...
...
Next Story

భారత్‌కు బెదిరింపు: ‘షేక్ హసీనాను అప్పగించకపోతే.. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తాం’

మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించకపోతే భారత్‌కు చెందిన ఉగ్రవాదులకు బంగ్లాదేశ్ ఆశ్రయం ఇస్తుందని ఆ దేశ మాజీ సైన్యాధికారి రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ హసీనూర్ రెహమాన్ వ్యాఖ్యలు చేశారు.

Published on: Nov 18, 2025, 16:25:26 IST
Advertisement

బంగ్లాదేశ్ మాజీ సైన్యాధికారి ఒకరు భారతదేశానికి నేరుగా బెదిరింపులు ఇవ్వడం కలకలం రేపుతోంది. లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) హసీనూర్ రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కోరినప్పటికీ, మాజీ ప్రధాని షేక్ హసీనాను భారతదేశం తమకు వెనక్కి పంపకపోతే, దేశంలో భారతీయ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరించారు.

షేక్ హసీనాపై మరణశిక్ష తీర్పుపై సంతోషం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా వ్యతిరేకుల ప్రదర్శన (REUTERS)
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా వ్యతిరేకుల ప్రదర్శన (REUTERS)

మరోవైపు, అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనాపై వచ్చిన మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో, ఆమెకు విధించిన మరణశిక్ష తీర్పుపై లెఫ్టినెంట్ కల్నల్ హసీనూర్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ తీర్పుపై హసీనూర్ రెహమాన్ స్పందిస్తూ, "ఈ తీర్పుపై స్పందించడానికి నాకు మాటలు రావడం లేదు. ఆయ్‌నాఘర్‌ జైలులో, ఉద్యోగంలో ఉన్నప్పుడే నిర్బంధంలోకి తీసుకోవడం, జైల్లో చిత్రహింసలు వంటివి నేను భరించాను. దేవుడి దయవల్ల మాకు న్యాయం దక్కింది. అయితే, ఈ శిక్ష అమలు జరిగే వరకు మాకు మనశ్శాంతి ఉండదు. జూలై విప్లవంలో వీరమరణం పొందిన 1,400 మంది కోసం ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. ఈ విచారణను అత్యంత వేగంగా ముగించాలి" అని డిమాండ్‌ చేశారు.

"మహమ్మద్ యూనస్ సమర్థవంతమైన నాయకుడు"

అనంతరం హసీనూర్ మాట్లాడుతూ, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌కు అత్యంత సమర్థవంతమైన నాయకుడని కీర్తించారు.

"చట్టపరమైన సహాయం ద్వారా ఆయన (మహమ్మద్ యూనస్) విదేశాల నుంచి షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి తీసుకురాగలరు. షేక్ హసీనాను దేశానికి రప్పించడానికి భారత ప్రజల సహాయం అవసరం. ముఖ్యంగా భారత ప్రజలు, పశ్చిమ బెంగాల్ ప్రజలు, ఇన్షా అల్లా సహాయం చేస్తారు. ఒకవేళ అలా చేయకపోతే, మేము భారతదేశానికి చెందిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తాం. అప్పుడు భారతదేశం ప్రశాంతంగా ఉండలేదు" అని హసీనూర్ రెహమాన్ తీవ్రంగా హెచ్చరించారు.

ఢిల్లీ పేలుడు, బంగ్లాదేశ్ ఉగ్రవాద నివేదిక

ఢాకాలోని బనానీలో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి పాకిస్థానీ ఉగ్రవాద నాయకుడు సైఫ్ వర్చువల్‌గా హాజరయ్యాడు. నివేదిక ప్రకారం, ఏడుగురు ప్రముఖ ఉగ్రవాద నాయకులు ఈ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు.

బంగ్లాదేశ్‌లో నిషేధిత ఇస్లామిక్ సంస్థ హిజ్బుల్ హహిర్ నాయకుడు జుబేర్ అహ్మద్ చౌదరి, సైఫ్ ప్రధాన సహచరుడు మార్కాజి జమాత్ ఏ హదీస్ ప్రధాన కార్యదర్శి ఇలాహి జాహిర్ అక్కడ ఉన్నారు.

ఢాకా నార్త్ కార్పొరేషన్ సీఈఓ, హిజ్బుల్ తాహిర్ సమన్వయకర్త మహమ్మద్ అజాజ్ కూడా ఈ సమావేశంలో కనిపించారు. వీరితో పాటు, అన్సారుల్లా బంగ్లా టీమ్ నాయకులు హఫీజ్ సుజాదుల్లా, హఫీజ్ అలీ ఫజుల్, అలాగే పేలుడు పదార్థాల నిపుణుడిగా పేరుగాంచిన సుమన్ అహ్మద్ కూడా ఉన్నట్లు సమాచారం.

ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని ఇద్దరు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు నివేదిక వెల్లడించింది.

ఈ సమావేశంలోనే పాక్ ఉగ్రవాది సైఫ్.. బంగ్లాదేశీయులకు భారతదేశంలో పెద్ద ఎత్తున దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ దాడులకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా నుంచి సహాయం అందుతుందని సైఫ్ హామీ ఇచ్చాడు.

నివేదిక ప్రకారం, ఈ సమావేశం తరువాత, ఒక ఉగ్రవాద బృందం పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ మీదుగా భారతదేశంలోకి చొరబడింది. ఈ బృందంలో పేలుడు పదార్థాల నిపుణుడు కూడా ఉన్నాడు.

ముర్షిదాబాద్‌లోని ఇక్తియార్ అనే అక్రమ బంగ్లాదేశీ పౌరుడి ఇంట్లో ఈ ఉగ్రవాద బృందం బస చేసింది. ఏబీటీ (అన్సారుల్లా బంగ్లా టీమ్) ఉగ్రవాదులు ఈ ఇళ్లను తరచుగా 'సేఫ్‌హౌస్‌'గా ఉపయోగిస్తారని నివేదికలో పేర్కొన్నారు.

పాకిస్థాన్ నుంచి కొన్ని విధ్వంసక పరికరాలు బంగ్లాదేశ్ మీదుగా ముర్షిదాబాద్‌కు చేరాయని కూడా నివేదికలు స్పష్టం చేశాయి.

ఢిల్లీ పేలుడుకు పది రోజుల ముందు పాకిస్థానీ ఉగ్రవాదుల సమావేశంలో సైఫ్ మాట్లాడుతూ, "హాఫీజ్ సయీద్ ఖాళీగా కూర్చోలేదు. అతడి కుడిచేతి వాటం జాహిర్ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్నాడు. అతను తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) గుండా భారతదేశంపై దాడికి సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు అమెరికా మా వైపు ఉంది. మన నుంచి లాక్కున్న బంగ్లాదేశ్ మళ్లీ పాకిస్థాన్‌కు దగ్గరవుతోంది" అని వ్యాఖ్యానించాడు.

అయితే, బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఈ ఆరోపణలను, నివేదికలను పూర్తిగా ఖండించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks