Gold rate today : ఏడాది పాటు బంగారం కొనొద్దన్న ప్రధాని మోదీ- పతనమైన ధరలు..
Gold price today Delhi : ప్రధాని మోదీ విజ్ఞప్తితో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోయాయి. యుద్ధ సంక్షోభం దృష్ట్యా ఏడాది పాటు పసిడి కొనొద్దన్న ఆయన పిలుపు ప్రభావం మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి బంగారం, వెండి తాజా ధరల వివరాలు ఇక్కడ చూడండి..
పశ్చిమాసియాలో నెలకొన్న అమెరికా-ఇరాన్ యుద్ధ సంక్షోభం, దానివల్ల తలెత్తిన అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు కీలక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, దేశ ప్రయోజనాల దృష్ట్యా పౌరులు తమ వ్యక్తిగత కొనుగోలు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని తెలిపారు. మోదీ ప్రసంగం కారణంగా సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగొచ్చాయి.

ప్రధాని మోదీ ప్రసంగం - బంగారం ఎందుకు కొనొద్దు?
ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని, ఈ తరుణంలో భారత్ తన విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని మోదీ పేర్కొన్నారు.
“మనం విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా ఖర్చు చేసే రంగాల్లో బంగారం కొనుగోళ్లు ఒకటి. దేశ హితం దృష్ట్యా, కనీసం ఏడాది పాటు బంగారం కొనకూడదని మనమందరం ఒక దృఢ నిశ్చయానికి రావాలి. ఇంధన వినియోగాన్ని కూడా వీలైనంత తగ్గించాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారులలో ఒకటిగా ఉందని, ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సమయంలో పెరిగే డిమాండ్ వల్ల డాలర్ నిల్వలు బయటకు వెళ్లిపోతూ దేశ దిగుమతి బిల్లును భారం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నేటి బంగారం ధరలు (మే 11, 2026)..
ప్రధాని పిలుపుతో మార్కెట్లో కొనుగోలుదారులు వెనక్కి తగ్గడంతో సోమవారం బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి.
24 క్యారెట్ల బంగారం: గ్రాముకు రూ. 603.0 తగ్గి, ప్రస్తుతం రూ. 15,192.0 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల బంగారం: గ్రాముకు రూ. 552.35 తగ్గి, రూ. 13,915.872 వద్ద ఉంది.
మార్పు: గత వారంలో 24 క్యారెట్ల ధర -1.84% మేర తగ్గగా, గత నెలలో స్వల్పంగా 0.13% మార్పు కనిపించింది.
వెండి ధర: బంగారం తగ్గగా, వెండి ధర మాత్రం కిలోకు రూ. 709.0 పెరిగి రూ. 2,62,557.0 కు చేరుకుంది.
| నగరం | నేటి 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రా) | నేటి వెండి ధర (కిలోకు) |
|---|---|---|
| దిల్లీ | రూ. 1,51,920.0 | రూ. 2,62,557.0 |
| చెన్నై | రూ. 1,53,357.91 | రూ. 2,64,878.64 |
| ముంబై | రూ. 1,52,077.93 | రూ. 2,62,778.52 |
| కోల్కతా | రూ. 1,53,205.92 | రూ. 2,64,616.13 |
| హైదరాబాద్ | రూ. 1,52,350 | రూ. 2,85,000 |
| విజయవాడ | రూ. 1,52,130 | రూ. 2,85,000 |
ఎంసీఎక్స్ అప్డేట్స్..
ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్లో బంగారం ధర సోమవారం పడింది. గోల్డ్ జూన్ ఫూచర్స్ (10గ్రాములు) 0.28శాతం డౌన్ అయ్యి రూ. 1,52,100కి చేరింది. అదే సమయంలో సిల్వర్ జులై కాంట్రాక్ట్స్ 0.25శాతం పడి కేజీకి రూ. 2,62,580కి చేరుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్, డాలర్తో రూపాయి మారకం విలువ, ప్రభుత్వ విధానాల వంటి అంశాలు ఈ ధరల మార్పుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాని పిలుపు తర్వాత నగల దుకాణదారులు, పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు.
యుద్ధం వేళ బంగారం కొనుగోళ్లు తగ్గించండి అని చెప్పడంతో పాటు దేశ ప్రజలకు ప్రధాని మోదీ అనేక సూచనలు ఇచ్చారు. వాటి గురించి వివరంగా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


