IMD alerts : మధ్యప్రదేశ్​ నుంచి మిజోరం​ వరకు భారీ వర్షాలు- దక్షిణ భారతంలో మాత్రం తక్కువే!

IMD rain alert : ఈశాన్య మధ్యప్రదేశ్ లో తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా మధ్య, ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు రానున్న వారం రోజుల్లో దక్షిణ భారతదేశంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Aug 22, 2026, 05:59:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది! ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా తూర్పు మధ్యప్రదేశ్‌లో ఆగస్టు 22న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో రానున్న వారం రోజుల్లో దక్షిణ భారతదేశంలో రుతుపవనాల ప్రభావం కాస్త మందగించనుందని తెలిపింది.

ఐఎండీ రెయిన్ అలర్ట్స్..
ఐఎండీ రెయిన్ అలర్ట్స్..

మధ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు..

ఈ వారం మధ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ఆగస్టు 22 నుంచి 25 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఆగస్టు 22 నుంచి 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. విదర్భ ప్రాంతంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు వర్షాలు పడతాయని అంచనా వేశారు.

వాయువ్య భారతదేశంలో ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 27 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాల్లో ఆగస్టు 22-23 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. హరియాణా, చండీగఢ్, దిల్లీలో ఆగస్టు 22న వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఆగస్టు 22 నుంచి 24 వరకు వర్షాలు పడతాయని తెలిపారు.

తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణం..

తూర్పు భారతదేశంలోని గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఆగస్టు 22 నుంచి 27 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఝార్ఖండ్, ఒడిశాలో కూడా ఈ సమయంలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈశాన్య భారతదేశంలో రానున్న వారం రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వివరించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 26-27 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఆగస్టు 22-23 తేదీలలో.. అనంతరం ఆగస్టు 25-27 మధ్య భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచివున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో అసోం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ జిల్లాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.

దక్షిణ భారతదేశంలో పరిస్థితి ఏంటి?

దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో మాత్రం వర్షాలు చాలా వరకు చెదురుమదురుగా కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. అయితే తీర ప్రాంత కర్ణాటక, కేరళ, మాహె, లక్షద్వీప్‌లలో మాత్రం ఆగస్టు 27 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

జూన్, జులై వర్షపాత సరళి..

గత నెలల పరిస్థితులను పరిశీలిస్తే.. జూన్ నెలలో సాధారణం కంటే 35.4 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, అయితే జులైలో మాత్రం సాధారణం కంటే 1 శాతం అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.

ఇక జూన్ 1 నుంచి ఆగస్టు 18 మధ్య కాలంలో సేకరించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 12.6 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More