Rohit Sharma: ఇదేందయ్యా ఇది.. పాకిస్థాన్ టెస్టు టీమ్ కెప్టెన్ గా రోహిత్ శర్మ.. జట్టులో భారత ఆటగాళ్లు.. ఫ్యాన్స్ కౌంటర్లు
Rohit Sharma: పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో బ్రాడ్ కాస్టర్లు చేసిన ఒక తప్పిదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పాక్ ఆటగాళ్లకు బదులుగా టీమిండియా ప్లేయర్ల పేర్లను గ్రాఫిక్స్లో ప్రదర్శించడంతో ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు.
Rohit Sharma: పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో బ్రాడ్కాస్టర్లు ఊహించని పొరపాటు చేశారు. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సమయంలో పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్ ను చూపించబోయి.. ఏకంగా టీమిండియా ఆటగాళ్ల పేర్లను ఆ స్థానంలో పెట్టేశారు. రోహిత్ ను కెప్టెన్ చేసేశారు. ఈ విచిత్రమైన తప్పిదం చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోవడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా పాక్ క్రికెట్ బోర్డుపై, బ్రాడ్కాస్టర్లపై జోకులు పేలుస్తున్నారు.

గ్రాఫిక్స్లో టీమిండియా స్టార్లే..
మ్యాచ్ సాగుతున్న సమయంలో స్క్రీన్పై పాక్ జట్టు గ్రాఫిక్ కనిపించింది. అందులో ఉండాల్సింది షాన్ మసూద్ సేన.. కానీ అక్కడ ప్రత్యక్షమైనవి మాత్రం రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్ పేర్లు. పాకిస్థాన్ మైదానంలో ఆడుతుంటే, టీవీలో మాత్రం ఇండియన్ ఆటగాళ్ల పేర్లు దర్శనమివ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
ఫ్యాన్స్ కౌంటర్లు
ఈ ఘోర తప్పిదంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వ్యూయర్షిప్ (TRP) కోసం బ్రాడ్ కాస్టర్లు కావాలనే ఇలా చేశారని కొందరు విమర్శిస్తుంటే.. "పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ ఇప్పుడు ఫోటోషాప్లో ఓవర్టైమ్ పనిచేస్తోంది" అని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. "గ్రాఫిక్స్ టీమ్కు కూడా తెలుసు.. అసలైన టీఆర్పీ ఎవరు తెస్తారో!" అని ఒక అభిమాని చమత్కరించగా, "ఇక్కడ కూడా కోహ్లీని తప్పించి రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉంచారుగా" అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.
బరిలో లేని బాబర్ ఆజం
సుమారు ఆరు నెలల విరామం తర్వాత రెండు జట్లు టెస్టు బరిలోకి దిగాయి. పాకిస్థాన్ గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్పైనే దృష్టి పెట్టిన తరుణంలో ఈ టెస్ట్ మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే మోకాలి గాయం కారణంగా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఈ మ్యాచ్కు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ.
బంగ్లా జోరు
మరోవైపు బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేస్తోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 413 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 130 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేసి అదరగొట్టాడు. మోమినుల్ హక్ (91), ముష్ఫికర్ రహీమ్ (71) కీలక ఇన్నింగ్స్లు ఆడటంతో బంగ్లాదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది.
పాక్ కెప్టెన్ షాన్ మసూద్ కామెంట్లు
టాస్ గెలిచిన అనంతరం షాన్ మసూద్ మాట్లాడుతూ.. "మేము ఆశించిన విధంగానే పరిస్థితులు ఉన్నాయి. అందుకే జట్టులో అన్ని ఆప్షన్లు ఉండేలా పటిష్టమైన స్క్వాడ్ను ఎంచుకున్నాం. మొదటి రెండు ఇన్నింగ్స్ పూర్తయ్యాక మ్యాచ్ ఏ దిశగా వెళ్తుందో ఒక స్పష్టత వస్తుంది. రెండో టెస్టుకు ఈ మొమెంటం చాలా కీలకం.
దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన అజాన్ అవైస్ను ఓపెనర్గా బరిలోకి దించుతున్నాం. అలాగే అబ్దుల్లా ఫజల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. దురదృష్టవశాత్తు బాబర్ ఆజం చివరి నిమిషంలో దూరం కావడం మాకు లోటే" అని పేర్కొన్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో అసలేం జరిగింది?
పాకిస్థాన్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ చూపే గ్రాఫిక్స్లో బ్రాడ్కాస్టర్లు పొరపాటున టీమిండియా ఆటగాళ్ల పేర్లను ప్రదర్శించారు.
2. ఈ మ్యాచ్లో బాబర్ ఆజం ఎందుకు ఆడటం లేదు?
మోకాలి గాయం కారణంగా బాబర్ ఆజం ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు.
3. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ స్కోరు ఎంత?
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 117.1 ఓవర్లలో 413 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో సెంచరీతో రాణించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


