ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన తొలి సీఎంగా మమత
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సుప్రీం కోర్టులో గళమెత్తారు. అక్షర దోషాలు, మాండలిక భాషా భేదాల సాకుతో లక్షలాది మంది ఓటర్లను తొలగించే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక పదవిలో ఉన్న ముఖ్యమంత్రి స్వయంగా సుప్రీం కోర్టుకు వెళ్లి తన వాదనలు వినిపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) పేరుతో లక్షలాది మంది సామాన్యుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. "ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ప్రజల జీవితాలను కాపాడండి" అంటూ ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

ముఖ్యమంత్రి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పాంచోలిలతో కూడిన ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) నోటీసులు జారీ చేసింది. చిన్న చిన్న కారణాలతో జారీ చేసిన నోటీసులను ఎందుకు ఉపసంహరించుకోకూడదని ప్రశ్నించింది.
కోర్టులో మమత భావోద్వేగ వాదన
సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు ముగించిన తర్వాత, మమతా బెనర్జీ తన వాదనలు వినిపించారు. "నేను ఆ రాష్ట్రానికి చెందినదాన్ని. న్యాయం కోసం తలుపులు తడుతున్నా ఎక్కడా దక్కడం లేదనిపించింది. అందుకే నేనే నేరుగా వచ్చాను. నేను నా పార్టీ కోసం పోరాడటం లేదు, సామాన్య ఓటర్ల కోసం పోరాడుతున్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి" అని ఆమె విజ్ఞప్తి చేశారు.
కేవలం రెండు నెలల్లోనే ఈ సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని చూడటం వెనుక దురుద్దేశం ఉందని ఆమె ఆరోపించారు. సాధారణంగా ఏళ్ల సమయం పట్టే పనిని హడావుడిగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. "పెళ్లైన తర్వాత మహిళల ఇంటి పేర్లు మారుతాయి. పేదవారు ఇళ్లు మారుతుంటారు. కేవలం చిన్న స్పెల్లింగ్ తేడాలు ఉన్నాయని, మాండలికం వేరుగా ఉందని ఓట్లు ఎలా తొలగిస్తారు? బెంగాల్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?" అని ఆమె నిలదీశారు.
'వాట్సాప్ కమిషన్' అంటూ విమర్శలు
బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి మైక్రో అబ్జర్వర్లను తీసుకురావడాన్ని మమత తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సంఘం తీరును విమర్శిస్తూ అది 'వాట్సాప్ కమిషన్'లా మారిపోయిందని ఎద్దేవా చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, అవసరమైతే తగిన రక్షణ చర్యలు (Safeguards) చేపడతామని హామీ ఇచ్చింది.
సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ఓటర్ల తొలగింపు అంశంపై ధర్మాసనం సీరియస్ అయింది. ఏ ఒక్క అమాయక పౌరుడు ఓటు హక్కు కోల్పోకూడదని స్పష్టం చేసింది.
భాషా నిపుణుల కమిటీ: స్థానిక మాండలికాలు, పేర్ల ఉచ్చారణపై అవగాహన ఉన్న అధికారుల జాబితాను అందజేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వీరు ఎన్నికల సంఘానికి సహాయం చేస్తారు.
మెకానికల్ నోటీసులు వద్దు: యంత్రంలా పని చేయకుండా, విచక్షణతో వ్యవహరించాలని ఈసీకి సూచించింది. ప్రముఖ రచయితలు, కవులకు సైతం నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత జోయ్ గోస్వామి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కూడా ఈ అడ్డగోలు నోటీసుల అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించేందుకు ఎన్నికల సంఘం గడువు కోరగా, తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది.

E-Paper












