ఇండియాలోనే ఆడాలి.. షెడ్యూల్ మార్చేది లేదు.. ఒక రోజులో ఏదో విషయం చెప్పండి: బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) విజ్ఞప్తిని ఐసీసీ ఖరాఖండిగా తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారమే భారత్‌లో మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. పాల్గొంటారో లేదో చెప్పడానికి ఒక్క రోజు గడువు విధించింది.

Published on: Jan 21, 2026, 19:25:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ వేదికపై సందిగ్ధతకు ఐసీసీ తెరదించింది. భద్రతా కారణాల రీత్యా తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇండియాలోనే ఆడాలి.. షెడ్యూల్ మార్చేది లేదు.. ఒక రోజులో ఏదో విషయం చెప్పండి: బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ఇండియాలోనే ఆడాలి.. షెడ్యూల్ మార్చేది లేదు.. ఒక రోజులో ఏదో విషయం చెప్పండి: బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ

ఐసీసీ కండీషన్లు ఇవే..

ఇండియాలో తమ ప్లేయర్స్ కు భద్రతా సమస్యలు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్‌లో తమ టీమ్ ఆడే మ్యాచ్ లను శ్రీలంకకు తరలించాలని డిమాండ్ చేసింది. లేదంటే టోర్నమెంట్ నుంచి తప్పుకునే ఆలోచన కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఐసీసీ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు.

బంగ్లాదేశ్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే ఇండియాలో జరుగుతాయని బుధవారం (జనవరి 21) స్పష్టం చేసింది. టోర్నీలో పాల్గొంటారా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి బంగ్లాదేశ్ బోర్డుకు ఐసీసీ ఒక్క రోజు గడువు ఇచ్చింది.

ఒకవేళ బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే, వారి స్థానంలో స్కాట్లాండ్ (Scotland) జట్టును ఎంపిక చేస్తామని ఐసీసీ హెచ్చరించింది.

భద్రతపై భరోసా..

"మేం స్వతంత్ర సంస్థలతో భద్రతా సమీక్షలు నిర్వహించాం. ఇండియాలోని ఏ వేదికలోనూ బంగ్లాదేశ్ ఆటగాళ్లకు గానీ, అధికారులకు గానీ, అభిమానులకు గానీ ఎలాంటి ముప్పు లేదు" అని ఐసీసీ స్పష్టం చేసింది.

అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే?

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 వేలంలో రూ. 9.2 కోట్లకు అమ్ముడైన బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐ.. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను కోరింది.

ఇది జరిగిన మరుసటి రోజే (జనవరి 4న) బంగ్లాదేశ్ బోర్డు తమ మ్యాచ్‌లను మార్చాలని ఐసీసీకి లేఖ రాసింది. ఒక ఆటగాడికి సంబంధించిన లీగ్ అంశాన్ని (ఐపీఎల్), వరల్డ్ కప్ భద్రతకు ముడిపెట్టడం సరికాదని ఐసీసీ.. బంగ్లా తీరును తప్పుబట్టింది.

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ ప్రస్తుతం గ్రూప్-సి లో ఉంది. కోల్‌కతా, ముంబై వేదికగా ఆ టీమ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 8న ఫైనల్ జరగనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More