RR vs GT : ఐపీఎల్‌లో కొత్త ‘స్పీడ్​స్టర్’! 154.2 కిలోమీటర్ల వేగంతో అశోక్ శర్మ గర్జన..

గుజరాత్ టైటాన్స్ యువ పేసర్ అశోక్ శర్మ 154.2 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి రికార్డు సృష్టించాడు. ఈ సీజన్​లో ఇదే ఫాస్టెస్ట్​ డెలివరీ కావడం విశేషం. అంతేకాదు, అదే ఓవర్​లో 150.7 కి.మీ స్పీడ్​తో కూడా బాల్​ వేశాడు అశోక్​.

Published on: Apr 5, 2026, 06:01:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక కొత్త “తుపాను” దూసుకొచ్చింది. అతడే అశోక్ శర్మ! శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ తన నిప్పులు చెరిగే బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒకే ఓవర్‌లో రెండుసార్లు 150 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించి 'నెక్ట్స్​ బిగ్ పేస్ హోప్' అనిపించుకున్నాడు.

అశోక్​ శర్మ.. (AP)
అశోక్​ శర్మ.. (AP)

154.2 కిలోమీటర్ల వేగంతో సంచలనం!

తన రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే అశోక్ శర్మ ఈ అద్భుతం చేయడం విశేషం. మొదటి ఇన్నింగ్స్ 16వ ఓవర్ నాలుగో బంతిని డోనోవన్ ఫెరీరాకు 150.7 కి.మీ వేగంతో విసిరిన అశోక్, అదే ఓవర్ ఆఖరి బంతికి ఏకంగా 154.2 కి.మీ వేగంతో ధ్రువ్ జురెల్‌ను కట్టడి చేశాడు. ప్రస్తుతం ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన టాప్-3 బంతుల్లో రెండు అశోక్ శర్మవే (మొదటిది 154.2 కి.మీ, మూడోది 150.7 కి.మీ) కావడం విశేషం. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అన్రిచ్ నోర్కియా (150.9 కి.మీ) రెండో స్థానంలో ఉన్నాడు.

అయితే, గతంలో మయాంక్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ వంటి వేగవంతమైన బౌలర్లు గాయాల పాలైన నేపథ్యంలో, అశోక్ శర్మను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీసీఐ కోచ్‌లపై ఉంది.

జురెల్ మెరుపులు.. రాజస్థాన్ భారీ స్కోరు

ఇక శనివారం రాత్రి జరిగిన మ్యాచ్​ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ముఖ్యంగా మూడో స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్ 42 బంతుల్లో 75 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఇందులో ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. అశోక్ శర్మ విసిరిన వేగవంతమైన బంతులను సైతం జురెల్ సమర్థవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

పోరాడి ఓడిన గుజరాత్​ టైటాన్స్​..

211 పరుగుల భారీ టార్గెట్​తో బరిలో దిగిన గుజరాత్​ టైటాన్స్​ సైతం అదరగొట్టింది. సాయ్​ సుదర్శన్​ మెరుపులతో (44 బంతుల్లో 73 పరుగులు) టార్గెట్​ని దాదాపు ఛేజ్​ చేసినంత పని చేసింది. కానీ చివర్లో గెలుపును అందుకోలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 204 పరుగుల వద్ద ఆగిపోయింది.

కెప్టెన్​ శుభ్​మాన్​ గిల్​ గాయం కారణంగా ఈ మ్యాచ్​కి దూరం అవ్వడం జట్టుకు మైనస్​ అయ్యిందని చెప్పుకోవాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More