Toyota Fortuner : లగ్జరీ ఇంటీరియర్, హైటెక్ ఫీచర్స్తో కొత్త టయోటా ఫార్చ్యూనర్- లాంచ్ ఎప్పుడంటే..
Toyota Fortuner price : టయోటా నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఫుల్-సైజ్ ఎస్యూవీ 'ఫార్చ్యూనర్' సరికొత్త అవతారంలో ముస్తాబవుతోంది. మరింత పవర్ఫుల్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో రానున్న ఈ నెక్ట్స్ జనరేషన్ మోడల్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఇక్కడ చూసేయండి..
ఎస్యూవీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'నెక్ట్స్ జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్'పై లేటెస్ట్ బజ్ మంచి కిక్ ఇస్తోంది! ఈ బడా ఎస్యూవీ ప్రపంచవ్యాప్తంగా 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఈ కొత్త మోడల్కు సంబంధించిన ప్రోటోటైప్స్ టెస్టింగ్ నిర్వహిస్తుండటం గమనార్హం.

ప్రస్తుతం ఉన్న వెర్షన్తో పోలిస్తే, రాబోయే ఫార్చ్యూనర్లో స్టైలింగ్, టెక్నాలజీ, మెకానికల్ పరంగా భారీ మార్పులు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త టయోటా ఫార్చ్యూనర్పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
కొత్త టయోటా ఫార్చ్యూనర్- న్యూ ప్లాట్ఫామ్.. మెరుగైన పర్ఫార్మెన్స్..
ఈ కొత్త జనరేషన్ ఫార్చ్యూనర్లో జరగబోయే అతిపెద్ద మార్పు దాని బాడీ కింద ఉండబోతోంది! ఇది టీఎన్జీఏ-ఎఫ్ లాడర్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్పై రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదే ప్లాట్ఫామ్ను లేటెస్ట్ జనరేషన్ టయోటా హైలక్స్లో కూడా వాడుతున్నారు. ఈ ప్లాట్ఫామ్ వల్ల కారు నిర్మాణం మరింత బలంగా ఉండటమే కాకుండా, ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. ఫార్చ్యూనర్కు పేరు తెచ్చిన 'ఆఫ్-రోడ్' సామర్థ్యం, మన్నిక ఇందులో మరింత మెరుగుపడనున్నాయి.
డిజైన్లో భారీ మార్పులు..
ఇటీవల బయటపడ్డ స్పై ఫోటోల ఆధారంగా రూపొందించిన డిజిటల్ రెండరింగ్స్ ప్రకారం.. కొత్త ఫార్చ్యూనర్ లుక్ మరింత అగ్రెసివ్గా ఉండబోతోంది.
ముందు భాగం: కొత్త స్టైల్ గ్రిల్, దానిపై క్రోమ్ ఇన్సర్ట్స్, భారీ 'టయోటా' బ్రాండింగ్ ఉండవచ్చు. షార్ప్ డే-టైమ్ రన్నింగ్ లైట్లతో (డీఆర్ఎల్స్) కూడిన స్లిమ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్ దీనికి కొత్త కళను ఇస్తాయి.
వెనుక భాగం: వెనుక వైపు టెయిల్ ల్యాంప్స్ను కలుపుతూ ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైటింగ్ ఎలిమెంట్ వచ్చే అవకాశం ఉంది. మధ్యలో పెద్ద అక్షరాలతో 'FORTUNER' అని రాసి ఉంటుంది.
ఇతర ఫీచర్లు: ఈ బడా ఎస్యూవీలో పెద్ద సైజ్ అలాయ్ వీల్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ అవుట్లెట్స్ వంటివి ఈ ఎస్యూవీకి ప్రీమియం లుక్ను ఇస్తాయి.
కొత్త టయోటా ఫార్చ్యూనర్- లగ్జరీ ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు..
కారు లోపలి భాగంలో కూడా టయోటా భారీ మార్పులు చేస్తోంది. డ్యాష్బోర్డ్పై రెండు 12.3 ఇంచ్ డిజిటల్ డిస్ప్లేలు ఉండవచ్చు. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం, మరొకటి పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్గా పనిచేస్తుంది.
కొత్తగా రాబోతున్న ఫీచర్లు ఇవే:
లెవల్ 2 అడాస్: డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ భద్రతను పెంచుతాయి.
360-డిగ్రీ కెమెరా: పార్కింగ్, ఇరుకైన రోడ్లపై డ్రైవింగ్ సులభతరం చేస్తుంది.
పనోరమిక్ సన్రూఫ్: వినియోగదారుల చిరకాల కోరిక తీరుస్తూ ఈసారి సన్రూఫ్ వచ్చే ఛాన్స్ ఉంది.
కనెక్టెడ్ టెక్నాలజీ: ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) సాఫ్ట్వేర్ అప్డేట్స్, వెహికల్ కనెక్టివిటీ ఫీచర్లు.
భారతదేశంలో 2009లో అడుగుపెట్టిన ఫార్చ్యూనర్, అప్పటి నుంచి ఎస్యూవీ విభాగంలో తిరుగులేని రారాజుగా కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే, భారత్లో కూడా ఈ కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. కొత్త జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్ ఇండియాలోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?
ప్రస్తుత సమాచారం ప్రకారం, నెక్ట్స్ జనరేషన్ ఫార్చ్యూనర్ ప్రపంచవ్యాప్తంగా 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో లాంచ్ కానుంది. భారత్లో ఈ మోడల్కు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, గ్లోబల్ లాంచ్ జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే ఇది మన దేశంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
2. రాబోయే ఫార్చ్యూనర్లో 'పనోరమిక్ సన్రూఫ్' ఫీచర్ ఉంటుందా?
అవును, కొత్త జనరేషన్ ఫార్చ్యూనర్లో పనోరమిక్ సన్రూఫ్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మోడల్లో సన్రూఫ్ లేకపోవడం ఒక పెద్ద లోటుగా చాలా మంది భావిస్తున్నారు. పోటీలో ఉన్న ఇతర ఎస్యూవీలు (ఉదాహరణకు ఎంజీ గ్లోస్టర్) అత్యాధునిక ఫీచర్లతో వస్తుండటంతో, టయోటా తన కొత్త మోడల్లో సన్రూఫ్, లెవల్-2 అడాస్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లను ఖచ్చితంగా చేర్చబోతున్నట్లు సమాచారం.
3. కొత్త ఫార్చ్యూనర్ ప్రస్తుతం ఉన్న దాని కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందా?
కొత్త ఫార్చ్యూనర్లో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్తో కలిపి పనిచేయడం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్లో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ వల్ల మైలేజీ పెరగడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. అయితే, ఇది పూర్తిస్థాయి హైబ్రిడ్ కాదా అనేది కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












