చరిత్ర సృష్టించిన యంగిండియా.. ఆరోసారి అండర్ 19 వరల్డ్ కప్ కైవసం.. ఫైనల్లో ఇంగ్లండ్ చిత్తు
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత యువజట్టు చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ను 100 పరుగుల భారీ తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో ఆరోసారి కప్ ఎగరేసుకుపోయింది. వైభవ్ సూర్యవంశీ 175 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్తో ఫైనల్ మ్యాచ్ను వన్ మ్యాన్ షోగా మార్చేశాడు. ఈ అద్భుత విజయం విశేషాలు ఇక్కడ చూడండి.
అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ను ఆరోసారి గెలిచింది యంగిండియా. ఆయుష్ మాత్రే నాయకత్వంలోని భారత యువ సైన్యం ప్రపంచ క్రికెట్లో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి.. చరిత్రలో అత్యధికంగా ఆరుసార్లు అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఫైనల్లో ఇంగ్లండ్ ను 100 పరుగులతో చిత్తుగా ఓడించింది. 412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 311 పరుగులకే ఆలౌటైంది.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 411 పరుగుల భారీ స్కోరు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆరంభంలోనే సెమీస్ హీరో ఆరోన్ జార్జ్ వికెట్ కోల్పోవడం కాస్త నిరాశ కలిగించింది. కానీ క్రీజులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ థామస్ రీవ్ ఎన్ని ప్లాన్లు వేసినా వైభవ్ జోరు ముందు అవి పనిచేయలేదు.
కెప్టెన్ ఆయుష్ మాత్రే (53 పరుగులు, 51 బంతుల్లో) చక్కటి సహకారం అందించగా.. వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి రికార్డుల మోత మోగించాడు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించినా మన్నీ లమ్స్డెన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు తీసినా, భారత టెయిలెండర్లు పోరాడటంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ రికార్డు స్థాయిలో 411/9 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఫాల్కనర్ పోరాడినా.. భారత్దే విజయం
412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. డాకిన్స్, బెన్ మేస్, థామస్ రీవ్ల ద్వారా గట్టిగానే బదులివ్వాలని ప్రయత్నించింది. అయితే భారత్ సరైన సమయంలో వికెట్లు తీసి దెబ్బకొట్టింది. అంబ్రిష్ తొలి బ్రేక్ ఇవ్వగా.. 21వ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆ ఓవర్లో సెట్ బ్యాటర్ డాకిన్స్, రాల్ఫిన్ ఆల్బర్ట్ ఔట్ కావడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఒకానొక దశలో 177/7తో ఓటమి అంచున నిలిచింది.
అయితే కాలేబ్ ఫాల్కనర్ (115 పరుగులు, 67 బంతుల్లో), జేమ్స్ మింటో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫాల్కనర్ చివరి వరకు పోరాడి అద్భుతమైన సెంచరీ సాధించాడు. కానీ భారీ లక్ష్యం ముందు ఆ పోరాటం సరిపోలేదు. చివరికి కనిష్క్ చౌహాన్ బౌలింగ్లో ఫాల్కనర్ ఔట్ అవ్వడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 311 పరుగుల వద్ద ముగిసింది. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి కప్ ముద్దాడింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper












