Fireworks Factory Blast : తమిళనాడులో విషాదం - టపాసుల తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 16 మంది మృతి..!

Fireworks Factory Blast in Tamilnadu : తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కట్టనార్‌పట్టిలోని ఓ టపాసుల తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడులో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Published on: Apr 19, 2026 6:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Fireworks Factory Blast in Tamilnadu : తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో శనివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కట్టనార్‌పట్టి గ్రామం వద్ద ఉన్న ఒక టపాసుల తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ధాటికి ఫ్యాక్టరీలోని షెడ్లు కుప్పకూలిపోగా…. అక్కడ పనిచేస్తున్న 16 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

విరుదునగర్‌లో భారీ పేలుడు
విరుదునగర్‌లో భారీ పేలుడు

సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక మరియు సహాయక సిబ్బంది ఘటనా స్థలం నుండి ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. ఫ్యాక్టరీ శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు.

సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి…

ఈ ఘోర ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు మంత్రులు కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్, తంగం తెన్నరసులను వెంటనే ఘటనా స్థలానికి పంపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని…. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని విరుదునగర్ జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

"ఇప్పటివరకు, సంఘటనా స్థలం నుండి 8 మృతదేహాలను వెలికితీశాం" అని అగ్నిమాపక, రెస్క్యూ శాఖ అధికారి ఒకరు ధృవీకరించారు, లోపల చిక్కుకున్న వ్యక్తులను రక్షించే ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.

విరుదునగర్ జిల్లాలో టపాసుల తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు వరుసగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండో భారీ ప్రమాదం. ఈ నెల 13న సాత్తూరు సమీపంలోని మదత్తుపట్టిలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో కూడా భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. బాణాసంచా తయారీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More