ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏ దేశం నుంచి కూడా మేం సాయం తీసుకోలేదు : పాక్ ఆర్మీ చీఫ్
ఆపరేషన్ సిందూర్ సమయంలో మేం ఏ దేశం నుండి సహాయం తీసుకోలేదని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చెప్పారు. పాకిస్థాన్ భారతదేశంతో ఒంటరిగా పోరాడిందని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా, టర్కీ పాకిస్థాన్కు సహాయం చేశాయని వార్తలు వచ్చాయి. దీనిపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు. చైనా, టర్కీ నుండి తమకు ఎటువంటి సహాయం రాలేదని వివరించడానికి ప్రయత్నించాడు. తాము ఏ దేశం నుంచి సాయం తీసుకోలేదని చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్కు చురుకుగా మద్దతు ఇచ్చిందని, లైవ్ ల్యాబ్ లాగా దాని ఆయుధాలను పరీక్షిస్తోందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ చెప్పారు. తర్వాత అసిమ్ మునీర్ ఈ ప్రకటన చేశారు. పాకిస్థాన్కు మద్దతు ఇవ్వడంలో టర్కీ కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని భారత సైనిక అధికారి తెలిపారు .
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. 'పాకిస్థాన్కు ఏదైనా బయటి దేశం నుండి మద్దతు లభించిందనే భారతదేశం వాదన పూర్తిగా తప్పు. పాకిస్థాన్ సైనిక బలం దాని స్వంత కృషి, వ్యూహాత్మక సామర్థ్యంతో ఉంది . పాకిస్థాన్ చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తోంది.' అని అన్నారు.
అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏదైనా రెచ్చగొట్టే చర్యతో ప్రతిస్పందిస్తామని మరోసారి బెదిరింపు జారీ చేశారు. 'మన సైనిక స్థావరాలు, ఆర్థిక కేంద్రాలు, ఓడరేవులను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరిగితే వెంటనే స్పందిస్తాం.' అని అన్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ మే 7న ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం పాకిస్థాన్, పాక్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది . దీనితో ఆగ్రహించిన పాకిస్థాన్ సైన్యం భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు విఫల ప్రయత్నం చేసింది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ యుద్ధం తర్వాత మే 10న భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు.













