Sonam Wangchuk : ‘ప్రతి పౌరుడు ముఖ్యమే- సోనమ్​ వాంగ్​చుక్​ని పట్టించుకోండి’- కేంద్రానికి దిల్లీ హైకోర్టు ఆదేశాలు..

Sonam Wangchuk : నీట్-యూజీ పేపర్ లీకేజీకి నిరసనగా గత కొన్ని రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక విప్లవకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన ఆరోగ్యం, భద్రతను పరిగణించాలని కేంద్రానికి చెప్పింది. 

Published on: Jul 16, 2026, 11:36:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నీట్​ పేపర్​ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్​ చేస్తూ 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్​ వాంగ్​చుక్ ఆరోగ్యం, భద్రతను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆయనను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషిచేయాలని స్పష్టం చేసింది.

సోనమ్ వాంగ్​చుక్ ఆమరణ నిరాహార దీక్ష.. (Amit)
సోనమ్ వాంగ్​చుక్ ఆమరణ నిరాహార దీక్ష.. (Amit)

“సోనమ్​ వాంగ్​చుక్​ జీవితాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషిచేయాలి. వైద్యపరమైన సహకారం కోసం జోక్యం చేసుకోవాలి. ప్రతి పౌరుడి జీవితం ఎంతో విలువైనది. ఆ జీవితాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిగా పనిచేయాలి,” అని దిల్లీహైకోర్టు వ్యాఖ్యానించింది.

సోనమ్ వాంగ్​చుక్ ప్రాణాలను కాపాడేందుకు తక్షణమే ఆసుపత్రికి తరలించాలని, అవసరమైతే బలవంతంగానైనా ఆహారం తినిపించి వైద్య సహాయం అందించాలని కోరుతూ అడ్వకేట్ రాకేష్ కుమార్ సైనీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్​పై కోర్టు ఈ మేరకు స్పందించింది.

"ఒక దేశభక్తుడు, సామాజిక కార్యకర్త గత కొన్ని రోజులుగా అన్నపానీయాలు మాని పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. నిరసనకారులతో మాట్లాడేందుకు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ముందుకు రాలేదు. పైగా ఆయన్ను ఒక కరడుగట్టిన నేరస్థుడిలా, ఉగ్రవాదిలా లేదా దేశద్రోహిలా చూస్తూ ప్రభుత్వం ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోంది," అంటూ పిటిషనర్ తన పిటిషన్​లో పేర్కొన్నారు.

ప్రాణాపాయంలో లద్ధాఖ్ ఉద్యమకారుడు..!

జూన్ 28 నుంచి నిరంతరాయంగా సాగుతున్న ఈ దీక్ష కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ శరీరం పూర్తిగా క్షీణించిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఈ 20 రోజుల్లో ఆయన దాదాపు 8.5 కిలోల బరువు తగ్గారని, ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగితే ఆయన ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లద్ధాఖ్ పర్యావరణ పరిరక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం పోరాడే ఇలాంటి ఒక గొప్ప వ్యక్తికి ఏమైనా జరిగితే అది యావత్ దేశానికే కాకుండా ప్రపంచ దేశాల ముందు భారత్‌కు పెద్ద అవమానంగా మారుతుందని పిటిషన్ పేర్కొంది.

'వైద్య పరంగా సహాయం చేయడానికి సిద్ధం'

దిల్లీ హైకోర్టు ఆదేశాలపై కేంద్రం స్పందించింది. రిపోర్టుల ఆధారంగా సోనమ్ వాంగ్​చుక్​కి అవసరైన వైద్య సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ వైద్యులు, వైద్య నిపుణులు.. ఆయన ఆరోగ్యాన్ని రోజూ పర్యవేక్షిస్తారని హామీ ఇచ్చారు.

అసలేమిటీ కాక్రోచ్ జనతా పార్టీ?

సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఈ పోరాటం వెనుక 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) అనే వినూత్న ఉద్యమ వేదిక ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఒక విచారణ సందర్భంగా న్యాయవాదులకు సీనియర్ హోదా ఇచ్చే అంశంపై మాట్లాడుతూ, కొందరు యువ న్యాయవాదులను ఉద్దేశించి ‘బొద్దింకలు’, ‘పారాసైట్లు’ అని వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని, నకిలీ డిగ్రీలతో న్యాయవ్యవస్థలోకి వస్తున్న వారిని ఉద్దేశించే తాను అలా అన్నానని వివరణ ఇచ్చారు.

అయినప్పటికీ, ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆన్‌లైన్ ఉద్యమంగా పురుడుపోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ, జూన్ 20 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గ్రౌండ్ లెవెల్ ఉద్యమాన్ని ప్రారంభించింది. దేశంలోని విద్యా వ్యవస్థను, పరీక్షల విధానాన్ని భ్రష్టు పట్టించిన నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ప్రధాన్ దిగిపోవాలన్నదే వీరి ప్రధాన డిమాండ్.

దీక్ష విరమించాలని మేధావుల విజ్ఞప్తి

మరోవైపు సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలు కాపాడుకోవాలని, దీక్షను విరమించాలని దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, కళాకారులు, సామాజిక శ్రేయోభిలాషులు కోరుతున్నారు. నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, అరుంధతీ రాయ్, నివేదితా మీనన్, జీన్ డ్రెజ్ వంటి దాదాపు 1800 మందికిపైగా ప్రముఖులు మంగళవారం ఒక బహిరంగ లేఖ ద్వారా వాంగ్‌చుక్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కూడా కాక్రోచ్ జనతా పార్టీ పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూనే, వాంగ్‌చుక్ తన దీక్షను విరమించాలని అభ్యర్థించింది. హైకోర్టు జోక్యంతోనైనా ఈ వివాదానికి తెరపడి, ఆయనకు తగిన వైద్యం అందుతుందని భక్తులు, అభిమానులు ఆశిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More