RCB Fans: ఆ 11 మంది చనిపోయిన వాళ్ల కోసం 11 సీట్లు కేటాయించనున్న ఆర్సీబీ.. అన్ని మ్యాచ్‌లకూ ఆ సీట్లు ఖాళీగానే..

RCB Fans: ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది తమ విక్టరీ సెలబ్రేషన్స్ లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది కోసం 11 సీట్లను శాశ్వతంగా కేటాయించాలని నిర్ణయించింది.

Published on: Mar 24, 2026, 15:59:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గతేడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే టైమ్‌లో ఎం చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన విషాదం తర్వాత ఆ స్టేడియంలో ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్‌కు మ్యాచ్‌లను తీసుకురావడానికి మేనేజ్‌మెంట్ చాలా కష్టపడాల్సి వచ్చింది.

RCB Fans: ఆ 11 మంది చనిపోయిన వాళ్ల కోసం 11 సీట్లు కేటాయించనున్న ఆర్సీబీ.. అన్ని మ్యాచ్‌లకూ ఆ సీట్లు ఖాళీగానే.. (ANI)
RCB Fans: ఆ 11 మంది చనిపోయిన వాళ్ల కోసం 11 సీట్లు కేటాయించనున్న ఆర్సీబీ.. అన్ని మ్యాచ్‌లకూ ఆ సీట్లు ఖాళీగానే.. (ANI)

మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే ఫస్ట్ మ్యాచ్‌కు ముందు, ఆ తొక్కిసలాటలో చనిపోయిన ఫ్యాన్స్‌కు ఘనంగా నివాళి అర్పించబోతున్నట్లు మంగళవారం (మార్చి 24) ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది.

ఆ 11 మందిని ఎప్పటికీ గుర్తుంచుకునేలా..

ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్, అలాగే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బాబాట్ ఈ మేరకు కొన్ని ఎమోషనల్ విషయాలు పంచుకున్నారు. జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ఆ 11 మందికి గుర్తుగా.. ఇకపై చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ 11 సీట్లను ఎప్పటికీ ఖాళీగా ఉంచాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది.

వాళ్లకు అదొక సైలెంట్ ట్రిబ్యూట్ అని చెప్పారు. అలాగే ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్రాక్టీస్ సెషన్స్ జరిగేటప్పుడు ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కేవలం 11వ నంబర్ జెర్సీనే వేసుకుంటారు. స్టేడియం లోపలి ఎంట్రన్స్ దగ్గర వాళ్ల జ్ఞాపకార్థం ఒక స్మారక ఫలకాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు.

మంగళవారం (మార్చి 24) మీడియాతో మాట్లాడిన సీఈఓ రాజేష్ మీనన్.. ఈ నిర్ణయాలు మా ఆర్సీబీ ప్రయాణంలో ఎప్పటికీ మాతో పాటే ఉండే మా ఫ్యాన్స్‌కు మేమిచ్చే చిన్న నివాళి అని చెప్పాడు.

"ఈ మ్యాచ్‌లు మళ్లీ ఇక్కడే జరగడానికి సహకరించిన ప్రభుత్వానికి థ్యాంక్స్. జూన్ 4 తర్వాత పరిస్థితులను చక్కదిద్దడానికి మేం యుద్ధ ప్రాతిపదికన పనిచేశాం. కోర్టు చెప్పిన రూల్స్ అన్నీ పక్కాగా ఫాలో అవుతూ అన్ని ప్రొటోకాల్స్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకున్నాం" అని ఆయన అన్నాడు.

జనాలను కంట్రోల్ చేయడానికి ఏఐ టెక్నాలజీ..

ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కంటే ముందే.. మళ్లీ గత ఏడాది లాంటి చేదు సంఘటనలు రిపీట్ అవ్వకుండా స్టేడియం లోపల, బయట క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం ఆర్సీబీ కొన్ని భారీ ఏర్పాట్లు చేసింది.

"జనాలను కంట్రోల్ చేయడానికి మేం ఏఐ టెక్నాలజీతో పనిచేసే సీసీటీవీలను స్టేడియం అంతటా ఏర్పాటు చేశాం. జార్విస్ అనే ఏఐ టూల్ ద్వారా ఇవి పనిచేస్తాయి. ఏ స్టాండ్‌లో ఎంతమంది ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు మాకు రియల్ టైమ్ అలర్ట్స్ వస్తుంటాయి. దీనివల్ల క్రౌడ్‌ను ఈజీగా మానిటర్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఈ సీసీటీవీ ఫుటేజ్ నేరుగా కమిషనర్ ఆఫీస్‌కు కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది, కాబట్టి వాళ్లు కూడా అక్కడినుంచే పరిస్థితిని గమనించొచ్చు" అని మీనన్ వివరించాడు.

"జనాల రద్దీని కంట్రోల్ చేసే వసతుల కోసం, అలాగే మల్టిపుల్ బ్యాగేజ్ స్కానర్లు, కమాండ్ సెంటర్ల కోసం మేం దాదాపు రూ.7 కోట్లు ఖర్చు చేశాం" అని ఆయన చెప్పాడు. స్థానిక అధికారుల సలహాల మేరకు స్టేడియం ఎంట్రీ, ఎగ్జిట్ దారులను కూడా పూర్తిగా మార్చారు.

మ్యాచ్ రోజుల్లో ఆ టికెట్స్ ఉన్నవాళ్లు మెట్రోలో డైరెక్ట్‌గా స్టేడియం దగ్గరకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇకపోతే ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ తమ ఐదు హోమ్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుండగా, మిగతా రెండు మ్యాచ్‌లను మాత్రం రాయ్‌పూర్‌లో ఆడబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More