Train accident : పట్టాలు తప్పి.. మరో రైలును ఢీకొట్టిన ట్రైన్- 21మంది మృతి
స్పెయిన్లో విషాదం చోటుచేసుకుంది. ఓ రైలు పట్టాలు తప్పి, అటుగా వస్తున్న మరో ట్రైన్ని ఢీకొట్టింది. అనంతరం ఆ రైలు కూడా పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 20కిపైగా మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.
స్పెయిన్లో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ హై- స్పీడ్ రైలు పట్టాలు తప్పింది. ఆ వెంటనే ఎదురుగా వస్తున్న మరో ట్రైన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 21మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. పరిస్థితిని చూస్తుంటే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
స్పెయిల్లో రైలు ప్రమాదం- అసలేం జరిగింది?
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు, దక్షిణ స్పెయిన్లోని కార్బొడాలో అడముజ్ స్టేషన్కు సమీపంలో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మలగా నుంచి మాడ్రిడ్ వెళుతున్న ఓ రైలు తొలుత పట్టాలు తప్పింది. అదే సమయంలో అటు వైపు నుంచి వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఆ రైలు మాడ్రిడ్ నుంచి హుల్వాకు వెళుతోంది. అనంతరం ఆ రైలు కూడా పట్టాలు తప్పింది.
స్పెయిన్ రైలు ప్రమాదం కారణంగా ఘటనాస్థలం అత్యంత భయానకంగా మారింది. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంగణం దద్ధరిల్లిపోయుంది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలానికి పరుగులు తీశారు. అనేక మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కాగా రైళ్లపై యాక్సిడెంట్ ప్రభావం అధికంగా ఉండటంతో సహాయక చర్యలు కష్టంగా మారాయని అధికారులు వెల్లడించారు.
స్పెయిన్ రైలు ప్రమాదం కారణంగా మాడ్రిడ్ నుంచి అడలుసియా మధ్య హై-స్పీడ్ రైలు సేవలు నిలిచిపోయాయి. కాగా కమర్షియల్ సర్వీసు మాత్రం కొనసాగుతోందని అధికారులు తెలియజేశారు.
స్పెయిన్ రైలు ప్రమాదంపై ఆ దేశ రాజు ఫిలిపే 6, రాణి లిటిజియా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
పెరిగిపోతున్న రైలు ప్రమాదాలు..
రైలు ప్రమాద వార్త.. గత వారం రోజుల్లో ఇది రెండోసారి! థాయిలాండ్లో ఓ రైలు పట్టాలు తప్పడంతో 22మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి రైలు బయలుదేరిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక చోట హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ జరుగుతోంది. ఆ ప్రాంతంలో ఒక క్రెయిన్ కూలిపోయింది. అది రైలు మీద పడింది. అనంతరం రైలు పట్టాలు తప్పింది. ఆ వెంటనే రైలుకు మంటలు అంటుకున్నాయి.
ఇక స్పెయిన్లో తాజా ఘటన.. కొన్నేళ్ల క్రితం ఇండియాలో జరిగిన విషాదాన్ని గుర్తుచేస్తోంది. ఒడిశా బాలాసోర్ సమీపంలో రెండు రైళ్లు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ విషాదం 250కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి విషాద దృశ్యాలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












