LPG Cylinders: ఉజ్వల లబ్ధిదారులకు షాక్: సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 9 నుంచి 4కు తగ్గింపు

పెరుగుతున్న ఇంధన సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 9 నుంచి 4కు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Jun 9, 2026, 09:14:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పేద కుటుంబాలకు వంటగ్యాస్ అందించే లక్ష్యంతో ప్రారంభమైన ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ (PMUY) పథకంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద కోత పెట్టింది. దేశంలోని సుమారు 10.5 కోట్ల పేద కుటుంబాలకు ఇప్పటివరకు అందుతున్న సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి తొమ్మిది నుంచి నాలుగుకు తగ్గిస్తున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. సిలిండర్ ధరను రూ. 29 పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ విడుదల చేసిన ప్రకటనలోనే ఈ తగ్గింపు అంశాన్ని కూడా కేంద్రం పొందుపరిచింది.

ఉజ్వల లబ్ధిదారులకు షాక్: సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 9 నుంచి 4కు తగ్గింపు (PTI)
ఉజ్వల లబ్ధిదారులకు షాక్: సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 9 నుంచి 4కు తగ్గింపు (PTI)

సబ్సిడీ తగ్గింపునకు కారణాలివే..

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధన ధరలు మారుతుండటంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 700, లీటర్ పెట్రోల్‌పై రూ. 6, లీటర్ డీజిల్‌పై రూ. 30 చొప్పున నష్టపోతున్నాయని పెట్రోలియం శాఖ అడిషనల్ సెక్రటరీ ప్రవీణ్ ఎమ్. ఖానూజా వివరించారు.

మార్కెట్ ధరలతో పోలిస్తే దేశంలోని మొత్తం 33.37 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులందరికీ ఇప్పటికీ రూ. 700 తక్కువకే సిలిండర్ లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. దీనికి అదనంగా, ఉజ్వల యోజన లబ్ధిదారులైన 10.5 కోట్ల మంది పేదలకు ఏడాదికి నాలుగు సిలిండర్ల వరకు రూ. 300 అదనపు సబ్సిడీ నేరుగా అందుతుందని స్పష్టం చేశారు. ఒక ఉజ్వల కుటుంబం సగటున ఏడాదికి వాడే సిలిండర్ల సంఖ్యను బట్టే ఈ నాలుగు సిలిండర్ల పరిమితిని విధించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

బడ్జెట్ భారం తగ్గించుకునేందుకేనా?

గత ఏడాది ఆగస్టు 2025లో కేంద్ర కేబినెట్ ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 9 సిలిండర్ల వరకు సబ్సిడీని ఆమోదించింది. అయితే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. దీంతో పెరుగుతున్న ఇంధన సబ్సిడీ బిల్లును అదుపులో ఉంచడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ సబ్సిడీల వల్ల ప్రభుత్వానికి రూ. 60,000 కోట్ల మేర నష్టం వాటిల్లగా, అందులో రూ. 30,000 కోట్లను చమురు సంస్థలకు పరిహారంగా కేంద్రం చెల్లించింది.

ఉజ్వల యోజన ప్రస్థానం

2016 (ప్రారంభం): ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ఈ పథకం ప్రారంభమైంది.

2021 (ఉజ్వల 2.0): కనెక్షన్‌తో పాటు మొదటి సిలిండర్, స్టవ్ ఉచితంగా అందించారు.

కోవిడ్ సమయం: గరీబ్ కల్యాణ్ యోజన కింద లబ్ధిదారులకు 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు.

2022-24: ఏడాదికి 12 సిలిండర్ల వరకు రూ. 200 సబ్సిడీ ఇవ్వగా, అక్టోబర్ 2023లో ఆ సబ్సిడీని రూ. 300కు పెంచారు.

ఆగస్టు 2025: సిలిండర్ల పరిమితిని 12 నుంచి 9 కి తగ్గించారు.

ప్రస్తుతం (2026): సబ్సిడీ సిలిండర్ల పరిమితిని 9 నుంచి 4కు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉజ్వల వినియోగదారుల సగటు సిలిండర్ల వినియోగం 2019-20లో 3 రీఫిల్‌గా ఉండగా, అది 2024-25 నాటికి 4.47 రీఫిల్‌లకు పెరిగింది. అంతర్జాతీయంగా ధరలు ఎంత పెరిగినప్పటికీ, భారతీయ పౌరులకు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు వంటగ్యాస్ అందిస్తున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పునరుద్ఘాటించింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More