RCB vs CSK: ఐపీఎల్ 2026లో వివాదం.. చిన్నస్వామి స్టేడియంలో అవమానం.. బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు.. ఆ పాటపైనే రగడ!

RCB vs CSK: బెంగళూరులో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో తమ ఆటగాళ్లను అవమానించారంటూ సీఎస్కే ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద పాట, డీజే వ్యాఖ్యలపై బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Apr 16, 2026 9:17 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

RCB vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరు మైదానంలోనే కాదు.. ఇప్పుడు బోర్డు వరకు వెళ్లింది. ఏప్రిల్ 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా తమను కించపరిచారని, అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఫిర్యాదు చేసింది.

సీఎస్కే, ఆర్సీబీ ఆటగాళ్లు (PTI)
సీఎస్కే, ఆర్సీబీ ఆటగాళ్లు (PTI)

వివాదం ఏమిటి?

ఏప్రిల్ 5న సీఎస్కే, ఆర్సీబీ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం డీజే 'దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, చట్నీ' అనే పాటను ప్లే చేయడం వివాదానికి కేంద్రబిందువైంది. గానా అప్పు కంపోజ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. అయితే దీన్ని మీమ్స్‌లో ఎక్కువగా వాడుతుంటారు.

ట్రోల్ చేశారంటూ

ముఖ్యంగా సీఎస్కే ను ఉద్దేశించి ప్రత్యర్థి జట్ల అభిమానులు ఆ పాటను నెట్టింట ట్రోలింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. అయితే, ఒక బాధ్యతాయుతమైన ఐపీఎల్ ఫ్రాంచైజీ హోమ్ గ్రౌండ్‌లో ఇలాంటి పాటను ప్లే చేయడం ఏమాత్రం సమంజసం కాదని సీఎస్‌కే భావిస్తోంది.

గత ఏడాది జితేష్ శర్మ ఈ పాట పాడుతూ కనిపించినప్పుడు కూడా సీఎస్‌కే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పట్లో చెన్నై ఫ్రాంచైజీ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దింది. కానీ ఇప్పుడు ఏకంగా స్టేడియంలోనే అధికారికంగా ఈ పాటను ప్లే చేయడం సీఎస్‌కే ఆగ్రహానికి కారణమైంది.

కాశీ విశ్వనాథన్ రియాక్షన్

ఈ వ్యవహారంపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "సాధారణంగా స్టేడియంలో ఉండే డీజేలు హోమ్ టీమ్‌ను ఉత్సాహపరుస్తుంటారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితి వేరుగా ఉంది. మా ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి బీసీసీఐకి ఫిర్యాదు చేశాం’’ అని కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశారు.

కేవలం పాట మాత్రమే కాకుండా, సీఎస్కే ఆటగాళ్లు ఔటైన సమయంలో డీజే చేసిన కొన్ని కామెంట్స్ కూడా అవమానకరంగా ఉన్నాయని మేనేజ్‌మెంట్ తన ఫిర్యాదులో పేర్కొంది.

బెంగళూరు జోరు

మైదానంలో జరిగిన పోరు విషయానికొస్తే.. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నైకి ఈ సీజన్ ఆరంభం అంతగా కలిసిరాలేదు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయిన చెన్నై, ఆ తర్వాత సొంత గడ్డపై రెండు విజయాలతో పుంజుకుంది. తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 18న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్‌తో తలపడనుంది.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుధవారం (ఏప్రిల్ 15) లక్నో సూపర్ జెయింట్స్‌పై సాధించిన విజయంతో కలిపి ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి మంచి ఊపు మీద ఉంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో మాత్రమే ఆ జట్టు ఒక ఓటమిని చవిచూసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. సీఎస్‌కే ఎందుకు బీసీసీఐకి ఫిర్యాదు చేసింది?

ఏప్రిల్ 5న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో డీజే ప్రవర్తన, ప్లే చేసిన పాట తమ ఆటగాళ్లను అవమానించేలా ఉన్నాయని సీఎస్‌కే ఫిర్యాదు చేసింది.

2. వివాదానికి కారణమైన ఆ పాట ఏమిటి?

'దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ' అనే పాట. దీనిని సోషల్ మీడియాలో తరచుగా దక్షిణాది వారిని ట్రోల్ చేయడానికి లేదా మీమ్స్ కోసం వాడుతుంటారు.

3. ప్రస్తుతం ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఏది?

ప్రస్తుతానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More