గువాహటి - కోల్‌కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్: విమాన ప్రయాణానికి గట్టి పోటీ

దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు గువాహటి-కోల్‌కతా మధ్య ప్రారంభం కానుంది. విమాన ప్రయాణానికి దీటైన సౌకర్యాలతో, తక్కువ ధరలోనే ఈ రైలు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, టికెట్ ధరలు ఇక్కడ చూడండి.

Published on: Jan 01, 2026 3:39 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'వందే భారత్ స్లీపర్' రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ సర్వీసును గువాహటి - కోల్‌కతా (హౌరా) మధ్య ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే 15 నుంచి 20 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రతిష్టాత్మక రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు.

గువాహటి - కోల్‌కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్: విమాన ప్రయాణానికి గట్టి పోటీ
గువాహటి - కోల్‌కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్: విమాన ప్రయాణానికి గట్టి పోటీ

అన్ని పరీక్షలు పూర్తి.. ఇక ప్రయాణమే తరువాయి

వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి నిర్వహించిన అన్ని రకాల పరీక్షలు, ట్రయల్స్, భద్రతా తనిఖీలు విజయవంతంగా పూర్తయ్యాయని రైల్వే మంత్రి తెలిపారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "వందే భారత్ చైర్ కార్ వేరియంట్‌కు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అదే ఉత్సాహంతో, సుదూర ప్రయాణాల కోసం తదుపరి తరం స్లీపర్ రైళ్లను తీసుకువస్తున్నాం" అని పేర్కొన్నారు.

విమాన ప్రయాణ ధరతో పోలిస్తే సగం కంటే తక్కువ

సాధారణంగా గువాహటి - కోల్‌కతా మధ్య విమాన టికెట్ ధరలు రూ. 6,000 నుంచి రూ. 10,000 వరకు ఉంటాయి. కానీ, వందే భారత్ స్లీపర్ రైలులో అంతకంటే మెరుగైన సౌకర్యాలతో అత్యంత తక్కువ ధరకే ప్రయాణించవచ్చని మంత్రి వివరించారు. ఈ మార్గంలో ప్రాథమికంగా నిర్ణయించిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • 3AC టికెట్ ధర: సుమారు రూ. 2,300
  • 2AC టికెట్ ధర: సుమారు రూ. 3,000
  • ఫస్ట్ AC టికెట్ ధర: సుమారు రూ. 3,600

వేగంతోపాటు సురక్షిత ప్రయాణం

ఈ రైలును 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండే ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇటీవల కోట–నాగ్దా సెక్షన్‌లో నిర్వహించిన హై-స్పీడ్ ట్రయల్స్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. బ్రేకింగ్ సిస్టమ్, రైడ్ స్టెబిలిటీ, వైబ్రేషన్ మరియు ఎమర్జెన్సీ రెస్పాన్స్ వంటి అన్ని అంశాల్లో ఇది అద్భుతమైన ఫలితాలను సాధించిందని అధికారులు ధృవీకరించారు.

విలాసవంతమైన సౌకర్యాలు.. అత్యాధునిక భద్రత

మొత్తం 16 కోచ్‌లతో రూపొందిన ఈ స్లీపర్ రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించారు.

సౌకర్యాలు: ఆటోమేటిక్ డోర్లు, సౌకర్యవంతమైన బెర్త్‌లు, మోడ్రన్ టాయిలెట్లు, సీసీటీవీ సర్వైలెన్స్, డిజిటల్ డిస్ప్లే బోర్డులు.

భద్రత: రైళ్లు పరస్పరం ఢీకొనకుండా అడ్డుకునే 'కవచ్' (KAVACH) వ్యవస్థ, అత్యాధునిక ఫైర్ డిటెక్షన్ సిస్టమ్, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ యూనిట్లు ఉన్నాయి.

ప్రత్యేకత: దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులను కూడా ఈ రైలులో ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది చివరి నాటికి సుమారు 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ రైళ్లు భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చనున్నాయి.