Sonam Wangchuk : జంతర్ మంతర్ వద్ద హైడ్రామా! సోనమ్ వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు..
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను శనివారం ఉదయం దిల్లీ పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద శనివారం ఉదయం తీవ్ర ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షల అక్రమాలు, వరుస పేపర్ లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్తో గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను దిల్లీ పోలీసులు బలవంతంగా నిరసన స్థలం నుంచి తొలగించారు. శనివారం తెల్లవారుజామునే భారీ బందోబస్తుతో జంతర్ మంతర్కు చేరుకున్న పోలీసులు, ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ నిరసనను ముందుండి నడిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు పోలీసుల చర్యను తీవ్రంగా అడ్డుకున్నారు. విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ పోలీసు వాహనాలకు అడ్డంగా నిలబడ్డారు. దీనితో అక్కడ కాసేపు తీవ్ర నెట్టులాట, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.
కాగా సీజేపీ ఫౌండర్ దీప్కేని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
హైకోర్టు ఆదేశాల మేరకే తరలింపు: దిల్లీ పోలీస్ క్లారిటీ
ఈ ఉద్రిక్త పరిణామాలపై దిల్లీ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దిల్లీ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులకు అనుగుణంగానే, అలాగే వైద్య నిపుణుల అత్యవసర సలహా మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
"సుదీర్ఘ దీక్ష కారణంగా సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం చాలా క్లిష్టమైన స్థితికి చేరుకుంది. ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న మెడికల్ రిపోర్టుల ఆధారంగా, అత్యవసర వైద్య సహాయం అందించడానికి మాత్రమే ఆయనను ఆసుపత్రికి తరలించాం. గౌరవ హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్న సమయంలో కొందరు ఆందోళనకారులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయినప్పటికీ పోలీసులు అత్యంత సంయమనం పాటించి, వాంగ్చుక్ను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చారు. జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు కూడా శాంతియుతంగా ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లాలని కోరుతున్నాము," అని దిల్లీ పోలీస్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
క్షీణిస్తున్న ఆరోగ్యం..
సోనమ్ వాంగ్చుక్ 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారం ఆయన్ని పరిశీలించిన వైద్యులు ఆందోళనకర వార్తను చెప్పారు. ఆయన వేగంగా బరువు తగ్గుతున్నారని, దీక్ష విరమించకపోతే అవయవాలు పనిచేయడం ఆపేస్తాయని హెచ్చరించారు.
అయినప్పటికీ దీక్షను విరమించే ప్రసక్తే లేదని సోనమ్ వాంగ్చుక్ తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు వెనకడుగు వేయనని అన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


