New Toll Pass : ఎన్హెచ్ఏఐ కొత్త టోల్ పాస్- ఫాస్టాగ్తో లింక్, వారికి బెనిఫిట్..
ఎన్హెచ్ఏఐ తన డిజిటల్ లోకల్ పాస్ సేవలను దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాలకు విస్తరించింది. రాజ్మార్గ్యాత్ర యాప్ ద్వారా సమీప నివాసితులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నెలవారీ పాస్ను పొందవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రయాణికులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ 'లోకల్ పాస్' సేవలను దేశవ్యాప్తంగా ఉన్న 121 టోల్ ప్లాజాలకు విస్తరించినట్లు ప్రకటించింది.

అర్హత ఉన్న స్థానిక నివాసితులు ఇకపై రాజ్మార్గ్యాత్ర యాప్ ద్వారా నెలవారీ పాస్ను సులభంగా పొందవచ్చు. ఈ పాస్ ఉన్నవారు నిర్ణీత రుసుముతో తమకు కేటాయించిన టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా అపరిమిత రాకపోకలు సాగించవచ్చు.
డిజిటల్ లోకల్ పాస్ ఎవరికి వర్తిస్తుంది?
టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానికులు ఈ డిజిటల్ లోకల్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ సేవ కేవలం నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అడ్రస్ వివరాల ధృవీకరణ కోసం డిజిలాకర్, వాహన వివరాల కోసం వాహన్ డేటాబేస్, ఫాస్టాగ్ ఆధారాలను ఉపయోగించి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. గతంలో మాదిరిగా టోల్ ప్లాజాల చుట్టూ తిరుగుతూ ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. రాజ్మార్గ్యాత్ర యాప్ ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
నాన్-కమర్షియల్ వాహనాలకు రూ. 350 నెలవారీ రుసుము!
జాతీయ రహదారి వినియోగదారుల రుసుము నిబంధనల ప్రకారం.. నాన్-కమర్షియల్ వాహనాలను వాడే స్థానికుల కోసం నెలవారీ లోకల్ పాస్ ధరను రూ. 350గా నిర్ణయించారు. టోల్ గేట్ వద్ద ఈ పాస్ చూపించడం ద్వారా అర్హులైన ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లవచ్చు.
అడ్డంకులు లేని టోలింగ్ వైపు అడుగులు..
ఈ డిజిటల్ లోకల్ పాస్ విధానం దేశంలో మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఎఫ్) వైపు సాగుతున్న ప్రయాణంలో భాగమని అధికారులు తెలిపారు. ఈ బ్యారియర్ లెస్ టోలింగ్ సిస్టమ్ వల్ల వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. 2026 జులైలో దిల్లీలోని ముండ్కా-బక్కర్వాలా టోల్ ప్లాజా వద్ద తొలిసారిగా ప్రారంభించిన ఈ విధానం, ప్రస్తుతం చోరియాసి, ముండ్కా, దౌలత్పుర, ఘరౌండా, మనోహర్పూర్, షాజహాన్పూర్ అనే ఆరు ప్రాంతాలలో విజయవంతంగా అమలవుతోంది.
టోల్ బూత్ల వద్ద మనుషుల ప్రమేయం లేకపోవడం వల్ల అనధికారిక మినహాయింపులు నిలిచిపోయాయి! దీనివల్ల 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే చాలా మంది స్థానికులకు టోల్ కట్టలేదంటూ ఈ-నోటీసులు వచ్చాయి. ఈ సమస్యకు పరిష్కారంగానే డిజిటల్ పాస్ను ఫాస్టాగ్తో అనుసంధానించారు. జరిమానాలు పడకుండా ఉండాలంటే స్థానికులు ఈ పాస్ తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ పాస్ తీసుకోకపోతే రెట్టింపు టోల్ రుసుము చెల్లించాల్సి రావొచ్చని హెచ్చరించారు.
రాజ్మార్గ్యాత్ర యాప్లో కొత్త టోల్ ప్లాజాల జాబితా..
డిజిటల్ లోకల్ పాస్ సేవలను అందిస్తున్న టోల్ ప్లాజాల అప్డేటెడ్ జాబితా ప్రస్తుతం రాజ్మార్గ్యాత్ర యాప్లో అందుబాటులో ఉంది. హరియాణాలోని బర్తానా, ఉత్తరప్రదేశ్లోని భారత్కుండ్, ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణపల్లి, తమిళనాడులోని బూతకుడి, మధ్యప్రదేశ్లోని చిఖాలికల, బిహార్లోని దేవ్కులి వంటి కొత్త ప్రాంతాలు ఈ జాబితాలో చేరాయి. దీని ద్వారా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ సేవలు మరింత విస్తరించాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


