మహిళా బిల్లు ఒక పెద్ద మోసం: లోక్‌సభలో రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. "ప్రస్తుతం దేశంలో రాజ్యాంగంపై మనువాదం పెత్తనం చెలాయిస్తోంది" అంటూ వ్యాఖ్యానించారు.

Published on: Apr 17, 2026, 15:49:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ బిల్లు ఉద్దేశం, దాని వెనుక ఉన్న వ్యూహాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది మహిళలకు మేలు చేసే బిల్లు కాదని, అసలు మహిళా సాధికారతకు దీనికి సంబంధమే లేదని ఆయన తేల్చి చెప్పారు. "మహిళలను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోంది. ఇది దేశ వ్యతిరేక చర్య (Anti-national act). విపక్షాలన్నీ ఏకమై ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటాయి," అని రాహుల్ స్పష్టం చేశారు. బిజెపి తన బలం తగ్గిపోతుందనే భయంతోనే, దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేందుకు (Rejig political map) ఈ డీలిమిటేషన్ ప్రక్రియను తెరపైకి తెచ్చిందని ఆయన విమర్శించారు.

బిల్లుపై లోక్‌సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ (PTI)
బిల్లుపై లోక్‌సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ (PTI)

ఓబీసీలకు అన్యాయం.. దక్షిణాది రాష్ట్రాలకు శాపం

ఈ బిల్లు వెనుక ఉన్న అసలు అజెండా ఓబీసీ (OBC) సోదర సోదరీమణులకు అధికారం దక్కకుండా చేయడమేనని రాహుల్ ఆరోపించారు. కుల గణన (Caste Census) జరగకుండా అడ్డుకోవడమే కాకుండా, రాబోయే 15 ఏళ్ల వరకు వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా చేయాలని కేంద్రం చూస్తోందన్నారు.

అంతేకాకుండా, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పేరుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. "దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాలరాయాలని చూస్తే మేం చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధితో ఉంటే, 2023లో ప్రవేశపెట్టిన పాత బిల్లును వెంటనే తీసుకురావాలి. దానికి మేం ఇప్పుడే మద్దతు ఇస్తాం. ఎటువంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయండి" అని ఆయన డిమాండ్ చేశారు.

ఇందిరా గాంధీ నేర్పిన పాఠం: 'చీకటిలో ఉండే నిజం'

తన ప్రసంగంలో రాహుల్ గాంధీ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ సభను ఉద్వేగానికి గురిచేశారు. తన నాయనమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తనకు నేర్పిన ఒక శక్తివంతమైన పాఠాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. "చిన్నప్పుడు నాకు చీకటి అంటే చాలా భయం ఉండేది. ఒకరోజు మా నాన్నమ్మ అది గమనించి నా చేయి పట్టుకుని చీకటిగా ఉన్న తోటలోకి తీసుకెళ్లారు. నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి, వెనక్కి రాకుండా అక్కడే ఉండమన్నారు. అప్పుడు నా భయం వర్ణనాతీతం" అని ఆయన వివరించారు.

కొద్దిసేపటి తర్వాత ఆమె తిరిగి వచ్చి, "రాహుల్.. నువ్వు చీకటికో, అక్కడ ఉండే పాములకో, గబ్బిలాలకో భయపడటం లేదు.. నీ మనసులో ఉండే ఊహలకు భయపడుతున్నావు. నిజం ఎప్పుడూ చీకటిలోనే ఉంటుంది. భయాన్ని ఎదుర్కొని ఆ చీకటిలోకి వెళ్లే ధైర్యం నీకు లేకపోతే, నువ్వు నిజాన్ని తెలుసుకోలేవు" అని చెప్పినట్లు రాహుల్ పేర్కొన్నారు. ఈ పాఠం తన జీవితంలో 'సత్యం శివం సుందరం' అనే తత్వాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడిందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More