ఏఐ కంటెంట్‌‌తో ఏడాదికి 38 కోట్లు.. బందర్ అప్నా దోస్త్ యూట్యూబ్ ఛానెల్ సంపాదన

'బందర్ అప్నా దోస్త్' అనే ఇండియన్ యూట్యూబ్ ఛానల్ కేవలం AI వీడియోలతో ఏడాదికి రూ. 38 కోట్లు సంపాదిస్తోంది. కేవలం కొద్ది నెలల క్రితమే మొదలైన ఈ ఛానల్, AI కంటెంట్‌తో కూడా గ్లోబల్ వ్యూయర్‌షిప్ సాధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Published on: Dec 30, 2025, 16:47:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఎంతో కష్టం, సృజనాత్మకత ఉండాలని మనం అనుకుంటాం. కానీ, కృత్రిమ మేధ (AI) సాయంతో ఎటువంటి లోతైన కథ లేదా డైలాగులు లేకుండానే కోట్లు సంపాదించవచ్చని నిరూపిస్తోంది ఒక భారతీయ యూట్యూబ్ ఛానల్. 'బందర్ అప్నా దోస్త్' (Bandar Apna Dost) పేరుతో నడుస్తున్న ఈ ఛానల్, ఏటా ఏకంగా 38 కోట్ల రూపాయల వరకు ఆర్జిస్తోందని తాజాగా ఒక అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది.

ఏఐ కంటెంట్‌‌తో ఏడాదికి 38 కోట్లు.. బందర్ అప్నా దోస్త్ యూట్యూబ్ ఛానెల్ సంపాదన
ఏఐ కంటెంట్‌‌తో ఏడాదికి 38 కోట్లు.. బందర్ అప్నా దోస్త్ యూట్యూబ్ ఛానెల్ సంపాదన

AI మాయాజాలం.. కాసుల వర్షం

వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫారమ్ 'క్యాప్‌వింగ్' (Kapwing) నిర్వహించిన ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం.. తక్కువ శ్రమతో, కేవలం AI పరికరాలను ఉపయోగించి రూపొందించిన ఈ ఛానల్ వీడియోలకు విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. కేవలం కొన్ని నెలల క్రితమే ప్రారంభమైనప్పటికీ, ఈ ఛానల్ ఏడాదికి సుమారు 4.25 మిలియన్ డాలర్లు (రూ. 35 నుండి 38 కోట్లు) సంపాదిస్తున్నట్లు అంచనా. దీన్ని టెక్ వర్గాల్లో 'AI స్లాప్' (AI slop) కంటెంట్‌గా పిలుస్తున్నారు. అంటే, మానవ ప్రమేయం చాలా తక్కువగా ఉండి, కేవలం క్లిక్‌లు, వ్యూస్ కోసం రూపొందించే నాణ్యత లేని వీడియోలు అని అర్థం.

ఏమిటి ఈ వీడియోల ప్రత్యేకత?

ఈ ఛానల్‌లో ఎక్కువగా ఒక కోతి బొమ్మ, హల్క్ (Hulk) వంటి బలమైన క్యారెక్టర్ల చుట్టూ తిరిగే యానిమేటెడ్ క్లిప్స్ ఉంటాయి. ఇందులో ఎలాంటి సంభాషణలు గానీ, కథ గానీ ఉండదు. కేవలం ఆశ్చర్యకరమైన విజువల్స్ మాత్రమే ఉంటాయి. "ఈ వీడియోలలో కథాంశం లేకపోవడమే వీటికి ప్లస్ పాయింట్. భాషా భేదం లేకుండా ఎవరైనా వీటిని చూడగలగడం, విచిత్రమైన విజువల్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి" అని డిజిటల్ రైట్స్ పరిశోధకురాలు రోహిణి లక్షణె అభిప్రాయపడ్డారు.

అంకెల్లో 'బందర్ అప్నా దోస్త్' ప్రభంజనం:

  • మొత్తం వ్యూస్: 207 కోట్లకు పైగా.
  • సబ్‌స్క్రైబర్లు: 27.6 లక్షల మంది.
  • కంటెంట్ శైలి: యానిమేటెడ్ షార్ట్ వీడియోలు.

నిపుణుల ఆందోళన

ఈ పరిణామం యూట్యూబ్ సిస్టమ్ పై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. యూట్యూబ్ తన కొత్త వినియోగదారులకు సూచించే వీడియోలలో దాదాపు 20% వరకు ఇలాంటి 'AI స్లాప్' కంటెంటే ఉంటున్నట్లు అధ్యయనం గుర్తించింది. దీనివల్ల కష్టపడి ఒరిజినల్ కంటెంట్ చేసే క్రియేటర్లకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ ఖర్చుతో, వేగంగా ఇలాంటి వీడియోలను తయారు చేసి అల్గారిథమ్‌లను ప్రభావితం చేయడం వల్ల డిజిటల్ సృజనాత్మకత భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి, 'బందర్ అప్నా దోస్త్' సక్సెస్ స్టోరీ AI పవర్‌ను చూపిస్తున్నప్పటికీ, కంటెంట్ నాణ్యత, రెగ్యులేషన్లపై పెద్ద చర్చకే తెరలేపింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More