10 నిమిషాల డెలివరీకి ఇక 'బ్రేక్'? కేంద్రం సీరియస్.. దిగొచ్చిన క్విక్ కామర్స్ దిగ్గజాలు
గిగ్ వర్కర్ల భద్రత, పని పరిస్థితుల మెరుగుదల లక్ష్యంగా 10 నిమిషాల డెలివరీ నిబంధనను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం క్విక్ కామర్స్ సంస్థలను ఆదేశించింది. ఇప్పటికే బ్లింకిట్ తన బ్రాండింగ్ నుంచి ఈ వాగ్దానాన్ని తొలగించగా, జెప్టో, స్విగ్గీ కూడా అదే బాటలో పయనించనున్నాయి.
భారతదేశంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న '10-నిమిషాల డెలివరీ' సంస్కృతిలో త్వరలో పెను మార్పులు రాబోతున్నాయి. వినియోగదారులకు క్షణాల్లో సరుకులు అందించే క్విక్ కామర్స్ సంస్థలైన బ్లింకిట్, జెప్టో, జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలు తమ డెలివరీ వ్యూహాన్ని మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా సూచించింది. ముఖ్యంగా డెలివరీ భాగస్వాముల (గిగ్ వర్కర్ల) భద్రత, వారి సంక్షేమమే ప్రధాన అజెండాగా కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ఆదేశం ఏంటి?
ఇటీవల క్విక్ కామర్స్ రంగ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా.. డెలివరీ సమయం విషయంలో కంపెనీలు విధిస్తున్న నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేయాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇది వారి భద్రతకు ముప్పుగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే, డెలివరీ సమయంపై ఉన్న కఠినమైన గడువులను తొలగించాలని ఆయన కంపెనీలను ఆదేశించినట్లు సమాచారం.
ముందే స్పందించిన బ్లింకిట్
ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ 'బ్లింకిట్' (Blinkit) తన బ్రాండింగ్లో ఇప్పటికే కీలక మార్పులు చేసింది. గతంలో ఈ కంపెనీ ట్యాగ్లైన్ "10,000 కు పైగా ఉత్పత్తులు 10 నిమిషాల్లో మీ ఇంటి వద్దకు" అని ఉండేది. అయితే తాజాగా దీనిని "30,000 కు పైగా ఉత్పత్తులు మీ ముంగిటకే" అని మారుస్తూ, ఆ 10 నిమిషాల గడువును తొలగించింది. మరికొద్ది రోజుల్లోనే మిగిలిన యాప్స్ కూడా ఇదే తరహా మార్పులు చేయబోతున్నాయని తెలుస్తోంది.
గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం
దాదాపు రెండు వారాల క్రితం 'గిగ్ అండ్ ప్లాట్ఫారమ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్' (GIPSWU) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. డెలివరీ బాయ్స్, ఆన్లైన్ ఫ్రీలాన్సర్ల గౌరవం, వారి సంక్షేమం కోసం హక్కులను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమ్మె అనుకున్న స్థాయిలో సఫలం కాకపోయినప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించింది. గిగ్ వర్కర్లకు భద్రత, సరైన పని వాతావరణం కల్పించడమే తమ ప్రాధాన్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వినియోగదారులపై ప్రభావం ఎంత?
ఒక్క నిమిషం ఆలస్యమైతే ఆందోళన చెందే నేటి కాలంలో, 10 నిమిషాల డెలివరీ ఆగిపోవడం అనేది వినియోగదారులకు కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు. అయితే, డెలివరీ భాగస్వాముల ప్రాణాలకు విలువ ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. క్విక్ కామర్స్ రంగం ఇకపై 'వేగం' కంటే 'విశ్వసనీయత, భద్రత'కే ప్రాధాన్యత ఇవ్వనుంది.

E-Paper












