కాక్రోచ్ జనతా పార్టీకి ఊరట: ఎక్స్ అకౌంట్ అన్బ్లాక్కు హైకోర్టు ఆదేశం
నీట్ పరీక్షల నేపథ్యంలో నిలిపివేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ (ట్విటర్) ఖాతాను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పరీక్షలు ముగిసినందున ఆంక్షల అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆ పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాపై ఉన్న బ్లాక్ను తక్షణమే తొలగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరణ ఇచ్చిన తర్వాత, న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ ఆదేశాలు ఇచ్చారు.

"నీట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులలో గందరగోళం రేకెత్తించే అవకాశం ఉన్నందునే ఆ అకౌంట్ను నిలిపివేశాం" అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. అయితే, ప్రస్తుతం పరీక్షలు ముగిసినందున ఆ ఆందోళనలు లేవని ఆయన స్పష్టం చేశారు.
కేంద్రం ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ శర్మ.. ఖాతాను బ్లాక్ చేయడానికి దారితీసిన ప్రాథమిక కారణం ఇప్పుడు ముగిసిపోయిందని పేర్కొంటూ అకౌంట్ను పునరుద్ధరించాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీ వివాదం కారణంగా రద్దయిన నీట్ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించిన సంగతి తెలిసిందే.
కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏమిటి? ఎందుకు బ్లాక్ చేశారు?
మొదట్లో ఇదొక వ్యంగ్య (సటైర్) గ్రూప్గా ప్రారంభమైనప్పటికీ, నీట్ పరీక్ష రద్దు తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తమైన ఆగ్రహంతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ యువతలో బాగా ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియాలో దీనికి ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతున్న సమయంలో, మే నెలలో కేంద్ర ప్రభుత్వ అధికారిక విజ్ఞప్తి మేరకు ఎక్స్ సంస్థ భారత్లో ఈ అకౌంట్ను నిలిపివేసింది. ఆ తర్వాత 'కాక్రోచ్ ఈజ్ బ్యాక్' పేరుతో మరో ప్రత్యామ్నాయ ఖాతాను తెరిచి ఈ పార్టీ తన డిజిటల్ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
లీకేజీలపై కొనసాగుతున్న నిరసనలు
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ వ్యవహారంపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారానికి 10వ రోజుకు చేరుకుంది.
మరోవైపు, ఈ పార్టీ ప్రతినిధి అభిజీత్ దిప్కే సోమవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో పాల్గొన్నారు. నీట్ పునర్విచారణ పరీక్షలు ముగిసినప్పటికీ, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారలేదని ఈ నిరసనలు స్పష్టం చేస్తున్నాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


