దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (RERA) పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది సామాన్య కొనుగోలుదారుల కంటే డిఫాల్ట్ బిల్డర్లకే ఎక్కువ సహకరిస్తోందని, రిటైర్డ్ అధికారులకు 'పునరావాస కేంద్రం'గా మారిందని ధ్వజమెత్తింది.
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం, సామాన్య కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఏర్పాటు చేసిన 'రేరా' (RERA) వ్యవస్థ ప్రస్తుతం తన ఉద్దేశ్యాన్ని కోల్పోయిందని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవస్థ కేవలం నిబంధనలు ఉల్లంఘించే బిల్డర్లకు ఒక వరప్రదాయినిలా మారిందని, దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేకపోతే దాన్ని రద్దు చేసినా తమకు అభ్యంతరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
హిమాచల్ ప్రదేశ్ రేరా కార్యాలయాన్ని షిమ్లా నుంచి ధర్మశాలకు తరలించే విషయంలో దాఖలైన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
పనితీరుపై అసహనం:
"బిల్డర్లకు సహకరించడం తప్ప ఈ సంస్థలు మరేమీ చేయడం లేదు. ప్రతి రాష్ట్రంలోనూ ఇవి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి" అని సీజేఐ వ్యాఖ్యానించారు.
బాధితుల ఆవేదన: ఈ సంస్థ ఎవరి కోసమైతే పుట్టిందో, ఆ సామాన్య ప్రజలు ప్రస్తుతం తీవ్ర నిరాశలో, విరక్తిలో ఉన్నారని.. వారికి ఎక్కడా ప్రభావవంతమైన ఉపశమనం లభించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.
నిర్మాణంలో మార్పు: రేరా వ్యవస్థను తిరిగి సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రాలకు కోర్టు సూచించింది.
హిమాచల్ రేరా తరలింపునకు గ్రీన్ సిగ్నల్
షిమ్లాలో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు రేరా కార్యాలయాన్ని ధర్మశాలకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో హిమాచల్ హైకోర్టు ఈ తరలింపుపై ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు నిలిపివేసింది.
"ఒక కార్యాలయాన్ని ఎక్కడికి తరలించాలనేది పూర్తిగా పరిపాలనాపరమైన, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఇందులో న్యాయస్థానాల జోక్యం అవసరం లేదు" అని ధర్మాసనం పేర్కొంది. బాధితులకు ఇబ్బంది కలగకుండా అప్పీలేట్ అధికారాలను కూడా ధర్మశాల జిల్లా జడ్జికి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే, ఈ అథారిటీల్లో రిటైర్డ్ బ్యూరోక్రాట్ల కంటే పర్యావరణ స్పృహ ఉన్న ఆర్కిటెక్టులు, నిపుణుల సేవలను వాడుకుంటేనే ఆయా ప్రాంతాల అభివృద్ధికి మేలు జరుగుతుందని హితవు పలికింది.