక దురదృష్టకర వైద్య ప్రమాదం అన్నట్లుగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మహేంద్రపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103 (హత్య) కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు, కృత్తిక మే 4న తన సొంత స్కిన్ క్లినిక్ 'స్కిన్ అండ్ స్కాల్పెల్'ను ప్రారంభించడానికి సిద్ధమవుతుండేవారు. ఆమె దయ, అంకితభావానికి పేరు పొందారు.

ఆస్తిని దానం చేసిన తండ్రి: విశ్వాసంలో ఉపశమనం

తమ కూతురి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని తెలిపిన ముని రెడ్డి, మూడు నెలల క్రితం ఆ ఇంటిని ఇస్కాన్‌కు దానం చేశారు.

"ఆమె జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. ఆ ఇంట్లో ఇస్కాన్ వారు కార్యక్రమాలు, భక్తి కార్యకలాపాలు నిర్వహిస్తారు. దానిలో ఆమె ఆత్మ కూడా భాగమవుతుందని నేను నమ్ముతున్నాను" అని ముని రెడ్డి ఎమోషనల్‌గా చెప్పారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe