ఐటీఆర్-1 ఫైల్ చేస్తున్నారా? మారిన ఐటీ నిబంధనలు ఇవే!
అసెస్మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించి ఐటీఆర్-1 (సహజ్) ఫారమ్లో ఆదాయపన్ను శాఖ పలు కీలక మార్పులు చేసింది. రెండు ఇళ్ల ఆదాయాన్ని చూపించే వెసులుబాటుతో పాటు విరాళాలు, అద్దె ఆదాయాలపై అదనపు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపన్ను రిటర్నులను (ITR) దాఖలు చేసే సమయం ఆసన్నమవుతున్న వేళ ఆదాయపన్ను శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అసెస్మెంట్ ఇయర్ (AY) 2026-27కు సంబంధించి ఐటీఆర్-1 (సహజ్) ఎక్సెల్ యూటిలిటీని సవరించింది. పాత సరళమైన ఫార్మాట్ను అలాగే ఉంచినప్పటికీ, పారదర్శకతను పెంచేందుకు కొన్ని విభాగాలలో మరిన్ని అదనపు వివరాలను (Disclosures) సేకరిస్తోంది. ఇళ్లు, అద్దె ఆదాయం, పన్ను మినహాయింపుల క్లెయిమ్లకు సంబంధించిన నిబంధనల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయడానికి ముందు తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన మార్పుల వివరాలు కింద చూడొచ్చు.

ఐటీఆర్-1 ఎవరెవరు ఫైల్ చేయవచ్చు?
ప్రముఖ పన్ను సలహా సంస్థ 'క్లియర్ టాక్స్' నివేదిక ప్రకారం.. నివాసిత వ్యక్తులై ఉండి (Resident Individuals) ఏడాదికి రూ.50 లక్షల వరకు మొత్తం ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-1 దాఖలు చేయవచ్చు. ఈ ఆదాయం జీతం లేదా పెన్షన్, గరిష్టంగా రెండు ఇళ్ల ఆస్తులు, బ్యాంకు వడ్డీ వంటి ఇతర మార్గాల ద్వారా వచ్చేది అయి ఉండాలి. అలాగే సెక్షన్ 112A కింద రూ.1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలు (LTCG) ఉన్నవారు కూడా కొన్ని నిబంధనలకు లోబడి దీనిని ఉపయోగించవచ్చు. వ్యాపార లేదా వృత్తిపరమైన ఆదాయం, విదేశీ ఆస్తులు కలిగి ఉన్నవారు, క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన మూలధన నష్టాలు ఉన్నవారు ఐటీఆర్-1కు అర్హులు కారు. వారు ఇతర ఫారమ్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
రెండు ఇళ్ల ఆదాయాన్ని చూపించే వెసులుబాటు
ఈ ఏడాది తీసుకొచ్చిన మార్పులలో ఇళ్ల ఆదాయానికి సంబంధించిన నిబంధన పెద్ద ఉపశమనం కలిగించేలా ఉంది. గతంలో ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉంటే కేవలం ఆ ఒక్క కారణంతోనే ఐటీఆర్-2 ఫారమ్ను ఎంచుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రెండు ఇళ్ల నుండి వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్-1 లోనే నేరుగా చూపించవచ్చు. దీనికోసం నూతన ఎక్సెల్ యూటిలిటీలో ప్రత్యేకంగా 'హౌస్ ప్రాపర్టీ' షెడ్యూల్ను ఏర్పాటు చేశారు.
అద్దె ఆదాయంపై మరింత నిఘా
ఇంటిని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందే వారు ఈసారి రిటర్నులలో అదనపు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. సదరు ఆస్తికి ఉమ్మడి యజమానులు (Co-owners) ఉన్నట్లయితే, వారి పేర్లు, పాన్ (PAN) లేదా ఆధార్ వివరాలు, వారి యాజమాన్య వాటా ఎంత అనే విషయాలను స్పష్టంగా పేర్కొనాలి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో అద్దెకు ఉంటున్న వారి (Tenant) వివరాలను కూడా సమర్పించేలా కొత్త కాలమ్స్ను చేర్చారు.
విరాళాల మినహాయింపులకు కఠిన నిబంధనలు
సెక్షన్ 80G కింద స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపులు కోరే వారు ఈసారి అప్రమత్తంగా ఉండాలి. గతంలో విరాళం పొందిన సంస్థ పేరు, పాన్ నంబర్, ఇచ్చిన మొత్తాన్ని నమోదు చేస్తే సరిపోయేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. ఎలక్ట్రానిక్ పద్ధతిలో నగదు బదిలీ చేసినట్లయితే దానికి సంబంధించిన లావాదేవీ రిఫరెన్స్ నంబర్ (Transaction Reference Number), సదరు సంస్థకు చెందిన బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ (IFSC) కోడ్ను కూడా ఫారమ్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
రాజకీయ చందాలపై అదనపు వివరాలు
సెక్షన్ 80GGC కింద రాజకీయ పార్టీలకు ఇచ్చే చందాలకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసే వారి కోసం నిబంధనలను మరింత విస్తరించారు. చందా పొందిన రాజకీయ పార్టీ పేరును పేర్కొనడంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) వివరాలను సంబంధిత షెడ్యూల్లో తప్పనిసరిగా పూరించాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు జరగకుండా, ఐటీ శాఖ నుండి నోటీసులు రాకుండా ఉండాలంటే ఇళ్లకు సంబంధించిన పత్రాలు, అద్దె రశీదులు, విరాళాల రశీదులను ముందే సిద్ధం చేసుకోవడం మంచిది. సమాచారం పూర్తిగా అందుబాటులో ఉంటే రిటర్నుల ప్రక్రియ సులభంగా ముగుస్తుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


