బాంబు పేలుడుతో ఎగిరిపడిన శరీర భాగాలు.. మంటల్లో 22 వాహనాలు.. పేలుడు తీవ్రత భారీ స్థాయిలో..
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కారు పేలుడు తీవ్రత అత్యంత భారీగా ఉంది. ఈ పేలుడు ధాటికి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోగా.. ఏకంగా 22 వాహనాలకు మంటలు అంటుకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కి పడింది. 14 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగిన పేలుళ్లలో 8 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. మెల్లగా కదులుతున్న కారు పేలడంతో ఆ పేలుడు ధాటికి శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు తీవ్రత ఎంతలా ఉంది అంటే.. ఏకంగా మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు శబ్దం వినిపించడం గమనార్హం.

ఢిల్లీ పేలుడు భారీగా..
ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని రెడ్ సిగ్నల్ దగ్గర నెమ్మదిగా కదులుతున్న కారులో పేలుడు జరిగింది. ఈ కారు వెనుక భాగంలో పేలుడు సంభవించింది. ఇది హర్యానాలో రిజిస్టర్ అయిన కారుగా భావిస్తున్నారు. బాంబు పేలుడు తర్వాత మృతుల శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా.. 22 వాహనాలకు నిప్పంటుకున్నట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఏమన్నారంటే?
ఎర్రకోట కారు బాంబు పేలుడుపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా స్పందించారు. “ఈరోజు సాయంత్రం 6.52 గంటల సమయంలో మెల్లగా కదులుతున్న వాహనం రెడ్ లైట్ దగ్గర ఆగింది. అప్పుడు అందులో పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. కొందరు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. హోంమంత్రి కూడా మాతో మాట్లాడారు” అని ఆయన వెల్లడించారు.
పేలుడు సంభవించిన కారు హ్యుండయ్ ఐ20గా కొందరు చెబుతుండగా.. మరికొందరు మారుతి సుజుకి డిజైర్ అని అంటున్నారు. పేలుడు సమయంలో ఆ కారులు ప్రయాణికులు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. కారు వెనుక భాగంలో ఈ పేలుడు జరిగింది.
అందరం చనిపోతామనుకున్నాం..
ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ఒక స్థానిక దుకాణదారుడు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తన భయంకర అనుభవాన్ని పంచుకున్నాడు. “నా జీవితంలో ఇంత పెద్ద పేలుడు శబ్దాన్ని నేను ఎప్పుడూ వినలేదు. పేలుడు ధాటికి నేను ఏకంగా మూడుసార్లు కింద పడిపోయాను. మేమందరం చనిపోతామేమో అనిపించింది” అని ఆయన తీవ్ర ఆందోళనతో తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న మరో స్థానికుడు మాట్లాడుతూ, పరిస్థితి భయంకరంగా ఉందని వివరించారు. "మేము సంఘటన స్థలానికి చేరుకున్నప్పుడు, రోడ్డుపై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూశాం. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు" అని చెప్పారు. ఈ ఘటనలో పలు కార్లు కూడా ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు.
“రోడ్డుపై ఎవరిదో చేయి పడి ఉండటం చూసి మేము పూర్తిగా షాక్ అయ్యాము. ఆ భయాన్ని మాటల్లో చెప్పలేను” అని ఆయన ఏఎన్ఐతో అన్నారు. స్థానిక నివాసి రాజ్ధర్ పాండే న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ, తన ఇంటి నుంచి మంటలు కనిపించాయని, వెంటనే ఏం జరిగిందో చూడడానికి కిందకు వచ్చానని చెప్పారు. అప్పుడు "పెద్ద పేలుడు" శబ్దం వినిపించిందని ఆయన తెలిపారు.
ఆటో డ్రైవర్ అనుభవం
పేలుడు ధాటికి గాయపడిన ఆటో డ్రైవర్ జీషన్ పీటీఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ.. పేలిన కారు తనకు "కేవలం రెండు అడుగుల దూరంలో" ఉందని చెప్పారు. “అందులో బాంబు ఉందో లేక మరేదైనా ఉందో నాకు తెలియదు.. కానీ అది పేలింది," అని ఆయన తెలిపారు.
అగ్నిమాపక దళం స్పందన
డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఏకే మాలిక్ మాట్లాడుతూ.. "చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు" గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఏడు ఫైర్ యూనిట్లను సంఘటన స్థలానికి పంపినట్లు చెప్పారు. "సాయంత్రం 7:29 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం జరిగింది" అని ఆయన జోడించారు. ఢిల్లీలో జరిగిన ఈ పేలుడు తర్వాత, ముంబైతో సహా మొత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భద్రతను పెంచారు.

E-Paper












