Lunar Eclipse: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. టీమిండియా ప్రాక్టీస్ ఆలస్యంగా.. చెడు జరుగుతుందన్న భయంతో..
ఇంగ్లండ్తో జరగబోయే టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ సమరానికి ముందు టీమిండియా తన ట్రైనింగ్ షెడ్యూల్లో మార్పులు చేసింది. మంగళవారం (మార్చి 3) ఏర్పడిన చంద్రగ్రహణం (lunar eclipse) కారణంగా, ప్రాక్టీస్ సెషన్ను ఒక గంట ఆలస్యంగా ప్రారంభించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.
చంద్రగ్రహణం ఎఫెక్ట్ టీమిండియా ప్రాక్టీస్ సెషన్ పైనా పడింది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్తో జరగనున్న హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరుకు భారత జట్టు సన్నద్ధమవుతోంది. అయితే మంగళవారం (మార్చి 3) జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ సమయాన్ని టీమ్ మేనేజ్మెంట్ అనూహ్యంగా మార్చింది. దీనికి కారణం మరేదో కాదు.. చంద్రగ్రహణం (lunar eclipse) కావడం గమనార్హం.
lunar eclipse: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. టీమిండియా ప్రాక్టీస్ ఆలస్యంగా.. చెడు జరుగుతుందన్న భయంతో.. (PTI)
గ్రహణం వేళ అశుభమని భావించి..
నిజానికి మంగళవారం సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్ జరగాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం.. సాయంత్రం 6:47 గంటల వరకు కొనసాగింది. హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో శుభకార్యాలు లేదా ముఖ్యమైన పనులు చేయడం అరిష్టమని భావిస్తారు. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్కు ముందు ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదని కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
"సెమీఫైనల్ వంటి పెద్ద మ్యాచ్కు ముందు సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాలని జట్టు భావిస్తోంది. గ్రహణ సమయంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని భావించి, సెషన్ను ఒక గంట పాటు వాయిదా వేశాం" అని జట్టు వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6:40 గంటల తర్వాతే ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు.
దైవ దర్శనాల్లో టీమిండియా
ఈ ప్రపంచకప్ టోర్నీ పొడవునా భారత జట్టు సభ్యులు పలు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. సూపర్-8 మ్యాచ్కు ముందు గౌతమ్ గంభీర్ కోల్కతాలోని కాళీఘాట్ ఆలయాన్ని సందర్శించగా.. బుధవారం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయానికి వెళ్లేందుకు అతడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.
చరిత్ర సృష్టించే దిశగా భారత్
ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో భారత్ సరికొత్త చరిత్రకు చేరువలో ఉంది. ఒకవేళ భారత్ ఈసారి టైటిల్ గెలిస్తే.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు (డిఫెండింగ్ ఛాంపియన్గా) ట్రోఫీని గెలిచిన మొదటి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. అంతేకాకుండా సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ను ముద్దాడిన తొలి జట్టుగా కూడా భారత్ నిలుస్తుంది.
కోల్కతాలో జరిగిన సూపర్ 8 చివరి మ్యాచ్ లో సంజూ శాంసన్ (97 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత్ను సెమీస్కు చేర్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరగబోయే ఈ మూడో సెమీఫైనల్ పోరులో (గతంలో 2022, 2024లోనూ తలపడ్డారు) విజయం ఎవరిని వరిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022లో ఇంగ్లండ్, 2024లో టీమిండియా గెలిచాయి.