5 నెలల గర్భంతో దివ్యాంగురాలు.. 16 మందికి డీఎన్‌ఏ పరీక్ష, తండ్రే కీచకుడు

మానసిక స్థితి సరిలేని యువతిని గర్భవతిని చేసిన కేసులో ముంబై పోలీసులు సంచలన విషయాన్ని ఛేదించారు. 16 మంది అనుమానితులకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించగా, స్వయానా తండ్రే ఆ పాపానికి ఒడిగట్టినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Published on: Feb 5, 2026, 12:55:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, మానసిక వైకల్యంతో ఉన్న తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ దారుణమైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, శాస్త్రీయ ఆధారాలతో పోలీసులు నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

రేప్ సంఘటనలపై విద్యార్థినుల నిరసన (ప్రతీకాత్మక చిత్రం) (PTI)
రేప్ సంఘటనలపై విద్యార్థినుల నిరసన (ప్రతీకాత్మక చిత్రం) (PTI)

అసలేం జరిగింది?

అక్టోబర్ 2025లో దక్షిణ ముంబైలోని కామా అండ్ ఆల్ బ్లెస్ ఆసుపత్రి నుంచి పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తీవ్రమైన కడుపునొప్పితో అడ్మిట్ అయిన 20 ఏళ్ల మానసిక వికలాంగురాలు 5 నెలల గర్భవతి అని వైద్యులు సమాచారం అందించారు. బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉండటంతో, ఆమెపై ఎవరో ఒకరు కాదు, పలువురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

డిఎన్ఏ పరీక్షతో వీడిన మిస్టరీ

కేసును సవాలుగా తీసుకున్న అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశ్విని పాటిల్ బృందం లోతైన దర్యాప్తు చేపట్టింది. బాధితురాలు చూపించిన ఫొటోల ఆధారంగా తొలుత 16 ఏళ్ల బాలుడిని, 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, గర్భానికి కారకులు ఎవరనేది తేల్చడానికి పోలీసులు శాస్త్రీయ పద్ధతిని ఎంచుకున్నారు.

బాధితురాలికి గర్భస్రావం చేయించి, పిండం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆమె చుట్టుపక్కల ఉండేవారు, బంధువులతో పాటు మొత్తం 16 మంది అనుమానితుల డిఎన్ఏ శాంపిల్స్‌ను సేకరించారు.

జనవరి 27న కలీనా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో, పిండం డిఎన్ఏ.. బాధితురాలి తండ్రి డిఎన్ఏతో సరిపోలింది.

భయంతోనే తండ్రి పేరు చెప్పలేదు

బాధితురాలు మాటలు లేని స్థితిలో ఉన్నప్పటికీ, నిపుణుల సహాయంతో ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 'విధాయక్ భారతి' అనే ఎన్జీవో సహకారంతో వివిధ రకాల థెరపీలను ఉపయోగించి పోలీసులు ఆమెతో మాట్లాడించగలిగారు. ఆ సమయంలో తన తండ్రి కూడా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అయితే ఆయన అరెస్ట్ అవుతారనే భయంతోనో లేదా నిందితులు బెదిరించడం వల్లో ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టినట్లు అర్థమైంది.

"బాధితురాలు తీవ్రమైన భయాందోళనల్లో ఉంది. ఎవరికీ ఏమీ చెప్పవద్దని నిందితులు ఆమెను హెచ్చరించినట్లు మాకు తెలిసింది. ఫోరెన్సిక్ రిపోర్టులు తండ్రి ప్రమేయాన్ని ఖచ్చితంగా నిర్ధారించడంతో మంగళవారం అతడిని అరెస్ట్ చేశాం" అని పోలీస్ అధికారి తెలిపారు.

ప్రస్తుతం తండ్రితో పాటు అంతకుముందు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై కూడా చార్జిషీట్ దాఖలు చేసే ప్రక్రియలో పోలీసులు ఉన్నారు. రక్షణగా ఉండాల్సిన తండ్రే రాక్షసుడిలా మారిన ఈ ఘటన ముంబైలో కలకలం రేపుతోంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More