ఏఐ దెబ్బకు 4,000 మంది ఉద్యోగుల తొలగింపు: Block కంపెనీ సంచలన నిర్ణయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం ఉద్యోగ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ట్విట్టర్ (X) మాజీ సీఈవో జాక్ డోర్సీకి చెందిన ‘బ్లాక్’ (Block) సంస్థ ఏకంగా 4,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తర్వాత కంపెనీ షేర్లు అనూహ్యంగా 27% పెరిగాయి.
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం కొందరికి అవకాశాలను తెస్తుంటే, మరికొందరికి ఉపాధిని దూరం చేస్తోంది. ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం, స్క్వేర్ (Square), క్యాష్ యాప్ (Cash App) వంటి సంస్థల మాతృసంస్థ అయిన ‘బ్లాక్’ (Block Inc) తన సిబ్బందిలో దాదాపు సగం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది.
గురువారం వాటాదారులకు రాసిన లేఖలో కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఈ కఠిన నిర్ణయాన్ని వెల్లడించారు. మొత్తం 4,000 మందికి పైగా ఉద్యోగులను విధుల్లోంచి తొలగిస్తున్నామని, దీనికి ప్రధాన కారణం సంస్థలో పూర్తిస్థాయిలో ‘ఇంటెలిజెన్స్ టూల్స్’ (AI) ప్రవేశపెట్టడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ట్రేడింగ్లో కంపెనీ షేర్లు ఏకంగా 27 శాతం జంప్ చేయడం గమనార్హం.
ఏఐ వల్ల చిన్న టీమ్తోనే అద్భుతాలు చేయొచ్చు
సంస్థలో జరుగుతున్న ఈ మార్పుల గురించి జాక్ డోర్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు కంపెనీని నడిపే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. తక్కువ మంది ఉన్నప్పటికీ, ఈ ఏఐ టూల్స్ సాయంతో పనులను మరింత వేగంగా, నాణ్యంగా చేయవచ్చని మాకు అర్థమైంది" అని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఈ మార్పు విషయంలో తమ కంపెనీ ఇప్పటికే కొంత ఆలస్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. "రాబోయే ఏడాది కాలంలో మెజారిటీ కంపెనీలు ఇదే నిర్ణయానికి వస్తాయి. పరిస్థితులు మనల్ని ఒత్తిడి చేసే వరకు ఆగడం కంటే, మనమే ముందుగా మేల్కొని ఈ మార్పులకు సిద్ధమవ్వడం మంచిదని నేను భావిస్తున్నాను" అని డోర్సీ వివరించారు. ఈ క్రమంలోనే ‘గూస్’ (Goose) అనే సొంత ఏఐ టూల్ను కూడా బ్లాక్ సంస్థ అభివృద్ధి చేస్తోంది.
ఉద్వాసనకు గురైన వారికి భారీ ప్యాకేజీ
తొలగింపునకు గురైన ఉద్యోగులకు కంపెనీ అండగా ఉంటుందని డోర్సీ హామీ ఇచ్చారు. ఈ మేరకు వారికి అందజేసే ప్రయోజనాలను ఆయన ప్రకటించారు:
- జీతం: 20 వారాల పూర్తి జీతంతో పాటు, కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి ఒక వారం చొప్పున లెక్కించి అదనంగా చెల్లిస్తారు.
- ఆరోగ్య బీమా: 6 నెలల పాటు హెల్త్ కేర్ సౌకర్యం.
- ఆర్థిక సాయం: ఇతర ఖర్చుల కోసం సుమారు $5,000 (సుమారు ₹4 లక్షల పైచిలుకు) నగదు అందజేస్తారు. అయితే, అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగులకు అక్కడి స్థానిక నిబంధనల ప్రకారం ప్రయోజనాలు మారుతాయని ఆయన స్పష్టం చేశారు.
టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్
బ్లాక్ మాత్రమే కాదు.. అమెజాన్, సేల్స్ఫోర్స్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఏఐ వల్లే తాము ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతంలోనే ప్రకటించాయి. కేవలం ఉత్పాదకత పెంచుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యంగా టెక్ కంపెనీలు మానవ వనరుల కంటే కృత్రిమ మేధకే ప్రాధాన్యత ఇస్తుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


