Electric cars : ఈ లగ్జరీ ఈవీలపై రూ.10 లక్షల తగ్గింపు! ఎంజీ సైబర్‌స్టర్, ఎంజీ ఎం9లో బీఏఏఎస్ స్కీమ్..

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తమ ప్రీమియం ఈవీలైన ఎంజీ సైబర్‌స్టర్, ఎంజీ ఎం9 మోడళ్లలో బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (బీఏఏఎస్) స్కీమ్​ని ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రారంభ కొనుగోలు ధర రూ. 10 లక్షల వరకు తగ్గుతుండగా, కారు వాడకాన్ని బట్టి కిలోమీటరుకు రూ. 8 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లించాలి. ఆ వివరాలు..

Published on: Sep 18, 2026, 06:45:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చైనాకు చెందిన ప్రముఖ బ్రిటీష్ ఆధారిత వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ భారతీయ లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు తీపి కబురు అందించింది. తమ పోర్ట్‌ఫోలియోలోని అత్యంత ఖరీదైన, అత్యుత్తమ మోడళ్లయిన ‘ఎంజీ సైబర్‌స్టర్’ స్పోర్ట్స్ రోడ్‌స్టర్, ‘ఎంజీ ఎం9’ లగ్జరీ ఎంపీవీలలో 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (బీఏఏఎస్) ఓనర్‌షిప్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..

ఎంజీ సైబర్‌స్టర్
ఎంజీ సైబర్‌స్టర్

రూ. 10 లక్షల దాకా ఆదా!

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనం మొత్తం ధరలో బ్యాటరీ వ్యయమే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ‘బీఏఏఎస్’ విధానం ద్వారా బ్యాటరీ కొనుగోలు ఖర్చును కారు అసలు ధర నుంచి మినహాయించారు. ఫలితంగా, కారు కొనుగోలు చేసే సమయంలో కస్టమర్లు చెల్లించాల్సిన ముందస్తు మొత్తం దాదాపు రూ.10 లక్షల వరకు ఆదా అవుతుంది. ఫలితంగా..

ఎంజీ సైబర్‌స్టర్: కొత్త బీఏఏఎస్ ధరల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ ప్రారంభ ధర రూ. 72.49 లక్షలుగా మారింది (గతంలో పూర్తి కారు ధర రూ. 82.50 లక్షలు).

ఎంజీ ఎం9 ఎంపీవీ: ఈ లగ్జరీ ఎంపీవీ ప్రారంభ ధర రూ. 69.99 లక్షలుగా నిలిచింది (గతంలో రూ. 79.94 లక్షలు).

ఈ రెండింటికీ.. కారు నడిపే ప్రతి కిలోమీటరుకు రూ. 8 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లిస్తే సరిపోతుంది.

ఈ సదుపాయం ఎంజీ సంస్థకు చెందిన ప్రీమియం డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ‘ఎంజీ సెలెక్ట్’ షోరూమ్‌ల ద్వారా కస్టమర్లకు లభిస్తుంది. ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 14 నగరాల్లో 15 ఎంజీ సెలెక్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను నిర్వహిస్తోంది.

గాలి వేగంతో దూసుకెళ్లే ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్..!

క్లాసిక్ ఎంజీబీ రోడ్‌స్టర్ శైలి నుంచి ప్రేరణ పొంది రూపొందించిన ఎంజీ సైబర్‌స్టర్ ఒక స్పోర్టీ కన్వర్టిబుల్ ఈవీ.

పర్ఫార్మెన్స్: ఇందులో 77 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ అమర్చారు. డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో ఇది 503.02 బీహెచ్‌పీ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్పీడ్ అండ్ రేంజ్: ఈ కారు కేవలం 3.2 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 580 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

ప్రత్యేకతలు: ఎలక్ట్రిక్ సిజర్ డోర్లు, కాక్‌పిట్ శైలి సీటింగ్, రోడ్‌స్టర్ బాడీ శైలి ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఎంజీ ఎం9 ఎంపీవీ: లగ్జరీ ఎక్స్​పీరియెన్స్..

కుటుంబంతో లేదా వీఐపీ ప్రయాణాల కోసం డిజైన్ చేసిన ఎంజీ ఎం9 ఒక అత్యాధునిక లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీ.

ఇంజిన్ అండ్ ఛార్జింగ్: ఇందులో పెద్దదైన 90 kWh ఎన్ఎమ్‌సీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది 241.65 బీహెచ్‌పీ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 548 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే 30 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు.

లగ్జరీ ఫీచర్లు: 12.3 ఇంచుల డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, పనోరమిక్ సన్‌రూఫ్, 13-స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్, 64 కలర్ ఆంబియంట్ లైటింగ్ ఇందులో ఉన్నాయి. వెనుక ప్రయాణికుల కోసం 16-వే అడ్జస్ట్‌మెంట్, 8 మసాజ్ మోడ్స్, హీటింగ్, వెంటిలేషన్ సౌకర్యాలు ఉన్న ‘ప్రెసిడెన్షియల్ సీట్లు’ ఏర్పాటు చేశారు.

భారతీయ లగ్జరీ ఈవీ మార్కెట్లో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు ఎంజీ మోటార్స్ వేస్తున్న వ్యూహాత్మక అడుగుల్లో బీఏఏఎస్ విధానం ఒకటి. ప్రారంభ ధరను గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రీమియం కొనుగోలుదారులను ఈ పథకం విశేషంగా అకట్టుకునే అవకాశం ఉందని ఆటోమొబైల్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More