సీఐఐ ఎనర్జీ సమిట్: రూ.3,590 కోట్ల పెట్టుబడులకు పారిశ్రామిక దిగ్గజాల ఆమోదం

హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైన 25వ సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమిట్‌ 2026లో క్లీన్ టెక్నాలజీ, విద్యుదీకరణ దిశగా పరిశ్రమలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు పరిశ్రమలు రూ.3,590 కోట్ల నూతన పెట్టుబడులను ప్రకటించడంతో పాటు 'ఇండియా హీట్ పంప్ అట్లాస్' డాష్‌బోర్డ్‌ను ఆవిష్కరించాయి.

Published on: Sep 17, 2026, 18:02:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆర్థిక వ్యవస్థను 'నెట్ జీరో' (నికర సున్నా ఉద్గారాలు) దిశగా వేగంగా తీసుకెళ్లేందుకు పారిశ్రామిక రంగాలు కీలక అడుగు వేశాయి. హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన 25వ సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమిట్ 2026లో పర్యావరణహిత రంగానికి, డిజిటలైజేషన్‌కు రూ.3,590 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వివిధ పరిశ్రమల ప్రతినిధులు ప్రకటించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా 'ఇండియా హీట్ పంప్ అట్లాస్' అనే జాతీయ డాష్‌బోర్డ్‌ను ఈ సదస్సులో విడుదల చేశాయి.

సీఐఐ ఎనర్జీ సమిట్: రూ.3,590 కోట్ల పెట్టుబడులకు పారిశ్రామిక దిగ్గజాల ఆమోదం
సీఐఐ ఎనర్జీ సమిట్: రూ.3,590 కోట్ల పెట్టుబడులకు పారిశ్రామిక దిగ్గజాల ఆమోదం

విద్యుత్ వినియోగంలో విప్లవాత్మక మార్పులు

ఈ సదస్సులో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) డైరెక్టర్ జనరల్ కృష్ణ చంద్ర పాణిగ్రాహి మాట్లాడుతూ.. "భారత ఆర్థిక వృద్ధిలో ఇంధన పొదుపు, విద్యుదీకరణ కీలక పాత్ర పోషిస్తాయి. 'వికసిత్ భారత్ 2047', 'నెట్ జీరో 2070' లక్ష్యాల సాధనకు చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) సాంకేతిక, ఆర్థిక సాయం అందించే 'అడీటీ' (ADEETIE) పథకం ఎంతో తోడ్పడుతుంది. ఇంధన పొదుపు అనేది కేవలం నిబంధనల అమలు కోసం మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో భారత పారిశ్రామిక రంగానికి పోటీతత్వాన్ని సాధించిపెట్టే మార్గం" అని స్పష్టం చేశారు.

ఏఐ సాంకేతికతతో ఎంఎస్‌ఎంఈలకు మహర్దశ

సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమిట్ 2026 ఛైర్మన్, బీఎల్పీ-ఇండస్ట్రీ ఏఐ వ్యవస్థాపక సీఈఓ తేజ్‌ప్రీత్ సింగ్ చోప్రా మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ టూల్స్ వినియోగం ఇంధన పొదుపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయని తెలిపారు. "దేశ జీడీపీలో 30 శాతానికి పైగా, ఎగుమతుల్లో దాదాపు 50 శాతం వాటా ఉన్న ఎంఎస్‌ఎంఈ రంగానికి ఏఐ గొప్ప బలాన్ని ఇస్తుంది. పారిశ్రామిక రంగంలో కార్మికుల స్థానాన్ని ఏఐ భర్తీ చేయడం కాదు, కార్మికులకు ఏఐ సాంకేతికత తోడైతే మానవ నైపుణ్యం, ఉత్పత్తి సామర్థ్యం వేగంగా పెరుగుతాయి" అని ఆయన వివరించారు.

భారీగా తగ్గిన వ్యయం.. నిలకడైన రాబడులు

ఇంధన నిర్వహణలో సాధించిన పురోగతిని సీఐఐ గొద్రెజ్ జీబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వి. కిరణ్ అనంద్ వివరించారు. గత మూడేళ్ల కాలంలో 720 పారిశ్రామిక సంస్థలు ఇంధన సమర్థత కోసం రూ.5,700 కోట్లు పెట్టుబడి పెట్టగా, దానివల్ల రూ.7,100 కోట్లకు పైగా ఆదా చేయగలిగాయని వెల్లడించారు. రాబోయే కాలంలో విద్యుదీకరణ, ఐఓటీ (IoT), ఏఐ, వ్యర్థాల నుంచి వేడిని సేకరించే ప్రక్రియలు (Waste-heat recovery), ప్రాసెస్ మెరుగుదల కోసం పరిశ్రమలు కొత్తగా రూ.3,590 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

'ఇండియా హీట్ పంప్ అట్లాస్' ఆవిష్కరణ

ఈ సదస్సులో సీఐఐ హీట్ పంప్ అలయన్స్ రూపొందించిన 'ఇండియా హీట్ పంప్ అట్లాస్' డాష్‌బోర్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా 13 టెక్నాలజీ భాగస్వాముల సహకారంతో, 288 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2,201 పారిశ్రామిక, వాణిజ్య ఇన్స్టాలేషన్ల సమాచారాన్ని ఈ డాష్‌బోర్డ్‌లో క్రోడీకరించారు. ఆటోమొబైల్స్, ఫార్మా, కెమికల్స్, టెక్స్‌టైల్స్, ఫుడ్ వంటి అనేక రంగాలలో 100 డిగ్రీల సెల్సియస్ నుండి 140 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను ఉపయోగించే 34 భారీ పారిశ్రామిక ఇన్స్టాలేషన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఈ అట్లాస్ ద్వారా వెల్లడైంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More